CM Revanth Reddy Musi Riverfront Development Project: తెలంగాణ ముఖ్యమంత్రి ఏనుముల రేవంత్ రెడ్డి తన పదవీ కాలంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా, ఒక సిగ్నేచర్ ప్రాజెక్ట్ గా మార్చుకోవాలని భావిస్తున్న అంశం.. మూసీ నది ప్రక్షాళన , రివర్ఫ్రంట్ డెవలప్మెంట్. నల్లగొండ ఎన్జీ కాలేజీ మైదానంలో జరిగిన బహిరంగ సభలో మూసీని బాగు చేయడాన్ని అడ్డుకునే శక్తులను తొక్కుకుంటూ పోతాం అని ఘాటు వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన నాటి నుండి రేవంత్ రెడ్డి ఈ ప్రాజెక్ట్పైనే తన పూర్తి ఎఫర్ట్స్ను పెడుతున్నారు. లండన్ వెళ్లినప్పుడు స్వయంగా థేమ్స్ నది పునరుజ్జీవనాన్ని పరిశీలించడం, ఆ తర్వాత మంత్రుల బృందాన్ని దక్షిణ కొరియాలోని సియోల్ నగరానికి పంపి అక్కడి చోంగ్చేచోన్ నది మోడల్ను స్టడీ చేయించడం వెనుక ఆయనకున్న పట్టుదల స్పష్టంగా కనిపిస్తోంది.
రేవంత్ రెడ్డి ఈ ప్రాజెక్ట్ కోసం గ్రౌండ్ వర్క్ అంతా పక్కాగా సిద్ధం చేసుకున్నారు. మూసీ సుందరీకరణకు, ప్రక్షాళనకు గతంలో పెద్ద అడ్డంకిగా ఉన్న సికింద్రాబాద్ కంటోన్మెంట్ పరిధిలోని రక్షణ శాఖ భూములు కూడా కేంద్ర ప్రభుత్వం నుండి రాష్ట్ర చేతికి వచ్చేశాయి. లీగల్ , ల్యాండ్ ఇష్యూస్ క్లియర్ కావడంతో, ఇప్పుడు రేవంత్ రెడ్డి తన అసలు ప్రణాళికలను వేగంగా క్షేత్రస్థాయిలో అమలు చేయాల్సిన సమయం ఆసన్నమైంది. ఎందుకంటే, పరిపాలనలో మాటల కంటే చేతలే మైలేజ్ ఇస్తాయి. ఐదేళ్ల పదవీ కాలంలో ఇప్పటికే రెండున్నరేళ్లు ముగిసిపోవచ్చాయి. మిగిలిన రెండున్నరేళ్ల కాలంలో, అంటే తదుపరి ఎన్నికల లోపు మూసీ నది రూపరేఖల్లో ఒక గుణాత్మక మార్పును ప్రజలకు కంటికి కనిపించేలా చూపించాల్సి ఉంటుంది.
చాలా సవాళ్లుంటాయి!
ప్రతిపక్షాలైన బీఆర్ఎస్ , బీజేపీ లు ఈ ప్రాజెక్ట్ వ్యయాన్ని, నిర్వాసితుల ఇళ్ల కూల్చివేతలను అడ్డం పెట్టుకుని ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో రాజకీయ దాడి చేస్తున్నాయి. ఇలాంటి సమయంలో రేవంత్ రెడ్డి కేవలం రాజకీయ కౌంటర్లు ఇస్తూ కూర్చుంటే కాలయాపన జరిగే ప్రమాదం ఉంది. ఒకవేళ వచ్చే ఎన్నికల ముందరి వరకు కేవలం కాగితాలకే ఈ ప్రాజెక్ట్ పరిమితమై.. "విపక్షాలు అడ్డుకున్నాయి, అందుకే చేయలేకపోయాం.. మరోసారి గెలిపిస్తే తొక్కుకుంటూ వెళ్లి బాగు చేస్తాం అని సెంటిమెంట్ అస్త్రాన్ని ప్రయోగిస్తే, ఈసారి ప్రజలు నమ్మే పరిస్థితి ఉండకపోవచ్చు. ఎందుకంటే చేతిలో తిరుగులేని అధికారం, కేంద్రం ఇచ్చిన భూములు ఉన్నా పనులు ప్రారంభించలేదనే నెగెటివిటీ ప్రభుత్వానికే చుట్టుకుంటుంది.
మూసీ ప్రక్షాళనతో ఇతర ప్రాంతాలకూ మేలు
మూసీ ప్రక్షాళన కేవలం హైదరాబాద్ నగర సౌందర్యానికే పరిమితం కాదు.. మూసీ కాలుష్యంతో దశాబ్దాలుగా నరకం చూస్తున్న ఉమ్మడి నల్లగొండ, రంగారెడ్డి జిల్లాల ప్రజల తాగునీరు, సాగునీటి సమస్యలతో ముడిపడి ఉంది. అందుకే రేవంత్ రెడ్డి ఈ ప్రాజెక్ట్ ద్వారా అటు నగర ఓటర్లను, ఇటు నల్లగొండ రైతు ఓటర్లను ఒకే దెబ్బకు ఆకట్టుకోవాలని చూస్తున్నారు. కానీ, ఇదంతా సకాలంలో ఫండింగ్ సమకూర్చుకుని, టెండర్లు పూర్తి చేసి, వేగంగా పనులు ప్రారంభిస్తేనే సాధ్యమవుతుంది. రేవంత్ రెడ్డి 'తొక్కుకుంటూ పోతాం' అనే దూకుడు లైన్ను కేవలం పొలిటికల్ స్పీచ్లకే పరిమితం చేయకుండా, అడ్మినిస్ట్రేటివ్ స్పీడ్లో చూపించాల్సిన అవసరం ఉంది. రాబోయే 6 నుంచి 8 నెలల కాలంలో మూసీ తీరంలో హెవీ మిషనరీ రంగంలోకి దిగి, కాలుష్య నివారణ ప్లాంట్లు , సుందరీకరణ పనులు కంటికి కనిపిస్తేనే విపక్షాల నోళ్లు మూతపడతాయి. రేవంత్ రెడ్డి తన మార్క్ స్పీడ్తో ఈ రెండున్నరేళ్ల డెడ్లైన్ను అందుకుని మూసీని భగీరథుడిలా మారుస్తారా.. లేక రాజకీయ సవాళ్ల మధ్యే ఈ ప్రాజెక్ట్ కాలగర్భంలో కలుస్తుందా అనేది తెలంగాణ భవిష్యత్తుకు అత్యంత కీలకంగా మారింది.
