AP CPS Issue :   ఆంధ్రప్రదేశ్‌లో కాంట్రీబ్యూటరీ పెన్షన్ స్కీమ్ అంశం మరోసారి ఉద్ధృతంగా తెరపైకి వచ్చే అవకాశం కనిపిస్తోంది. ఓ వైపు సీపీఎస్ ఉద్యోగులు ప్రభుత్వ తీరుపై తీవ్రమైన పోరాటం చేయాలని భావిస్తున్నారు. సెప్టెంబర్ ఒకటో తేదీన మిలియన్ మార్చ్‌కు పిలుపునిచ్చారు. సీఎం ఇంటిని ముట్టడిస్తామంటున్నారు. మరో వైపు ప్రభుత్వం సీపీఎస్ రద్దు అంశం ఇప్పటి వరకూ సాధ్యం కాదని అంటున్నా తాజాగా రహస్యంగా  సీపీఎస్‌ను రద్దు చేసిన రాజస్తాన్, చత్తీస్‌ఘడ్ వంటి రాష్ట్రాల్లో ప్రక్రియను పరిశీలింపచేయించడం ఆసక్తికరంగా మారింది. ఏపీ ప్రభుత్వం ఉద్యోగుల ఒత్తిడికి తలొగ్గుతుందా ?. ఉద్యోగులు తాడో పేడో తేల్చుకుంటారా ? సీపీఎస్ రద్దు అంశానికి ప్రభుత్వం ఎలాంటి ముగింపు ఇవ్వాలనుకుంటోంది ?


సీపీఎస్ రద్దు అంశంపై ఏపీ ప్రభుత్వం మల్లగుల్లాలు !


అధికారంలోకి వచ్చిన వారంలో సీపీఎస్ రద్దు అని ప్రతి పక్షంలో ఉన్నప్పుడు సీఎం జగన్ మైక్ అందుకున్న ప్రతీ సారి చెప్పేవారు. పాదయాత్రలో పాల్గొన్న ఉద్యోగ సంఘ నేతలతో కలిసి ప్లకార్డులు పట్టుకుని ప్రదర్శించారు. అయితే సీఎం జగన్ అధికారం చేపట్టి మూడేళ్లయింది. కానీ సీపీఎస్ మాత్రం రద్దు కాలేదు. పైగా అవగాహన లేకుండా ఆ హామీ ఇచ్చామని ముఖ్య సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ప్రకటించడం ఉద్యోగ వర్గాల్లో తీవ్ర వ్యతిరేకతకు కారణం అయింది. సీపీఎస్ రద్దు చేయాల్సిందేనని ఉద్యోగ సంఘాలు పట్టుబడుతున్నాయి. అయితే సీపీఎస్ రద్దు చేస్తే రాష్ట్ర బడ్జెట్‌ కూడా సరిపోదని సజ్జల చెబుతున్నారు. ఏపీలో ఈ వివాదం ఇలా నడుస్తూండగానే..  రాజస్తాన్, చత్తీస్‌ఘడ్ ప్రభుత్వాలు సీపీఎస్ స్కీమ్‌ను రద్దు చేస్తున్నట్లుగా ప్రకటించాయి.  ఇది ఏపీ ప్రభుత్వాన్ని మరింతగా ఇబ్బంది పెట్టింది.  వారు చేయగా..  మీరెందుకు చేయలేరన్న ప్రశ్నలు వస్తున్నాయి. దీంతో ప్రభుత్వం ఆయా రాష్ట్రాల్లో ఎలా చేశారో కనుక్కోవాలని ప్రత్యేక బృందాన్ని పంపింది. ఆ బృందం... నివేదిక ఇవ్వనుంది. ఆ తర్వాత సీపీఎస్ రద్దుపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోనుంది. అయితే ఇప్పటికే సీపీఎస్ రద్దు చేసి.. పాత పెన్,న్ తీసుకు రావడం సాధ్యం కాదని.. అందులో ఉన్న ప్రయోజనాలన్నీ ఇస్తామని ప్రభుత్వం చెబుతోంది. కానీ దానికి ఉద్యోగ సంఘాల నేతలు అంగీకరించడం లేదు. 


సెప్టెంబర్ ఒకటిన మిలియన్ మార్చ్‌కు పిలుపునిచ్చిన ఉద్యోగులు!


సీపీఎస్ రద్దు చేయాల్సిందేనని ఉద్యోగులు పట్టుబడుతున్నారు. ప్రభుత్వం దిగి వచ్చే వరకూ పోరాటం ఆగదని చెబుతున్నారు. సెప్టెంబర్  1న విజయవాడలో మిలియన్ మార్చ్ నిర్వహిస్తామని సీపీఎస్ ఉద్యోగ సంఘాలు ప్రకటించాయి. సెప్టెంబర్ 1న కుటుంబ సభ్యులతో మిలియన్‌ మార్చ్‌ నిర్వహిస్తామని సీపీఎస్ ఉద్యోగ సంఘాలు తెలిపాయి. డిమాండ్ల సాధనకు ఉద్యమాన్ని మరింత ఉద్ధృతం చేస్తామని ఉద్యోగ సంఘాల నేతలు హెచ్చరించారు. సీసీఎస్ స్థానంలో తెచ్చిన ఓపీఎస్‌ వల్ల ప్రయోజనం లేదని, సీపీఎస్ రద్దు చేయకుంటే 2024 ఎన్నికల్లో వైఎస్ఆర్‌సీపీ ఓటమి తప్పదని ఉద్యోగ సంఘాలు హెచ్చరించాయి. సీపీఎస్‌ రద్దు కోసం సీపీఎస్ ఉద్యోగులు ప్రత్యేక సంఘాలుగా ఏర్పడ్డారు. వారిలో టీచర్లే ఎక్కువ మంది ఉన్నారు.ఈ కారణంగా టీచర్ ఉద్యోగ సంఘాలు ఈ ఆందోళనల్లో చురుకుగా పాల్గొంటున్నాయి. గతంలో పీఆర్సీ విషయంలో  నిర్వహించిన చలో విజయవాడ  విజయవంతంలోనూ టీచర్లదే కీలక పాత్ర కావడంతో వారి పోరాట తీవ్రత ఎక్కువగా ఉండే అవకాశాలే కనిపిస్తున్నాయి. 


సీపీఎస్ స్కీమ్ కంటిన్యూ చేస్తామని హామీ ఇచ్చి అప్పు తెచ్చుకున్న ఏపీ ప్రభుత్వం ! 


ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ - సీపీఎస్ పథకంలోి ప్రభుత్వం, ఉద్యోగల వాటాను చూపించి ఏపీ సర్కారు కొత్త రుణాలను తీసుకోవాలని అనుకుంటోంది. ఇందుకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం నుండి అనుమతి కూడా పొందింది. రాజ్యసభలో అడిగిన ప్రశ్నపై కేంద్ర ఆర్థికశాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి విషయాన్ని వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొత్తం 1,92,000 మంది సీపీఎస్ స్కీమ్‌లో ఉన్న ఉద్యోగులు ఉన్నారు. కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ కింద పదవీ విరమణ తర్వాత ఒకేసారి డబ్బు ఇచ్చే విధంగా ఉద్యోగుల వేతనం నుండి 10 శాతం సీపీఎస్ కింద జమ చేస్తారు. అంతే మొత్తంలో రాష్ట్ర ప్రభుత్వం కూడా జమ చేస్తుంది. ఈ రెండింటి మొత్తాన్ని అథారిటీకి జమ చేస్తుంది సర్కారు. సీపీఎస్ విధానంలో ఉద్యోగుల నుండి 10 శాతం జమ చేస్తుంటే.. రాష్ట్ర ప్రభుత్వం 14 శాతం జమ చేయాలని కేంద్ర ప్రభుత్వం నిబంధనలు మార్చింది. కానీ ఆంధ్రప్రదేశ్ లో ఇంకా అది అమలు కావడం లేదు. రాష్ట్రం ఉద్యోగులకు 10శాతం చొప్పున జమ చేస్తున్నందున ఆ మేరకు రుణాలు పొందేందుకు అనుమతి ఇవ్వాలని అడగ్గా... కేంద్రంలో ప్రభుత్వం అనుమతి మంజూరు చేసింది. 2022-23 ఆర్థిక ఏడాదిలో సీపీఎస్ వాటా కింద చెల్లించే మొత్తం ఆధారంగా.. బహిరంగా మార్కెట్ లో ఆ మేరకు రుణాలు పొందవచ్చని కేంద్రం వెల్లడించింది.  


ఎన్నికల ముందు సీపీఎస్‌ సమస్యకు పరిష్కారం చూపించే యోచన !


ఎన్నికలకు ముందు సీపీఎస్ సమస్యకు ఎలాగైనా పరిష్కారం చూపించాలని ప్రభుత్వం పట్టుదలగా ఉన్నట్లుగా తెలుస్తోంది. అందుకే ఇతర రాష్ట్రాల్లో అధ్యయనం చేయిస్తున్నాయి. ఆ నివేదిక వచ్చిన తర్వాత ఉద్యోగ సంఘాలతో మాట్లాడి.. ఆమోదయోగ్యమైన పరిష్కారం కనుగొనాలని అనుకుంటున్నారు. కానీ అదంతా తేలిక కాదనేది.. ఇప్పటి వరకూ సీపీఎస్ సమస్యను లోతుగా పరిశీలిస్తున్న వారు చెబుతున్నమాట.  మరి ప్రభుత్వం ఎలా ఈ సమస్యను పరిష్కరించబోతోంతో..   త్వరలో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.