BRS : అసెంబ్లీ ఎన్నికల్లో పరాజయం, పార్లమెంట్ ఎన్నికల్లో ఘోరపరాజయం  నుంచి కోలుకుని మళ్లీ తెలంగాణలో సత్తా చాటాలని బీఆర్ఎస్ గట్టి ప్రణాళికలు వేసుకుంటోంది. అయితే ప్రణాళికల్లో భాగమో  లేకపోతే యాధృచ్చికంగా జరిగిపోతున్నాయో కానీ కొన్ని వివాదాలు మాత్రం రాజకీయంగా వచ్చేస్తున్నాయి. వాటిలో తాజాగా హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు. బతకడానికి వచ్చారని ఆంధ్రావారందర్నీ అన్నట్లుగా శేరిలింగంపల్లి ఎమ్మెల్యేపై కౌశిక్ రెడ్డి చేసిన విమర్శలు వైరల్ అయ్యాయి. అసలు వివాదం పక్కపోయింది. మొత్తం ఇదే టాపిక్ పై రెండు రోజుల నుంచి చర్చ జరుగుతోంది. 


బీఆర్ఎస్‌కు అండగా సెటిలర్లు 


భారత రాష్ట్ర సమితికి మొదటి నుంచి సెటిలర్లుగా పిలిచే ఆంధ్ర ప్రాంతం నుంచి వచ్చి స్థిరపడిన ఓటర్లు అండగా ఉంటున్నారు. గత గ్రేటర్ ఎన్నికల్లో పటాన్ చెరు నుంచి పంజాగుట్ట వరకూ  బీఆర్ఎస్ ఏకపక్ష విజయాలు సాధించడంతో మేయర్ పీఠం అందుకోగలిగింది. గత అసెంబ్లీ ఎన్నికల్లో  ఇతర చోట్ల తుడిచి పెట్టుకుపోయినా గ్రేటర్ లో క్లీన్ స్వీప్ చేసింది. దీనంతటికి కారణంగా సెటిలర్ ఓట్లే. టీడీపీకి పట్టు ఉందని అనుకున్నప్పటికీ ఆ పార్టీకి చెందిన లీడర్, క్యాడర్ మొత్తాన్ని చేర్చుకోడవంతో  బీఆర్ఎస్ బలపడింది. తెలంగాణ వచ్చిన తర్వాత కేసీఆర్ ఎప్పుడూ ప్రాంతీయ విద్వేషాల దిశగా రాజకీయం చేయలేదు. నేతలకు కీలక పదవులు కూడా ఇచ్చారు. 


గణేష్ నిమజ్జనం నిబంధనలివే! - హైదరాబాద్ పోలీసుల కీలక ప్రకటన


ఇప్పుడు సెటిలర్లను టార్గెట్ చేసిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే


ఇప్పుడు హుజూరాబాద్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి సెటిలర్లను టార్గెట్ చేశారు. బతకడానికి వచ్చి పెత్తనం చేయాలనుకుంటున్నారని మండిపడ్డారు. ఈ మాటలు సూటిగా హైదరాబాద్ వాసులకు తగులుతాయనడంలో సందేహం లేదు. ఎందుకంటే.. హైదరాబాద్ లో ఉన్న 90 శాతం మంది ఇతర ప్రాంతాల నుంచి ఉపాధి కోసం వచ్చిన వారే. ఇప్పుడు ఉద్దేశపూర్వకంగా వీరందర్న బీఆర్ఎస్ ఎందుకు టార్గెట్ చేసిందనేది రాజకీయంగా ఆసక్తికరమైన విషయం. కౌశిక్ రెడ్డి ఆవేశంలో ఇలాంటి వ్యాఖ్యలు చేశారా లేకపోతే.. పార్టీ స్ట్రాటజీని ఇలా అమలు చేశారా అన్నదానిపై ఇంకా స్పష్టత రాలేదు. ఎవరూ చెప్పరు.బీఆర్ఎస్ ముందు ముందు తీసుకునే స్ట్రాటజీని బట్టి కౌశిక్ రెడ్డి నోరు జారారా.. ప్లాన్ ప్రకారమే వెళ్లారా అన్నది అంచనా వేసుకోవచ్చు. తెలంగాణ ఉద్యమం ఊపందుకోవడానికి కారణాలను అన్వేషించిన బీఆర్ఎస్ పెద్దలు మళ్లీ అదే ఫార్ములాతో ప్రయత్నించే అవకాశాలు కూడా ఉన్నాయంటున్నారు. అయితే అప్పట్లో ఉమ్మడి రాష్ట్రం.. ఇప్పుడు తెలంగాణం. ఆ వ్యూహాలను అమలు చేయడం ఎలా సాధ్యమన్న చర్చ కూడా ఉంది. 


చర్చ ప్రాంతీయ వాదం వైపు వెళ్లకుండా జాగ్రత్తపడ్డ హరీష్ రావు


అసలు వివాదం..  అరికెపూడి గాంధీకి ఏపీసీ చైర్మన్ పదవి ఇవ్వడంతో ప్రారంభమయింది. కౌశిక్ రెడ్డి దూకుడుకు.. హరీష్ కూడా జత కలవడంతో ఓ రోజంతా రచ్చ అయింది. అయితే రెండో రోజు బీఆర్ఎస్ నేతలు పూర్తిగా  చల్లబడ్డారు. హరీష్ రావు అరికెపూడి గాంధీపై ఆరోపణలు ఆపేసి ఇదంతా రేవంత్ రెడ్డి చేస్తున్న కుట్రగా చెప్పారు. సమస్యలను డైవర్ట్ చేయడానికే వివాదాలు సృష్టిస్తున్నారని ఆరోపించారు. సెటిలర్ల విషయంలో కౌశిక్ రెడ్డి అందర్నీ కించ పరచలేదని. గాంధీ చేసిన విమర్శలకు కౌంటర్ మాత్రమే ఇచ్చారని కవర్ చేస్తున్నారు. హరీష్ స్పందనను  బట్టి చూస్తే.. ఇప్పటికైతే కౌశిక్ రెడ్డి వ్యాఖ్యలను బీఆర్ఎస్ తమకు అన్వయించుకోవడానికి సిద్ధంగా లేదని అనుకోవచ్చు. 


'నిబంధనలు లేకుండా సాయం విడుదల చేయండి' - కేంద్ర బృందంతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ


వచ్చే గ్రేటర్ ఎన్నికల కోసమే ! 


వచ్చే ఏడాది గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు ఉన్నాయి. ఈ ఎన్నికలు అన్ని పార్టీలకు కీలకమే. దాదాపుగా30 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో ఎన్నికలు జరుగుతాయి. గతంలో కాంగ్రెస్ రెండు, మూడు కార్పొరేట్ర్ సీట్లను గెల్చుకోవడానికే తంటాలు పడేది. ఈ సారి మేయర్ పీఠం గెలుచుకోవాలనుకుంటోంది. అందుకే కౌశిక్ రెడ్డి వ్యాఖ్యలను వీలైనంతగా రాజకీయం చేసింది. ఆలస్యంగా అయినా బీఆర్ఎస్ గుర్తించింది కానీ.. అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయిందన్న వాదన వినిపిస్తోంది.