Andhra Politics :   రాజకీయ పార్టీలు ప్రజల్లో ఎంత కలసిిపోతే ఓట్ల పరంగా అంత అడ్వాంటేజ్ వస్తుంది. ఆ విషయం రాజకీయ పార్టీలకు తెలియనిదేం కాదు. అయితే ఇలాంటి అడ్వాంటేజ్ ప్రతిపక్ష పార్టీలకు ఎక్కువగా ఉంటుంది. ఎంత మేర ఉపయోగించుకుంటారన్నది కీలకం. ప్రస్తుతం ఏపీలో ఎన్నికలకు ఇంకా ఏడాదికిపైగా సమయం ఉంది .  కొంత కాలంగా ఏపీలో ఎటు  వైపు చూసినా తెలుగుదేశం పార్టీ కార్యక్రమాలే కనిపిస్తున్నాయి. ఇతర పార్టీలు సైలెంట్ గా ఉన్నాయి.  జనసేనాని ఇంకా రంగంలోకి దిగలేదు. సీఎం జగన్ కూడా .. పల్లెబాట అంటున్నారు కానీ ఎప్పటికో తెలియదు. ఇప్పటికైతే  ఓ వైపు లోకేష్.. మరో చంద్రబాబు పర్యటనలతో ఎటు చూసినా టీడీపీనే కనిపిస్తోంది. 


సామాన్యులను ఎక్కువగా కలుస్తూ లోకేష్ పాదయాత్ర


నారా లోకేష్ పాదయాత్ర వంద రోజులు దాటింది.  విరామం అనేది లేకుండా ఉదయం నుంచి రాత్రి వరకూ సాగుతున్న పాదయాత్ర ప్రజల్లోకి చొచ్చుకెళ్తోందన్న అభిప్రాయం వినిపిస్తోంది. లోకేష్ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు. ఇప్పటి వరకూ ఆయన రెండు లక్షల మంది సెల్ఫీలు ఇచ్చి ఉంటారని అంచనా. అలాగే ప్రతీ రోజూ ఓ వర్గంతో చిన్న పాటి సమావేశాలు నిర్వహిస్తున్నారు. అదే సమయంలో నియోజకవర్గాల వారీగా సభలు నిర్వహిస్తున్నారు. సభల వల్ల ఇంపాక్ట్ కంటే చిన్న చిన్న మీటింగ్‌లతో కొన్ని వర్గాలకు భరోసా ఇవ్వడం వల్ల వచ్చే ప్రభావం ఎక్కువ ఉంటుందని భావిస్తున్నారు.  పాదయాత్ర ద్వారా లోకేష్.. పార్టీలకు అతీతంగా మంచి చేస్తారనే తనను కలిసిన వారిలో కల్పిస్తున్నారు. అదిప్లస్ అవుతుందని టీడీపీ వర్గాలు చెబుతున్నాయ.


మరో వైపు ఇదేం ఖర్మ రాష్ట్రానికి పేరుతో టీడీపీ అధినేత టూర్లు


లోకేష్ పాదయాత్ర జోష్ ఓ వైపు సాగుతూండగాేన.. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ఇదేం ఖర్మ రాష్ట్రానికి పేరుతో అన్ని జిల్లాలు చుట్టేస్తున్నారు. వివిధ రకాల కార్యక్రమాలు కింది స్థాయి జనం నాడిని పట్టడంతో పాటు వారికి  భరోసా ఉండేలా వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు. తెర వెనుక ఎప్పటికప్పుడు వ్యూహాలు ఖరారు చేసుకునే స్ట్రాటజిస్టుల బృందం పని చేస్తోంది. వారు చంద్రబాబు, లోకేష్ పర్యటలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారు. 


ఇంకా వారాహిని బయటకు తీసుకు రాని జనసేనాని !


పవర్ స్టార్ పవన్ కల్యాణ్ జనవరి నుంచి  బస్సు యాత్ర ప్రారంభించాలని అనుకున్నారు. ముందస్తు ఎన్నికలు ఉంటాయన్న కారణంగా అలా అనుకున్నారు. ముందస్తు ఉండదని తేలిన తర్వాత ఆయన పెండింగ్ సినిమాలను పూర్తి చేయడంలో బిజీ అయిపోయారు. మళ్లీ డిసెంబర్ లో ముందస్తు ఉంటాయంటే జూన్ నుంచి ఏపీలోనే ఉంటానని  చెప్పారు. కానీ అలాంటి అవకాశాలు కష్టమన్న అభిప్రాయం వినిపిస్తోంది. మార్చిలోనే ఎన్నికలు ఉంటాయని బొత్స సత్యనారాయణ లాంటి వాళ్లు చెబుతున్నారు. దీంతో పవన్ వారాహి యాత్ర కూడా ఆలస్యమయ్యే అవకాశం ఉంది. 


సీఎం జగన్ జిల్లాల టూర్లుఇప్పుడు సాధ్యమేనా ? 


సీఎం జగన్ జిల్లాల టూర్లు చేస్తానని చాలా కాలంగా చెబుతున్నారు. ఆయన జిల్లాలకు వెళ్లి బటన్ నొక్కి వస్తున్నారు. అదే పర్యటనలు అని అనుకోవాలో లేకపోతే.. కొత్తగా ఏమైనా ప్లాన్ చేస్తారో స్పష్టత లేదు.కానీ ప్రభుత్వ పరంగా అనేక సవాళ్లు సీఎం మందు ఉన్నాయి. వాటిని పరిష్కరించుకోవడానికి సమయం కేటాయించాలి. వాటిని సమన్వయం చేసుకుంటూ జిల్లాల పర్యటన అంటే సాగడం కష్టమనే వాదన ఉంది. ఇప్పటి వరకూ సీఎంా బాధ్యతలు చేపట్టిన తర్వాత జగన్ ప్రజల్లోకి వెళ్లింది లేదన్నవిమర్శలు ఉన్నాయి. ఎన్నికల్లోపు వెళ్లకపోతే విపక్షాలకు అదే ప్రధాన అస్త్రం అయ్యే అవకాశం ఉంది.  కనీసం విపత్తులు వచ్చినప్పుడు కూడా పరామర్శకు వెళ్కపోవడం వైసీపీ క్యాడర్ కు కూడా ఇబ్బందికరంగానే ఉంది. 


మొత్తంగా ఏపీలో ఇప్పుడు ఎటు వైపు చూసినా తెలుగుదేశం పార్టీ హడావుడే కనిపిస్తోంది.  మూడు ఎమ్మెల్సీ ఎన్నికల విజయం తర్వాత ప్రజాభిప్రాయం తమకు అనుకూలంగా ఉందన్నభావనను మరింత ఎక్కువగా వారు వ్యాప్తి చేస్తున్నారు. వ్యూహాత్మకంగా ఈ కార్యక్రమాలను ప్రజల్లోకి చొచ్చుకెళ్లేలా చేసుకుంటన్నారు.