TMC attacks BJP over imposing vegetarianism in Bengal:  పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ప్రచార పర్వంలో  ఆహార సంస్కృతి  చుట్టూ నడిచిన రాజకీయం అంతా ఇంతా కాదు. బీజేపీ అధికారంలోకి వస్తే బెంగాలీల ఇళ్లలో చేపలు, మాంసం తిననివ్వరు.. శాకాహారాన్ని బలవంతంగా రుద్దుతారు  అంటూ అప్పటి ముఖ్యమంత్రి మమతా బెనర్జీ విస్తృతంగా ప్రచారం చేశారు. ఆ ఇమేజ్ డ్యామేజ్‌ను తిప్పికొట్టేందుకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్వయంగా రంగంలోకి దిగి అలాంటిదేమీ ఉండదని హామీ ఇవ్వడం, అనురాగ్ ఠాకూర్ వంటి అగ్రనేతలు బహిరంగంగా చేపలు తింటూ మేము బెంగాలీ సంస్కృతిని గౌరవిస్తాం అని నమ్మబలికారు. ఫలితంగా బీజేపీ బెంగాల్ పీఠాన్ని దక్కించుకుంది. అయితే, అధికారంలోకి వచ్చిన కొద్దిరోజులకే కోల్‌కతా మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని ప్రభుత్వ పాఠశాలల మిడ్-డే మీల్స్ నుంచి  గుడ్లను తొలగించాలని  ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయం ఇప్పుడు కలకలం రేపుతోంది.    

Continues below advertisement

 ఇస్కాన్  చేతికి వంటశాలలు

పశ్చిమ బెంగాల్ ఆర్థిక మంత్రి స్వపన్ దాస్‌గుప్తా ప్రవేశపెట్టిన నూతన బడ్జెట్‌లో ప్రాథమిక పాఠశాల విద్యార్థుల మిడ్-డే మీల్స్ మౌలిక ధరను  10 కి పెంచుతున్నట్లు ప్రకటించారు. ఈ పెంపును అందరూ స్వాగతించినప్పటికీ, కోల్‌కతా పరిధిలో పైలట్ ప్రాజెక్ట్ కింద వండిన భోజనాన్ని సరఫరా చేసే బాధ్యతను హిందూ ఆధ్యాత్మిక సంస్థ అయిన  ఇస్కాన్ అన్నమిత్ర ఫౌండేషన్  కు అప్పగించడం వివాదానికి కేంద్రబిందువైంది. ఇస్కాన్ నిబంధనల ప్రకారం వారు కేవలం సంపూర్ణ శాకాహారాన్ని మాత్రమే వండుతారు. దీనివల్ల ప్రభుత్వ పాఠశాలల్లో వారానికి ఒకసారి విద్యార్థులకు అందించే అత్యంత ప్రజాదరణ పొందిన  కోడిగుడ్డు మెనూ నుంచి శాశ్వతంగా దూరమవబోతోంది. గుడ్డు స్థానంలో పనీర్, రాజ్‌మా, సోయాబీన్, పప్పుధాన్యాలు అందిస్తామని ఇస్కాన్ ప్రతినిధులు స్పష్టం చేశారు.

Continues below advertisement

 పోషకాహార నిపుణుల వాదన 

 ఈ నిర్ణయంపై విద్యాశాఖ మంత్రి   శాకాహారంలో కూడా పిల్లల ఎదుగుదలకు అవసరమైన అన్ని రకాల ప్రోటీన్లు, విటమిన్లు లభిస్తాయని, సైన్స్ పరంగా ఇది సరైనదేనని వాదించారు. ముఖ్యమంత్రి సువేందు అధికారి సైతం అసెంబ్లీలో  ఇది ఎవరి  నమ్మకాలను ఇతరులపై రుద్దడం కాదు, కేవలం పిల్లలకు పరిశుభ్రమైన, నాణ్యమైన ఆహారాన్ని అందించడమే ప్రభుత్వ లక్ష్యం  అని పేర్కొన్నారు. అయితే, పోషకాహార నిపుణులు, పాఠశాలల ప్రధానోపాధ్యాయులు మాత్రం ఈ వాదనతో ఏకీభవించడం లేదు. బెంగాల్‌లోని పేద కుటుంబాల పిల్లలు పాఠశాలలకు రావడానికి వారానికి ఒకసారి దొరికే గుడ్డు  ఒక ప్రధాన ఆకర్షణ అని, కోడిగుడ్డులో ఉండే అత్యంత సులభంగా జీర్ణమయ్యే అమినో యాసిడ్ల నాణ్యత  సోయాబీన్ వంటి ప్లాంట్ ప్రోటీన్లలో లభించదని వారు హెచ్చరిస్తున్నారు.

 గుజరాత్ జింఖానా బయటపడింది .. ప్రతిపక్షాల ఘాటు విమర్శలు

ఈ వ్యవహారంపై తృణమూల్ కాంగ్రెస్  ఎన్నికల ప్రచారంలో చేపలు తింటూ తమాషా చేసిన వారు.. ఇప్పుడు అధికారంలోకి రాగానే తమ అసలు  గుజరాత్ జింఖానా  రూపాన్ని బయటపెట్టారు. బెంగాల్ పిల్లలపై బలవంతంగా శాకాహారాన్ని రుద్దాలని చూస్తున్నారు. బెంగాల్ దీనిని ఎంతమాత్రం అంగీకరించదు  అని  మండిపడుతోంది.  విచిత్రమేమిటంటే, టీఎంసీ నుంచి తిరుగుబాటు చేసి ప్రస్తుతం అసెంబ్లీలో ప్రతిపక్ష నేతగా గుర్తింపు పొందిన రీతబ్రత బెనర్జీ సైతం ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకించారు. బెంగాలీల ఆహారపు అలవాట్లను మార్చడానికి ప్రయత్నించడం సరికాదని, గుడ్లను తొలగించడాన్ని తాము తీవ్రంగా నిరసిస్తున్నామని స్పష్టం చేశారు.

 దీర్ఘకాలంలో బీజేపీ ఇమేజ్‌కు తీవ్ర నష్టం!

 రాజకీయ కోణంలో విశ్లేషిస్తే, ఈ నిర్ణయం బీజేపీకి దీర్ఘకాలంలో పెద్ద మైనస్‌గా మారే ప్రమాదం ఉంది. బెంగాలీ సమాజంలో దాదాపు 98 శాతం మంది మాంసాహారులు  చేపలు, గుడ్లు తినేవారు . ఆహారం అనేది అక్కడ కేవలం ఆకలికి సంబంధించింది కాదు, అది వారి సాంస్కృతిక అస్తిత్వంలో ఒక భాగం. గతంలో అమిత్ షా ఇచ్చిన హామీలను నమ్మి ఓటేసిన సాధారణ బెంగాలీ ఓటరుకు.. ఈ  గుడ్డు రద్దు  నిర్ణయం ఒక రకమైన అపనమ్మకాన్ని కలిగిస్తుంది. బీజేపీ కేవలం ఎన్నికల కోసమే అబద్ధాలు చెప్పింది, లోపల ఉన్న హిందుత్వ, శాకాహార ఎజెండాను ఇప్పుడు పిల్లల పళ్లాలపై చూపిస్తోంది  అనే ప్రతిపక్షాల ప్రచారానికి ప్రభుత్వమే స్వయంగా ఆయుధాన్ని అందించినట్లయింది.