Telangana :  తెలంగాణలో గవర్నర్ కోటా ఎమ్మెల్సీల వివాదం ఇంకా కొనసాగుతోంది. కొత్త గవర్నర్ గా జిష్ణుదేవ్ వర్మ బాధ్యతలు చేపట్టడంతో తెలంగాణ ప్రభుత్వం గవర్నర్ కోటాలో ఖాళీగా ఉన్న ఎమ్మెల్సీ స్థానాలను భర్తీ చేసేందుకు సిద్దమయింది. కోదండరాం, మీర్ అలీఖాన్‌లను సిఫారసు చేయాలని కేబినెట్ నిర్ణయించినట్లుగా తెలుస్తోంది. అయితే వెంటనే బీఆర్ఎస్ నేతలు దాసోజు శ్రవణ్ , కుర్ర సత్యనారాయణలు గవర్నర్‌కు లేఖ రాశారు. హైకోర్టు తీర్పు ప్రకారం  తమనే ఎమ్మెల్యేలుగా నామినేట్ చేయాలని లేఖలో కోరారు. ఎమ్మెల్సీల నియమాకం విషయమై సుప్రీంకోర్టులో కేసు పెండింగ్‌లో ఉందని గవర్నర్ దృష్టికి తీసుకెళ్లారు.                       


రెండు ఎమ్మెల్సీ స్థానాల భర్తీపై వివాదం  


రెండు గవర్నర్ కోటా ఎమ్మెల్సీ స్థానాలపై వివాదం చాలా కాలంగా ఉంది. బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు దాసోజు శ్రవణ్‌కుమార్‌, కుర్ర సత్యనారాయణలను గవర్నర్‌కోటాలో ఎమ్మెల్సీలుగా సిఫారసు చేస్తూ అప్పటి కేబినెట్ నిర్ణయం తీసుకుంది. అయితే అప్పటి  అప్పటి గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ కొద్ది రోజులు పరిశీలన తర్వాత వీరికి ఎమ్మెల్సీలు అయ్యే అర్హత లేదని  తిప్పి పంపారు. అయితే కేసీఆర్ మరోసారి వారి పేర్లు సిఫారసు చేయడమో లేకపోతే మరో ఇద్దరి పేర్లు సిఫారసు చేయడమో చేయలేదు. ఈ లోపు ఎన్నికలు వచ్చాయి. ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓడిపోయింది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే కోదండరాం, మీర్ అలీ ఖాన్  పేర్లను ఖరారు చేసి గవర్నర్‌కు పంపారు. గవర్నర్ ఆ పేర్లకు ఆమోద ముద్రవేశారు. 


  కోదండరాం, అమీర్ అలీ ఖాన్ నియమకాల్ని రద్దు చేసిన హైకోర్టు     


 కేబినెట్   నిర్ణయాన్ని తిరస్కరించే అధికారం గవర్నర్‌కు లేదని తమతోనే ఎమ్మెల్సీలుగా ప్రమాణం చేయాలని కోరుతూ  దాసోజు శ్రవణ్ ,కుర్ర సత్యనారాయణ కోర్టుకు వెళ్లారు.  విచారణ జరిపిన  హైకోర్టు  సదరు సిఫార్సులను తిరస్కరిస్తూ 2023 సెప్టెంబర్‌ 19న గవర్నర్‌ ఇచ్చిన ఆదేశాలను రద్దు చేసింది. దీంతోపాటు గవర్నర్‌ ఆదేశాల మేరకు కోదండరామ్, ఆమీర్‌ అలీఖాన్‌లను ఎమ్మెల్సీలుగా నియమిస్తూ 2024 జనవరి 27న ప్రభుత్వం జారీ చేసిన గెజిట్‌ నోటిఫికేషన్‌ను కూడా రద్దు చేసింది.  


హైకోర్టు తీర్పు ప్రకారం తమనే ఎమ్మెల్సీలుగా నామినేట్ చేయాలంటున్నదాసోజు , కుర్ర


అప్పటి గవర్నర్ తమిళిశై సౌందరరాజన్.. సిఫార్సులను తిరస్కరిస్తూ 2023 సెప్టెంబర్‌ 19న గవర్నర్‌ ఇచ్చిన ఆదేశాలను రద్దు చేసినందున.. అప్పటి కేబినెట్ చేసిన సిఫారసులు వాలిడ్‌లోనే ఉన్నట్లని దాసోజు శ్రవణ్, కుర్రా సత్యనారాయణ గవర్నర్ దృష్టికి తీసుకెళ్లారు.  అందుకే తమ పేర్లను ఎమ్మెల్సీలుగా నామినేట్ చేయడం సముచితమని వారు చెప్పారు.  ఈ మేరకు లేఖలో హైకోర్టులో పిటిషన్లు, తీర్పుల సమగ్ర సమాచారాన్ని గవర్నర్‌కు పంపారు. 


మరో సారి వారి పేర్లనే సిఫారసు చేసిన తెలంగాణ కేబినెట్  


హైకోర్టు తీర్పు ప్రకారం  కేబినెట్ మరోసారి  కోదండరాం, మీర్ అలీ ఖాన్ పేర్లను సిఫారసు చేసింది.  గవర్నర్ ఏ నిర్ణయం తీసుకుంటారన్నదానిపై ఉత్కంఠ ఏర్పడింది.