Mallareddy Family BJP:   తెలంగాణ పాలిటిక్స్‌లో గ్రేటర్ హైదరాబాద్  పరిధిలో మళ్లీ రాజకీయ వేడి ఒక్కసారిగా పీక్స్‌కు చేరింది. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల యాక్షన్ ప్లాన్, ఓటర్ల జాబితా సవరణ, గ్రేటర్ పరిధిలో పార్టీ బలోపేతంపై చర్చించేందుకు బీఆర్ఎస్  వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావు  నగరంలోని పార్టీ ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలతో అత్యవసర సమావేశం నిర్వహించారు. తెలంగాణ రాజకీయాల్లో అత్యంత ప్రతిష్టాత్మకమైన ఈ జీహెచ్‌ఎంసీ రీజినల్ మీటింగ్‌కు మేడ్చల్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి చామకూర మల్లారెడ్డి  గైర్హాజరు కావడం ఇప్పుడు గులాబీ పార్టీలో తీవ్ర కలకలం రేపుతోంది. గతంలో హైడ్రా  కూల్చివేతల సమయం నుంచి పార్టీ మారుతారనే ప్రచారాన్ని ఖండిస్తూ వచ్చిన మల్లారెడ్డి.. ఈ కీలక భేటీకి డుమ్మా కొట్టడంతో ఆయన పార్టీ మారడం దాదాపు ఖాయమనే సంకేతాలు వెలువడుతున్నాయి.  బీజేపీ నేతలతో  మల్లారెడ్డి-మర్రి  టచ్‌.. తెరవెనుక నడుస్తున్న రాజకీయం! 

Continues below advertisement

 గత కొద్దికాలంగా మల్లారెడ్డితో పాటు ఆయన అల్లుడు, మల్కాజిగిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి  కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ అగ్రనేతలతో టచ్‌లోకి వెళ్లినట్లు ప్రచారం జరుగుతోంది. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం తమ వ్యాపారాలు, విద్యాసంస్థలను టార్గెట్ చేస్తున్న తరుణంలో.. వీరికి అటు కేంద్రం నుంచి రక్షణ, ఇటు భవిష్యత్తు రాజకీయ భద్రత కేవలం  కమలం  గూటికి చేరితేనే లభిస్తుందని భావిస్తున్నట్లు టాక్ నడుస్తోంది. ఇప్పటికే ఢిల్లీ వేదికగా బీజేపీ పెద్దలతో ఒక రౌండ్ చర్చలు కూడా ముగిశాయని, అందుకే కేటీఆర్ పిలిచిన అత్యవసర సమావేశానికి మల్లారెడ్డి కావాలనే దూరంగా ఉన్నారని విశ్లేషకులు భావిస్తున్నారు. 

 పొలిటికల్ వారసురాలిగా కోడలు ప్రీతిరెడ్డి..  

Continues below advertisement

మల్లారెడ్డి కుటుంబంలో ఇప్పుడు సరికొత్త రాజకీయ సమీకరణాలు తెరపైకి వచ్చాయి. మల్లారెడ్డి రాజకీయ వారసురాలిగా ఆయన కోడలు చామకూర ప్రీతిరెడ్డి   కిరీటం దక్కించుకోబోతున్నట్లు సమాచారం. ప్రస్తుతం మేడ్చల్ జిల్లా రాజకీయాల్లో చురుగ్గా పాల్గొంటున్న ప్రీతిరెడ్డిని.. రాబోయే రోజుల్లో బీజేపీ తరపున బరిలోకి దించేందుకు మల్లారెడ్డి పక్కా స్కెచ్ వేసినట్లు తెలుస్తోంది. మహిళా నేతగా, విద్యాసంస్థల మేనేజ్‌మెంట్‌లో పట్టున్న వ్యక్తిగా ఆమెకు మేడ్చల్, మల్కాజిగిరి పరిధిలో మంచి మైలేజ్ వస్తుందని మల్లారెడ్డి లెక్కలు వేస్తున్నారు. ఇందులో భాగంగానే బీజేపీ కూడా మల్లారెడ్డి కుటుంబానికి రెడ్ కార్పెట్ పరవడానికి సిద్ధమైనట్లు పొలిటికల్ టాక్. 

 నాలుగు సీట్ల కోసం  మల్లా  మార్క్ బేరసారాలు! 

వ్యాపార సామ్రాజ్యాన్ని నడపడంలో దిట్ట అయిన మల్లారెడ్డి.. రాజకీయాల్లోనూ తన  వ్యాపార చతురతను ప్రదర్శిస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. తన కుటుంబం నుంచి రాబోయే ఎన్నికల్లో  ఏకంగా నాలుగు నుంచి ఐదు సీట్లు కావాలంటూ ఆయన అటు బీఆర్ఎస్ అధిష్ఠానం వద్ద, ఇటు బీజేపీ పెద్దల వద్ద  బేరం  పెట్టినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. తనతో పాటు తన అల్లుడు మర్రి రాజశేఖర్ రెడ్డి, కొడుకు భద్రారెడ్డి, కోడలు ప్రీతిరెడ్డి ఇలా కుటుంబం మొత్తానికి పొలిటికల్ సీట్లు కేటాయించాలనేది ఆయన డిమాండ్. ఈ సీట్ల సర్దుబాటుపై ఎవరు గ్రీన్ సిగ్నల్ ఇచ్చి, పూర్తి హామీ ఇస్తే.. వారి జెండా పట్టుకోవడానికి మల్లారెడ్డి ఫ్యామిలీ సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో బీఆర్ఎస్ పార్టీని ఎలాగైనా కాపాడుకోవాలని, కేడర్‌లో జోష్ నింపాలని కేటీఆర్ శతవిధాలా ప్రయత్నిస్తున్నారు.  మల్లారెడ్డి లాంటి భారీ ఆర్థిక, సామాజిక బలం ఉన్న నేత బీజేపీ వైపు మొగ్గు చూపడం కేటీఆర్ యాక్షన్ ప్లాన్‌కు గట్టి ఎదురుదెబ్బేనని చెప్పాలి. మల్లారెడ్డి గనుక పార్టీ వీడితే.. ఆయనతో పాటు మేడ్చల్, మల్కాజిగిరి జిల్లా పరిధిలోని కేడర్ కూడా పెద్ద ఎత్తున తరలిపోయే ప్రమాదం ఉంది.  

  లాభం  ఎటుంటే అటువైపే.. మల్లారెడ్డి ఫైనల్ డెసిషన్ ఎప్పుడు? 

 మల్లారెడ్డి రాజకీయం ఎప్పుడూ ఒడిదుడుకులు లేని  సేఫ్ గేమ్  వైపే ఉంటుంది. గతంలో టీడీపీ నుండి బీఆర్ఎస్‌లోకి, ఇప్పుడు బీఆర్ఎస్ నుండి బీజేపీ వైపు ఆయన చూపు పడటం వెనుక కేవలం రాజకీయ సిద్ధాంతాలు లేవు.. పూర్తిగా కుటుంబ ప్రయోజనాలు, వ్యాపార సామ్రాజ్యాల రక్షణే పరమార్థం. కేటీఆర్ సమావేశానికి డుమ్మా కొట్టడం ద్వారా తాను బీఆర్ఎస్‌కు డిస్టెన్స్ మెయింటెన్ చేస్తున్నాననే విషయాన్ని మల్లారెడ్డి ఓపెన్‌గానే సిగ్నల్ ఇచ్చేశారు. రాబోయే రెండు మూడు రోజుల్లోనే మల్లారెడ్డి తన కుటుంబ పొలిటికల్ ఫ్యూచర్‌పై, బీజేపీలో చేరికపై ఒక అధికారిక స్పష్టత ఇచ్చే అవకాశం ఉందని గ్రేటర్ పొలిటికల్ సర్కిల్స్ బలంగా నమ్ముతున్నాయి.