వైరా నియోజకవర్గం బీఆర్ఎస్ లో వైరం ఆరని మంటలా సాగుతోందని బిజెపి రాష్ట్ర ప్రచార కమిటీ చైర్మన్ ఈటెల రాజేందర్ వ్యాఖ్యానించారు. వైరాలో శనివారం నియోజకవర్గస్థాయిలో పోలింగ్‌ బూత్‌ జెంట్లతో నిర్వహించిన సమావేశంలో ఈటల ప్రసంగించారు. వైరాలో బీఆర్‌ఎస్‌ సిట్టింగ్‌ ఎమ్మెల్యే  రాములునాయక్‌ వచ్చే ఎన్నికల్లో అభ్యర్థిగా ప్రకటించిన మాజీ ఎమ్మెల్యే బాణోతును ప్రకటించడంతో వైరా నియోజకవర్గంలో అసమ్మతి రగులుతోందని తెలిపారు. వైరాలో బీజేపీ సమావేశం విజయవంతం కావడం పట్ల నాయకులను ఈటల అభినందించారు.


ఈ సందర్భంగా ఈటెల మాట్లాడుతూ...  వైరాలో బీఆర్‌ఎస్‌ సిట్టింగ్‌ ఎమ్మెల్యే లావుడ్యా రాములునాయక్‌ వచ్చే ఎన్నికల్లో అభ్యర్థిగా ప్రకటించిన మాజీ ఎమ్మెల్యే బాణోతు మదన్‌లాల్‌ సీఎం కేసీఆర్‌ బాధితులేనని, ఇద్దరూ కేసీఆర్‌ వద్ద అవమానాలకు గురైనవారేనని వ్యాఖ్యానించారు. గిరిజన ఎమ్మెల్యేగా ఉన్న రాములునాయక్‌ ఇంకా పదవి నుంచి దిగిపోకముందే ఆయన అధికారాలకు మంత్రి పువ్వాడ ద్వారా కేసీఆర్‌ కత్తెర వేయించారని విమర్శించారు. ఇప్పుడు టిక్కెట్‌ లభించిన మదన్‌లాల్‌ కూడా గత నాలుగున్నరేళ్లుగా కేసీఆర్‌ నుంచి అవమానాలను అనుభవించినవాడేనని తెలిపారు.


వచ్చే ఎన్నికల్లో టికెట్ కోసం సిట్టింగ్ ఎమ్మెల్యే రాములు నాయక్ చేసిన ప్రయత్నాలు ఫలించక... మాజీ ఎమ్మెల్యే మదన్ లాల్ కు అధిష్టానం అవకాశం ఇవ్వడంతో ఎమ్మెల్యే తో పాటు ఆయన మార్గం మండిపడిందని తెలిపారు. తమ సత్తా చూపిస్తామని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సొంత పార్టీకే సవాళ్లు విసురుతున్నారని ఎద్దేవా చేశారు.


వైరా ఎమ్మెల్యేను ఆయన పదవీకాలం పూర్తికాకముందే ఆయన్ను కేసీఆర్‌ గడ్డిపరకలా తీసివేశారని వ్యాఖ్యానించారు. ఆ ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలే అందుకు నిదర్శనమన్నారు. రాములునాయక్‌ గిరిజన ఎమ్మెల్యే, పేదవాడు, నోట్లో నాలుక లేనివాడు కావడమే కాకుండా కేసీఆర్‌కు అత్యంత విధేయతను ప్రకటించినందునే అవమానాలు ఎదుర్కోవాల్సి వస్తుందన్నారు.


కేసీఆర్‌ ఒక దొర అని, ఆయన దగ్గర అందరూ జీతగాళ్లేనని వ్యాఖ్యానించారు. ఆదివాసీ గిరిజన జిల్లాలైన ఆదిలాబాద్‌, వరంగల్‌లలో కేవలం మూడేసి నియోజకవర్గాలు మాత్రమే గిరిజనులకు ఉన్నాయని, ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఐదు గిరిజన నియోజకవర్గాలున్నా గిరిజనులను కేసీఆర్‌ వంచిస్తున్నారని విమర్శించారు. కేంద్రంలో మోదీ ప్రభుత్వం రైతుల కోసం అనేక కార్యక్రమాలు ప్రవేశపెట్టిందని తెలిపారు. వచ్చే ఎన్నికల్లో బీఆర్‌ఎస్‏కు బుద్ది చెప్పి తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమని స్పష్టం చేశారు. వైరాలో కూడా బీజేపీ అభ్యర్థిని గెలిపించాలని పిలుపునిచ్చారు.


మదన్‌లాల్‌ తానూ హాస్టల్‌లో కలిసి చదువుకున్నామని, గత ఎన్నికల్లో ఆయన ఓడిపోయాక రాములునాయక్‌ను బీఆర్‌ఎ్‌సలోకి తీసుకొని మదన్‌లాల్‌ ప్రగతిభవన్‌గేట్‌ వద్ద పడిగాపులు కాసినా కేసీఆర్‌ ఆయనకు అపాయిట్‌మెంట్‌ ఇవ్వకుండా అవమానించారన్నారు. ఆ విషయాన్ని మదన్‌లాల్‌ తనకు అనేకసార్లు చెప్పుకొని బాధపడేవాడని ఈటల వివరించారు. రాములునాయక్‌, మదన్‌లాల్‌ ఇద్దరూ కూడా కేసీఆర్‌ బాధితులేనన్నారు.


అంతకముందు వైరాలో నిర్వహించిన ర్యాలీలో ఈటలతోపాటు పలువురు నాయకులు పాల్గొన్నారు. ఈటలను గజమాలతో సన్మానించారు. కార్యక్రమంలో మాజీ ఎంపీలు గరికపాటి మోహన్‌రావు, సురే్‌షరెడ్డి, మాజీమంత్రి రవీందర్‌నాయక్‌, నాయకులు పొంగులేటి సుధాకర్‌రెడ్డి, శ్రీశైలం గౌడ్‌, అశ్వథామరెడ్డి, కొండపల్లి శ్రీధర్‌రెడ్డి, గల్లా సత్యనారాయణ, సంపత్‌నాయక్‌, భూక్యా శ్యాంసుందర్‌, రామలింగేశ్వరరావు, రవీందర్‌, నెల్లూరి కోటేశ్వరరావు, కృష్ణరాథోడ్‌, డాక్టర్‌ పాపారావు, జానకీరామారావు, ఏలే భద్రయ్య, వెంకటకృష్ణ పాల్గొన్నారు.