AP Legislative Council: ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ రంజుంగా మారుతున్నాయి. ప్రత్యర్థులను చిత్తు చేసే ఉద్దేశంలో ఎత్తుకు పైఎత్తులు వేస్తున్నారు. అధికార పార్టీ అ దిశగా మరింత వేగంగా చర్యలు తీసుకుంటోంది. మొన్నటికి మొన్న ఎమ్మెల్యేలపై వేటు వేసిన స్పీకర్‌ ఇప్పుడు ఎమ్మెల్సీలపై దృష్టి పెట్టింది. పార్టీ తరఫున ఎన్నికై వేరే పార్టీల్లో చేరిన ఇద్దరు ఎమ్మెల్సీలపై వేటు వేసింది. 


ఆంధ్రప్రదేశ్‌లో పార్టీ ఫిరాయించిన నేతలపై వేటు పడుతూనే ఉంది. రామచంద్రయ్య, వంశీకృష్ణయాదవ్‌ ఇద్దరూ కూడా మొన్నటి వరకు వైసీపీలో ఉన్నారు. అక్కడే ఎమ్మెల్సీలుగా ఎన్నికయ్యారు. అయితే వచ్చే ఎన్నికల్లో సీటు ఆశించడంతోపాటు ఇతర కారణాలతో ఇద్దరూ జగన్‌తో విభేదించి బయటకు వచ్చేశారు. జగన్‌పై విమర్శలు ఎక్కు పెట్టారు. దీంతో వారిద్దరిపై వేటు వేస్తూ నిర్ణయం వచ్చింది. 


వంశీ కృష్ణ విశాఖ వేదికగా రాజకీయాలు చేస్తున్నారు. ఆయనకు ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చినప్పటికీ వచ్చే ఎన్నికల్లో సీటు ఆశించారు. సీటు ఇవ్వడం ఇచ్చేది లేదని జగన్ చెప్పేయడంతో ఆయన పార్టీ నుంచి బయటకు వచ్చేశారు. జనసేనలో చేరి పవన్‌ నుంచి టికెట్ హామీ పొందారని అంటున్నారు. దీంతో ఆయనపై మండలి కార్యదర్శికి వైసీపీ ఫిర్యాదు చేసింది. ఆయన పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ్డారని ఆయనపై వేటు వేయాలని విజ్ఞప్తి చేశారు. 


మరో ఎమ్మెల్సీ రామచంద్రయ్య కూడా వైసీపీలో ఉంటూ ఈ మధ్య కాలంలో టీడీపీలోకి వచ్చారు. వైసీపీలో తనలాంటి వారికి గౌరవం లేదని ఆరోపించారు. అందుకే అక్కడ ఇమడలేక టీడీపీలోచేరినట్టు పేర్కొన్నారు. ఆయన పార్టీ క్రమశిక్షణ తప్పారని పార్టీ వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడ్డారని వైసీపీ ఫిర్యాదు చేసింది. 


ఈ ఫిర్యాదుపై విచారణ చేసిన మండలి ఛైర్మన్‌  మోషేన్‌ రాజు చివరకు వారిద్దరిపై వేటు వేస్తున్నట్టు ప్రకటించారు. వేటు వేయక ముందే వారికి మండలి ఛైర్మన్‌ నోటీసులు పంపించారు. వైసీపీ ఇచ్చిన ఫిర్యాదు మేరకు చర్యలు ఎందుకు తీసుకోకూడదో చెప్పాలని ప్రశ్నించారు. ఛైర్మన్‌ ఇచ్చిన నోటీసులపై స్పందించిన వంశీకృష్ణ, రామచంద్రయ్య వివరణ కూడా ఇచ్చారు. వాళ్ల వివరణ సంతృప్తి కరణంగా లేదని అందుకే చర్యలు తీసుకుంటున్నట్టు మండలి ఛైర్మన్‌ వివరించారు.