Chinthakayala Vijay is leading in TDP Rajya Sabha race: ఆంధ్రప్రదేశ్ నుండి జూన్‌లో ఖాళీ కాబోతున్న నాలుగు రాజ్యసభ స్థానాలపై తెలుగుదేశం పార్టీలో అప్పుడే చర్చ మొదలైంది. కూటమి ప్రభుత్వానికి ఉన్న బలం దృష్ట్యా ఈ నాలుగు సీట్లు సులువుగా దక్కే అవకాశం ఉండటంతో, అభ్యర్థుల ఎంపికపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కసరత్తు మొదలుపెట్టారు. ఈ రేసులో ప్రస్తుతం టీడీపీ ఐటీ వింగ్ బాధ్యతలు చూస్తున్న యువనేత చింతకాయల విజయ్ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. ఆయనకు ఎంపీ సీటు దాదాపు ఖరారైనట్లు పార్టీ వర్గాల్లో బలమైన ప్రచారం సాగుతోంది. బీసీ సమీకరణాలు ,  వారసత్వం 

టీడీపీకి వెన్నెముకగా ఉండే బీసీ సామాజికవర్గానికి ప్రాధాన్యత ఇవ్వాలనేది అధిష్టానం ఆలోచన. ఉత్తరాంధ్రలో బలమైన బీసీ నేతగా,  స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు వారసుడిగా విజయ్‌కు మంచి గుర్తింపు ఉంది. ఇప్పటికే అయ్యన్నపాత్రుడు అసెంబ్లీ స్పీకర్‌గా గౌరవప్రదమైన హోదాలో ఉండగా, ఆయన కుమారుడికి ఢిల్లీ స్థాయిలో అవకాశం కల్పించడం ద్వారా ఉత్తరాంధ్రలోని  బీసీలకు పెద్దపీట వేసినట్లు అవుతుందని చంద్రబాబు భావిస్తున్నారు.

సోషల్ మీడియా వింగ్‌లో అలుపెరుగని పోరాటం 

గత ప్రభుత్వ హయాంలో టీడీపీ ఐటీ వింగ్‌పై అనేక కేసులు నమోదైనప్పుడు విజయ్ వెనకడుగు వేయకుండా పోరాడారు. పార్టీ సోషల్ మీడియా సైనికులకు అండగా నిలవడమే కాకుండా, ప్రభుత్వంపై నిరంతరం డిజిటల్ అస్త్రాలను సంధించారు. ఈ క్రమంలో ఆయన అనేక రాజకీయ ఇబ్బందులను ఎదుర్కొన్నారు. పార్టీ కోసం ఆయన పడిన కష్టానికి ప్రతిఫలంగా ఈ గౌరవం దక్కాలని మెజారిటీ నేతలు అభిప్రాయపడుతున్నారు. పార్టీ పట్ల ఆయనకున్న నిబద్ధత చంద్రబాబు దృష్టిలో కూడా విజయ్‌ను ప్రత్యేకంగా నిలబెట్టింది.

యువ నాయకత్వానికి ప్రాధాన్యత 

పార్లమెంటులో పార్టీ వాణిని బలంగా వినిపించేందుకు చదువుకున్న, విషయ పరిజ్ఞానం ఉన్న యువతను పంపాలని చంద్రబాబు యోచిస్తున్నారు. విజయ్ విదేశాల్లో చదువుకోవడం, ఆధునిక సాంకేతికతపై అవగాహన ఉండటం, జాతీయ రాజకీయాల పట్ల ఆసక్తి కలిగి ఉండటం ఆయనకు అదనపు అర్హతలుగా మారాయి. ఢిల్లీ స్థాయిలో లాబీయింగ్ చేయడమే కాకుండా, రాష్ట్ర ప్రయోజనాల కోసం గొంతు వినిపించగల సత్తా విజయ్‌కు ఉందని పార్టీ పెద్దలు నమ్ముతున్నారు. నారా లోకేష్‌కు నమ్మకస్థుడిగా గుర్తింపు 

అదే సమయంలో చింతకాయల విజయ్ అభ్యర్థిత్వానికి ఉన్న అతిపెద్ద ప్లస్ పాయింట్ నారా లోకేష్‌తో ఉన్న సాన్నిహిత్యం. పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు, ముఖ్యంగా లోకేష్ యువగళం పాదయాత్ర సమయంలో ఐటీ వింగ్ ద్వారా సోషల్ మీడియాలో పార్టీ గొంతుకను బలంగా వినిపించడంలో విజయ్ కీలక పాత్ర పోషించారు. లోకేష్ వ్యక్తిగత బృందంలో ఒకరిగా ఉంటూ, డిజిటల్ క్యాంపెయినింగ్‌ను విజయవంతంగా నడిపించడమే కాకుండా, పార్టీ కేడర్‌ను సమన్వయం చేయడంలో తన సామర్థ్యాన్ని నిరూపించుకున్నారు. ఈ విధేయతే ఆయనను రేసులో ముందు నిలబెడుతోందని టీడీపీ వర్గాలుచెబుతున్నాయి. 

అధిష్టానం గ్రీన్ సిగ్నల్? 

ప్రస్తుతానికి అధికారికంగా ఎటువంటి ప్రకటనా రానప్పటికీ, విజయ్ పేరుపై చంద్రబాబు , లోకేష్ ఇప్పటికే ఒక ప్రాథమిక అవగాహనకు వచ్చినట్లు తెలుస్తోంది. పార్టీ సీనియర్లకు, యువతకు మధ్య సమతుల్యత దెబ్బతినకుండా ఈ ఎంపిక ఉండబోతోంది. అన్నీ అనుకూలిస్తే,  రాజ్యసభలో టీడీపీ తరపున చింతకాయల విజయ్ అడుగు పెట్టడం ఖాయమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.