Janasena Slow :  ఆంధ్రప్రదేశ్  రాజకీయాలు డైనమిక్‌గా మారిపోతున్నాయి. వాస్తవంగా ఎన్నికలుకు ఇంకా ఏడాదిన్నర సమయం ఉంది. కానీ అన్ని రాజకీయ పార్టీలు వచ్చే నెల్లోనే ఎన్నికలన్నంతగా హడావుడి పడుతున్నాయి. అధినేతలు ప్రజల మధ్యకు వెళ్తున్నారు. అభ్యర్థులను ఖరారు చేస్తున్నారు. ఒకటికి మూడు సంస్థలతో సర్వేలు చేయించుకుంటున్నారు. అధికార వైఎస్ఆర్‌సీపీ, తెలుగుదేశం ఈ విషయంలో ఒకరితో ఒకరు పోటీ పడుతున్నారు. కానీ మరో ప్రధాన పార్టీ జనసేన మాత్రం పవన్ కల్యాణ్ ఏపీకి వచ్చినప్పుడు మాత్రమే హైలెట్ అవుతూ ఉంటుంది. మిగతా సందర్భాల్లో సైలెంట్  గా ఉంటుంది. దీంతో ఆ పార్టీ వెనుకబడిపోతోందన్న అభిప్రాయం వినిపించడానికి కారణం అవుతోంది. 


ముందుగానే  ప్రజల్లోకి అధికార పార్టీ !


సాధారణంగా అధికారంలో ఉన్న పార్టీ రాజకీయాలపై తక్కువగా ఫోకస్ చేస్తుంది. ఎందుకంటే ప్రజలు ఓటు వేసేటప్పుడు  ప్రభుత్వం కొనసాగాలా.. మార్పు కావాలా అన్న ఉద్దేశంతోనే ఓట్లు వేస్తారు. అందుకే అధికారంలో ఉన్న పార్టీలు మెరుగైన పాలన అందించి ప్రజల నుంచి మరో అవకాశాన్ని పొందడానికి ప్రయత్నిస్తాయి. కానీ సీఎం జగన్ మాత్రం రాజకీయాలకు ప్రాధాన్యం ఇస్తున్నారు. ఏడాది కిందటి నుంచి ఆయన వచ్చే ఎన్నికలకు అభ్యర్థుల ఎంపిక.. ప్రచారం తరహా కార్యక్రమాలు ప్రారంభించేశారు. గడప గడపకూ మన ప్రభుత్వంపేరుతో ఓ రకంగా ఎన్నికల ప్రచారం చేస్తున్నారు. అదే సమయంలో అభ్యర్థుల ఎంపికపైనా ఓ అవగాహనకు వచ్చారని.. చెబుతున్నారు. వ్యతిరేకత ఎక్కువ ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేలను పక్కన పెట్టి కొత్త వారిని కూడా ఖరారు చేసుకున్నారు. అయితే బయట పెట్టడం లేదు. కానీ అంతర్గతంగా సంకేతాలు వెళ్లిపోతున్నాయి. ఓ రకంగా ఎన్నికల సన్నద్దతను జగన్ దాదాపుగా పూర్తి చేశారని అనుకోవచ్చు. ఇప్పుడు ఆయన జిల్లాల పర్యటనలో ఉన్నారు.  జగన్ సన్నద్ధత జోరు చూసి ముందస్తు ఎన్నికలు ఉంటాయేమోనని ఎక్కువగా భావిస్తున్నారు. 


చురుగ్గా ప్రజల్లోకి వెళ్తున్న టీడీపీ !


టీడీపీ బాదుడే బాదుడు అని చేస్తూనే...  కొత్తగా ఇదేం ఖర్మ రాష్ట్రానికి అని పర్యటనలు ప్రారంభించారు. లోకేష్ తన పాదయాత్రకు విస్తృతంగా సన్నాహాలు చేసుకుంటున్నారు. ఆ పార్టీ వ్యవస్థలు మొత్తం యాక్టివ్ అయిపోయాయి. తాడో పేడో అన్నట్లుగా పోరాటం ప్రారంభించాయి. ప్రతీ నియోజకవర్గంలో ఇంచార్జులకు టిక్కెట్లపై చంద్రబాబు క్లారిటీ ఇచ్చారు. ఖచ్చితంగా గెలిచే చాన్స్ఉన్న వంద సీట్లపై ప్రధానంగా దృష్టి పెట్టి ముందుగానే అభ్యర్థుల్ని కూడా ఖరారు చేసి ఎవరూ ఊహించని రాజకీయ వ్యూహాలు అమలు చేస్తున్నారని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. ఎన్నికలు ఇప్పటికిప్పుడు వచ్చినా తక్షణం 175 నియోజకవర్గాల్లో అభ్యర్థుల్ని ప్రకటించి.. ప్రచారానికి వెళ్లిపోయేలా చంద్రబాబు కసరత్తు పూర్తయిందని అంటున్నారు. టీడీపీ కూడా పలు రకాల సర్వేలు చేయించుకుంటోంది. రాబిన్ శర్మ అనే స్ట్రాటజిస్ట్ ఆ పార్టీకి పని చేస్తున్నారు. 


ఇంకా ప్రణాళికల దశ నుంచి అమల్లోకి రాని జనసేన సన్నాహాలు !
  
పవన్ కల్యాణ్ వారాంతాల్లో ఏపీకి వస్తున్నారు. వైసీపీ ఎలా గెలుస్తుందో చూస్తామని ప్రకటిస్తున్నారు. ఒక్క చాన్సివ్వాలని అడుగుతున్నారు. అంతా బాగానే ఉంటుంది కానీ..ఈ హడావుడి అంతా ఆయన ఏపీలో పర్యటించినప్పుడే . తర్వాత మళ్లీ మామూలే. అక్కడక్కడ నాదెండ్ల మనోహర్ పర్యటిస్తున్నప్పటికీ.. కొద్దిమంది పార్టీ  క్యాడర్ పాల్గొనే సమావేశాలు.. తప్ప ప్రజల్ని ఎంగేజ్ చేసే ప్రోగ్రాములేమీ ఉండటం లేదు. జనసేనకు ప్రత్యేకంగా స్ట్రాటజిస్ట్ కూడా లేరు. ఇక అభ్యర్థుల ఎంపికపై కసరత్తు .. నియోజకవర్గాల సమీక్షల ఊసే లేదు. గతంలో సమీక్షలు చేస్తామని పవన్ కల్యాణ్ ప్రకటించారు కానీ..చేస్తున్న దాఖలాలు కనిపించలేదు. పవన్ కల్యాణ్‌కు ఫ్యాన్స్ ఉన్నారు కానీ..జనసేనకు నేతల కొరత ఉంది. పార్టీ వాయిస్ బలంగా వినిపించే కొంత మంది నియోజకవర్గాల్లో పట్టు పెంచుకునేందుకు ప్రయత్నించడం లేదు. దీంతో నాయకుల కొరత వెంటాడుతోంది. జనరవరి నుంచి పవన్ కల్యాణ్ బస్సు యాత్ర చేస్తారని చెబుతున్నారు.  ఆ యాత్ర నిరాటంకంగా సాగుతుందన్న గ్యారంటీ లేదు. ఒక వేళ సాగినా ప్రజల్లో ఉండటానికి పనికొస్తుంది కానీ..రాజకీయం అంటే.. అదొక్కటే కాదు. అందుకే జనసేనానికి టీడీపీ, వైఎస్ఆర్‌సీపీలతో పోలిస్తే వెనుకబడిపోయిందన్న అభిప్రాయం వినిపిస్తోంది. 
 
ఇప్పటికే మరీ సమయం మించి పోలేదు. ఎన్నికలుక ఏడాదిన్నర సమయం ఉంది. కానీ ముందస్తు ఎన్నికలు వస్తే మాత్రం ఆ రెండు పార్టీలు పోరాటానికిరెడీగా ఉన్నాయి. అప్పుడు జనసేన ఇబ్బంది పడుతుంది.