East Godavari YSRCP Candidates: వైనాట్‌ 175 అనే నినాదంతో వ్యూహాత్మకంగా ఎమ్మెల్యే అభ్యర్థులను ఎంపిక చేస్తోన్న వైఎస్‌ఆర్‌సీపీ ఇప్పటికే  రెండు దశల్లో నియోజకవర్గ ఇంచార్జ్‌ల జాబితాను విడుదల చేసింది. ఈ రోజు మూడో జాబితా విడుదల విడుదల చేసే అవకాశాలున్నాయి. దీంతో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ముఖ్యంగా సిట్టింగ్‌ ఎమ్మెల్యేల్లో టెన్షన్‌ మొదలైంది. ఆశావాహులు మాత్రం వేయి కళ్లతో ఎదురు చూస్తోన్న పరిస్థితి కనిపిస్తోంది..


సిట్టింగ్‌లకు అవకాశం ఉంటుందా.?
నాలుగు అయిదు దఫాలు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసిన అనుభవం కలిగిన సీనియర్‌ సిట్టింగ్‌లకు సైతం ఈసారి చెమటలు పట్టిస్తోంది వైసీపీ అధిష్ఠానం.. రవాణ శాఖ మంత్రి పినిపే విశ్వరూప్‌ అమలాపురం నియోజకవర్గం నుంచి సీనియర్‌ మంత్రిగా ఉన్నారు. ఈసారి విశ్వరూప్‌కు టిక్కెట్టు ఇచ్చే విషయంలోనూ ఆచితూచి అడుగేస్తోంది వైసీపీ. మూడో జాబితాలో అయినా ఖరారు అవుతుందని ఎదురు చూస్తున్న పరిస్థితి ఉంది. 


కాకినాడ రూరల్‌ నుంచి మాజీ మంత్రి కురసాల కన్నబాబును ఈసారి కాకినాడ ఎంపీగా పంపిస్తారా.. లేక కాకినాడ రూరల్‌ కేటాయిస్తారా అన్నది ఈరోజు తేలే అవకాశం ఉంది. తుని నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తోన్న దాడిశెట్టి రాజాకే ఈసారి అవకాశం దక్కుతుందని తెలుస్తోంది. రాజోలు నుంచి రాపాక వరప్రసాద్‌కు ఇస్తారా లేక అమలాపురం ఎంపీ చింతా అనురాధను పంపిస్తారా అనేది చర్చలు జరుగుతున్నాయి. వీళ్లిద్దరి మధ్యలోకి మాజీ ఎంపీ పండుల రవీంద్రబాబు కూడా రావడంతో పోటీ ఆసక్తిగా మారింది. ముగ్గురిలో ఎవరికి అవకాశం కల్పిస్తారా అన్నది తేలాల్సి ఉంది.


 కొవ్వూరు నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న హోం మంత్రి తానేటి వనితకే ఈసారి అవకాశం దక్కుతుందని తెలుస్తోంది. గడప గడపకు మనప్రభుత్వ కార్యక్రమం సమర్ధవంతంగా నిర్వహించడం, నియోజకవర్గంలో ఆమె గ్రాఫ్‌ బాగానే ఉండడంతో ఈసారి వనితకే టిక్కెట్టు దక్కే అవకాశాలున్నాయని తెలుస్తోంది. మండపేటలో వైసీపీకు ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులకే పగ్గాలు ఇస్తారన్న చర్చ జరుగుతోంది. ఇక్కడ ప్రత్యామ్నాయం లేని పరిస్థితి కనిపిస్తోంది. 


జగ్గిరెడ్డిని కొనసాగించే ఆలోచనలోఉన్నట్లు తెలుస్తోంది. ముమ్మిడిరంలో మార్పు అనివార్యమని పొన్నాడ సతీష్‌ను ఒప్పించి ఇంకొకరికి బాధ్యతలు అప్పగిస్తారన్న చర్చ జరుగుతోంది. కాకినాడ జిల్లాలో కాకినాడ సిటీకు సంబందించి సిట్టింగ్ ఎమ్మెల్యే ద్వారంపూడికే మ‌ళ్లీ బాధ్యతలు అప్పగించబోతున్నట్టు తెలుస్తోంది. కాకినాడ రూర‌ల్‌, పెద్దాపురం, తుని నియోజ‌క‌వ‌ర్గాలు ఇంచార్జ్‌ల‌ను ప్రకటించాల్సి ఉండగా పెద్దాపురం మార్చే అవ‌కాశాలు క‌నిపిస్తున్నాయి. 


ఇప్పటి వరకు ఈ నియోజకవర్గాల్లోనే ప్రకటన..
ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో 21 అసెంబ్లీ నియోజకవర్గాలుండగా వీటిలో ఏడు స్థానాల్లో మాత్రమే నియోజకవర్గ ఇంచార్జ్‌లను నియమించారు. అదికూడా రెండో జాబితాలోనే ఈ లిస్ట్‌ విడుదల కాగా మూడో జాబితా కోసం ఆశావహులు ఎదురు చూస్తున్నారు. రాజమండ్రి సిటీ నుంచి మార్గాని భరత్‌, రూరల్‌ చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, రామచంద్రపురం పిల్లి సూర్యప్రకాశరావు, పిఠాపురం వంగా గీత, పి.గన్నవరం విప్పర్తి వేణుగోపాల్‌, జగ్గంపేట తోట నరసింహం, ప్రత్తిపాడు వరుపుల సుబ్బారావు ను నియమించారు. 


మిగిలిన నియోజకవర్గాల్లో ఎవ్వరిని సిట్టింగ్‌లను కొనసాగిస్తారు.. లేదా మరో నియోజకవర్గానికి పంపిస్తారా.. లేక ఉద్వాసన పలుకుతారా అన్నది నేడు విడుదల కానున్న జాబితాలో క్లారిటీ వచ్చే అవకాశాలున్నాయని తెలుస్తోంది..