YSRCP Leaders Resigns :  వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు వరుసగా ఆ పార్టీకి గుడ్ బై చెబుతున్నారు. కీలక పదవుల్లో ఉన్న వారు.. కీలక బాధ్యతలు నిర్వహించిన వారు అదే పని చేస్తున్నారు. వారు వేరే ఏదైనా పార్టీలో చేరుతున్నారా అంటే అదేమీ ఉండటం లేదు. ఏ పార్టీలోనూ చేరడం లేదు. కనీసం చర్చలు జరిపుతున్నారన్న సంకేతాలు కూడా లేవు. ముందుగా వైసీపీ నుంచి బయటపడాలన్నట్లుగా వారు ఆతృత పడుతున్నారు. వరుసగా రాజీనామాలు చేస్తూ పోతున్నారు. రాజకీయాలకు దూరంగా ఉండాలనుకుంటున్నామని.. వ్యక్తిగత కారణాలు అని చెబుతున్నారు.  వేరే పార్టీలో ఆఫర్ ఉంటే రాజీనామాలు చేయడం వేరు.. అదేమి లేకుండానే.. వీరు వైసీపీకి రాజీనామా చేసి ఖాళీగా అయినా ఉండటానికి సిద్ధం కానీ.. వైసీపీలో మాత్రం ఉండబోమన్నట్లుగా ప్రకటనలు చేస్తూండటం.. ఏపీ రాజకీయవర్గాలను ఆశ్చర్యంలో ముంచెత్తుతోంది. 


వరుసగా పలువురు కీలక  నేతల రాజీనామా


ఏలూరు జిల్లా అధ్యక్షుడు ఆళ్ల కాళీకృష్ణ శ్రీనివాస్ అలియాస్ ఆళ్ల నాని మాజీ మంత్రి. వైఎస్ కుటుంబానికి అత్యంత సన్నిహితుడు. జగన్‌కూ నమ్మకస్తుడే. అయితే ఆయన తన పార్టీ పదవులకు రాజీనామా చేశారు. కారణంగా.. తాను ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉంటానని అందుకే పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనేది  లేదని ఆయన చెప్పారు. పోనీ ఆయన ఏదైనా పార్టీలో చేరుతున్నారా అని రాజకీయవర్గాలు ఆరా తీస్తే.. అసలు అలాంటి ప్రయత్నమే చేయలేదని చెబుతున్నారు. అదే సమయంలో .. అనంతపురం జిల్లా వైసీపీ అధ్యక్షుడు పైలా నరసింహయ్య కూడా అదే  పని చేశారు. తాను వైసీపీకి  రాజీనామా చేస్తున్నట్లుగా ప్రకటించారు. ఆయన గత వారం వరకూ వైసీపీ కార్యక్రమాల్లో యాక్టివ్ గా పాల్గొన్నారు. కానీ హఠాత్తుగా ఆయన వ్యక్తిగత కారణాల వల్ల పార్టీకి రాజీనామా చేస్తున్నట్లుగా జగన్‌కు  లేఖ పంపారు.  


నేతల వ్యక్తిగత ప్రవర్తనతో వైసీపీకి మరకలు - జగన్ ఏం చేయలేకపోతున్నారా?


మాజీ ఎమ్మెల్యేలు అయితే  సైలెంట్ లేకపోతే గుడ్ బై 


వైసీపీ ఓడిపోయిన వెంటనే రాజీనామాల పర్వం ప్రారంభమయింది. మొదటగా మాజీ మంత్రి రావెల కిషోర్ రాజీనామా చేశారు. తర్వాత సిద్ధా రాఘవరావు అదే బాట పట్టారు. తర్వాత గుంటూరు మాజీ ఎమ్మెల్యే మద్దాళి గిరిధర్ రావు, పొన్నూరు మాజీ ఎమ్మెల్యే కిలారి రోశయ్య అదే పని  చేశారు. తర్వాత పిఠాపురం దొరబాబు కూడా హ్యాండిచ్చారు. ఇలా వరుసగా ఒకరి తర్వాత ఒకరు గుడ్ బై చెబుతూ వస్తున్నారు. నిజానికి చాలా మంది నేతలు ఇదే ఆలోచనలో ఉన్నారు. అందుకే పార్టీ తరపున  మాటలు పూర్తిగా తగ్గించాలు. టీడీపీ ప్రభుత్వాన్ని విమర్సించేందుకు ఏ మాత్రం సిద్ధంగా లేరు.  


వైసీపీకి రాజీనామా చేస్తున్న వారు ఏ పార్టీలో చేరుతాలో క్లారిటీ లేదు !


నిజానికి రాజకీయ నేతలు..  ఓ సారి రాజకీయాల్లో పదవుల రుచి మరిగిన తర్వాత ప్రజలు ఫేడవుట్ చేయాలి కానీ.. తాము మాత్రం దొరికిన అవకాశాన్ని పట్టుకుని రాజకీయాల్లో వేలాడేందుకు ప్రయత్నిస్తూనే ఉంటారు. దానికి వైసీపీ నేతలు మినహాయింపు కాదు. కానీ ఇప్పుడు వైసీపీ నుంచి రాజీనామా చేస్తున్న వారిలో ఒక్కరు కూడా ఇతర పార్టీల్లో చేరుతారమని ప్రకటించలేదు. ఆయా పార్టీలు కూడా వీరితో చర్చలు జరపలేదు. అయినా సరే వీరంతా తాము కొంత కాలం రాజకీయాలకు దూరంగా ఉంటామన్న కారణంగా వైసీపీకి  రాజీనామాలు చేస్తున్నారు. ఏ పార్టీలోనూ అవకాశం లేకపోయినా.. ముందస్తుగా వీరంతా రాజీనామాలు చేసి ఖాళీగా అయినా ఉండటానికి సిద్దపడుతున్నారంటే.. అసలేం  జరుగుతుందో చాలా మందికి అర్థం కాని పరిస్థితి. 


ఖచ్చితంగా గెలిచేలా ఉంటేనే పోటీ - వైజాగ్ ఎమ్మెల్సీ ఎన్నికపై టీడీపీ పునరాలోచనలో పడిందా ?


కూటమితో మాట్లాడుకుంటనున్నారా?  సరైన సమయం కోసం చూస్తున్నారా?


వైసీపీ నుంచి ముందు బయటపడాలి.. తర్వాత ఏదో ఓ పార్టీలో చేరవచ్చని ఎక్కువ మంది వైసీపీ నేతలు భావిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లోపు అసెంబ్లీ సీట్లు పెరుగుతాయని.. అందుకే ఏ కూటమి పార్టీల్లో చేరినా తమకు సీటు ఉంటుందన్న నమ్మకంతో ఎక్కువ మంది ఉన్నారు. అందుకే ఒక్కొక్కరుగా ముందుగా వైసీపీ నుంచి బయటపడుతున్నారని.. తర్వాత పరిస్థితిని బట్టి ఓ పార్టీలో చేరవచ్చని అనుకుంటున్నారు. వైసీపీ భవిష్యత్ పై ఆ పార్టీ కీలక నేతల్లో అనేక డౌట్స్ ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీ ఊపందుకుంటున్న సూచనలు.. జగన్మోహన్ రెడ్డిని  వెంటాడుతున్న కేసులు..ఆయన చేస్తున్న రాజకీయం మొత్తంగా వైసీపీ భవిష్యత్ లో కోలుకోవడం కష్టమన్న అభిప్రాయంతోనే ఎక్కువ మంది వేరే దారి చూసుకుంటున్నారు. అ దారి లేకపోతే ఖాళీగా ఉండేందుకు అయినా సిద్ధపడుతున్నారని అంటున్నారు. 


మొత్తంగా  ఇప్పుడు వైసీపీ గడ్డు పరిస్థితుల్లో ఉంది. ఆ పార్టీలో ఉంటడటానికి కూడా సీనియర్ నేతలు ఇష్టపడటం లేదు. ముందు రోజుల్లో మరింత ఎక్కువగా వలసలు జరిగే అవకాశం కనిపిస్తోంది. దీన్ని ఆ ఆ పార్టీ హైకమాండ్ ఎలా ఆపుకుంటుందో చూడాల్సి ఉంది.