Chandrababu Speech in Kuppam Meeting: అధికారంలోకి వచ్చిన వెంటనే రూ.4 వేల పింఛన్ ఇంటి వద్దకే తెచ్చి ఇస్తామని టీడీపీ అధినేత చంద్రబాబు (Chandrababu) తెలిపారు. మా 3 పార్టీల అజెండా ఒక్కటేనని.. అభివృద్ధి, ప్రజాస్వామ్య పరిరక్షణే ధ్యేయంగా టీడీపీ - బీజేపీ - జనసేన కూటమి పని చేస్తుందని స్పష్టం చేశారు. కుప్పంలో పర్యటన సందర్భంగా మహిళలతో ముఖాముఖి అనంతరం.. ఆయన బహిరంగ సభలో ప్రసంగించారు. రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే కేంద్రం సాయం అవసరమని.. రాష్ట్ర భవిష్యత్తును దృష్టిలో ఉంచుకునే పొత్తు పెట్టుకున్నామని పునరుద్ఘాటించారు. ఈసారి ఎన్నికల్లో 160 అసెంబ్లీ, 24 లోక్ సభ స్థానాలు గెలవాలని అన్నారు. రాష్ట్రంలో ఎన్నికల పర్యటనకు ముందు నియోజకవర్గ ప్రజల ఆశీర్వాదం కోసం వచ్చానని చెప్పారు.


'అదే టీడీపీ బలం'


టీడీపీ స్థాపించినప్పటి నుంచీ కుప్పంలో తిరుగులేని విజయం సాధిస్తున్నామని.. బడుగు, బలహీన వర్గాలే తమ పార్టీకి బలమని చంద్రబాబు అన్నారు. కుప్పంలో హింస, దోపిడీ రాజకీయాలు చేస్తున్నారని.. పుంగనూరు నుంచి వచ్చిన వ్యక్తి దోచుకున్న డబ్బు మొత్తాన్ని కక్కిస్తానని చెప్పారు. 'కుప్పం ప్రజలు ఇప్పటివరకూ నాపై ఏడుసార్లు అభిమానం చూపించారు. ఈ నియోజకవర్గంలో వైసీపీ అభ్యర్థికి ఈసారి డిపాజిట్లు కూడా రాకూడదు. వైసీపీ ప్రభుత్వం నియోజకవర్గం అభివృద్ధికి అడ్డుపడింది. కుప్పానికి హంద్రీనీవా నీళ్లు తీసుకొచ్చే బాధ్యత టీడీపీ కూటమి ప్రభుత్వానిది. అధికారాన్ని అడ్డం పెట్టుకుని రౌడీయిజం చేస్తున్నారు. కూటమి ప్రభుత్వం వచ్చాక పోలీసులతో రౌడీలను నియంత్రిస్తాం. వైసీపీ నాయకులు యథేచ్చగా గ్రానైట్ వ్యాపారం చేస్తున్నారు. కేజీఎఫ్ తరహాలో శాంతిపురంలో గ్రానైట్ తవ్వేశారు. ఈసారి కుప్పంలో టీడీపీ లక్ష మెజార్టీయే లక్ష్యం. ఎన్నికల ప్రచారాన్ని ఇక్కడి నుంచే ప్రారంభిస్తున్నాం.' అని పేర్కొన్నారు.


'వై నాట్ పులివెందుల'


వచ్చే ఎన్నికల్లో 'వై నాట్ 175' అని సీఎం జగన్ అంటున్నారని.. 'వై నాట్ పులివెందుల' అని తాను పిలుపునిస్తున్నట్లు చంద్రబాబు అన్నారు. వచ్చే ఐదేళ్లలో కుప్పంను అభివృద్ధి చేసి ఇక్కడి ప్రజల రుణం తీర్చుకుంటానని చెప్పారు. 'రాష్ట్ర విభజన తర్వాత ఒంటిమిట్టను నేనే అభివృద్ధి చేశా. అనంతరం ఆ చుట్టుపక్కల భూముల ధరలు పెరిగాయి. రికార్డులు మార్చేసి పేదవాళ్ల భూములు లాక్కుంటున్నారు. మన భూములు, స్థలాలను కాపాడుకునేందుకు ఇన్ని కష్టాలు పడాలా.? అరాచకాలకు అడ్డుకట్ట వేయాలంటే టీడీపీ అధికారంలోకి రావాలి.' అని అన్నారు.


మహిళలతో ముఖాముఖి


అంతకుముందు చంద్రబాబు కుప్పంలో మహిళలతో ముఖాముఖి నిర్వహించారు. టీడీపీ కూటమి అధికారంలోకి వస్తే మహిళల ఆదాయం రెట్టింపు చేసి చూపిస్తామని భరోసా ఇచ్చారు. వైసీపీ హయాంలో చీకటి వ్యాపారాలు చేసి రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించారని మండిపడ్డారు. 'డబ్బుకు కక్కుర్తి పడి విదేశాల నుంచి డ్రగ్స్ తీసుకొచ్చి అమ్ముకునే పరిస్థితికి వచ్చారు. టీడీపీ హయాంలో అక్రమార్కులు రాష్ట్రంలోకి రావడానికే భయపడ్డారు. అలాంటిది ఈ ప్రభుత్వానికి బాధ్యత ఉందా.?' అంటూ నిలదీశారు. అవసరమైతే ఆడబిడ్డల కోసం ప్రత్యేక చట్టాన్ని తీసుకొస్తామని అన్నారు. దేశంలో ఆడబిడ్డల గురించి మాట్లాడిన తొలి పార్టీ టీడీపీ అని.. వారికి ఆస్తిలో సమాన హక్కులు కల్పించిన వ్యక్తి ఎన్టీఆర్ అని గుర్తు చేశారు.


Also Read: Tirupati News: 'తిరుపతి సీటుపై పునరాలోచించాలి' - టీడీపీ మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ కంటతడి