BRS In AP :  స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కేటీఆర్ లేఖ రాయడం ఆషామాషీ కాదని ..  వెనకు భారీ పొలిటికల్ స్కెచ్ ఉందని బీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి. ఆ స్కెచ్‌ ఏపీలోకి  బీఆర్ఎస్ ఎంటర్ ్వడమే.   స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ వ్యతిరేక ఉద్యమానికి మద్దతు పేరుతో బీఆర్ఎస్ ఏపీలో సభ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసుకుంటోంది. అందుకు సన్నాహకంగానే కేటీఆర్ లేఖ రాశారు. ఉద్యమకారులకు మద్దతు తెలియచేయాలని తోట చంద్రశేఖర్ ను ఆదేశించారని అంటున్నారు. కేంద్రంలోని మోడీ సర్కార్ అన్ని ప్రభుత్వరంగ సంస్థలను తన కార్పొరేట్ మిత్రులకు అప్పనంగా కట్టబెడుతోందని కేసీఆర్‌లు పలు వేదికలపై మండిపడ్డారు. ఎల్ఐసీ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా చేపట్టిన ఉద్యమంలో బీఆర్ఎస్ కార్మిక విభాగం పాలు పంచుకుంది. ఇప్పుడు అదే ఉద్యమానికి మద్దతుగా విశాఖలో బహిరంగసభ నిర్వహణకు ప్రణాళికలు సిద్దం చేసుకుంటున్నారు. 


చేరికలు పెద్దగా లేకపోవడంతో ఏపీలో సభ ఆలస్యం !


ఖమ్మంలో నిర్వహించిన బీఆర్ఎస్ బహిరంగ సభ తర్వాతే వైజాగ్‌లో లో పార్టీ బహిరంగ సభకు ప్లాన్ చేసినా.. తర్వాత ఆ ఊసు ఎత్తలేదు. కొంత మందిప పెద్ద నాయకుల్ని చేర్చుకోవాలనుకున్న ప్లాన్ సక్సెస్ కాలేదు. అదే్ సమయంలో పవన్ కల్యాణ్ కు చెందిన జనసేన పార్టీతో చర్చలు కూడా ముందుకు సాగలేదు.  ఈ కారణంగా  మహారాష్ట్ర స్థానిక సంస్థల ఎన్నికలపై దృష్టి సారించిన కేసీఆర్.. నాందేడ్ జిల్లాలో సభలు ఏర్పాటు చేశారు. ఇప్పుడు వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశాన్ని అస్త్రంగా చేసుకొని ఏపీలో బీఆర్ఎస్ ప్రస్థానం షురూ చేసే ప్రయత్నాల్లో ఉన్నారు. సభకు సంబంధించిన ఏర్పాట్లను ఏపీ పార్టీ చీఫ్ తోట చంద్రశేఖర్,ఇతర నేతలకు అప్పగించినట్టు తెలుస్తోంది. ఈ నెలలోనే కేసీఆర్ సభ ఉండే అవకాశముందని నేతలు చెప్తున్నారు. 


స్టీల్ ప్లాంట్ పేరుతో అయితే మద్దతు లభిస్తుందనే అంచనా~ 


వైజాగ్ స్టీల్ ప్లాంట్ కార్మికులకు మద్దతుగా భారీ బహిరంగ సభ పెట్టి కార్మికులతో పాటు ఏపీ ప్రజల మద్దతు కూడగట్టాలనే ఆలోచనలో కేసీఆర్ఉన్నారని అంటున్నారు. టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్‌గా  మారిన తర్వాత కేసీఆర్ ఏపీపై ఫోకస్ పెట్టారు. పలువురు నాయకులను చేర్చుకోవాలని ప్రయత్నించినా ఎమ్మెల్యేలు, ఇతర లీడర్ల నుంచి రెస్పాన్స్ రాలేదు. ఏపీలో జనసేన చీఫ్ పవన్ కల్యాణ్‌తో బీఆర్ఎస్ కలిసి పనిచేయబోతోందనే ప్రచారం జరిగినా  అదీ తేలిపోయింది. అందుకే నేరుగా సభ పెట్టి ఏపీలో అడుగు పెట్టాలనుకుంటున్నారు. అయితే బీఆర్ఎస్ రాజకీయాలపై స్టీల్ ప్లాంట్ ఉద్యోగుల్లో అసంతృప్తి ఉందని..  వారి రాజకీయ ఎదుగుదల కోసం తమ ఉద్యమాన్ని అడ్డం పెట్టుకుంటున్నారన్న అనుమానాలు ఉన్నాయని అంటున్నారు. అయితే తాము ఒక్క స్టీల్ ప్లాంట్ కే కాదని.. ప్రైవేటీకరణ చేస్తున్న ప్రతీ కేంద్ర ప్రభుత్వ సంస్థ కార్మికులకూ మద్దతిస్తున్నామని బీఆర్ఎస్ నేతలు చెబుతున్నారు. 


కర్ణాటకలో పోటీ, ప్రచారం లేనట్లే ?


దేవేగౌడ పార్టీ జేడీఎస్‌తో పొత్తు కన్ఫార్మ్ అయిందని, రాబోయే ఎన్నికల్లో ఆ పార్టీతో కలిసి పోటీ చేస్తామని కేసీఆర్ గతంలో సంకేతాలు ఇచ్చారు. తెలుగు ప్రజలు ఎక్కువగా ఉండే ఏపి, తెలంగాణ కర్ణాటక సరిహద్దు జిల్లాల్లో 50 స్థానాలు తగ్గకుండా గులాబీపార్టీ పోటీ చేస్తుందని తెలిపారు. కర్ణాటకలోని మిగతా నియోజకవర్గాల్లో జేడీఎస్‌కు కారు పార్టీ మద్దతు ఇస్తుందని చెప్పుకున్నారు. తెలంగాణ భవన్‌లో జరిగిన బీఆర్ఎస్ అధికారిక ప్రకటన కార్యక్రమంలో కేసీఆర్ పార్టీ నేతలకు కర్ణాటకలో పోటీపై క్లారిటీ ఇచ్చారు. జేడీఎస్ అధినేత కుమార స్వామి సైతం మొదట్లో కేసీఆర్ ప్రతిపాదనకు సానుకూలంగా స్పందించారు.   పిలిచినప్పుడల్లా వచ్చి కేసీఆర్‌కు సపోర్ట్ చేశారు. కానీ ఆ తర్వాత బిఆర్ఎస్‌తో కలిసి పనిచేసే విషయంలో కుమారస్వామి యూటర్న్ తీసుకున్నట్లు కనిపిస్తోంది. మొదట్లో కేసీఆర్ పిలిచిన ప్రతిచిన్న కార్యక్రమానికి అటెండ్ అయిన కుమారస్వామి ఖమ్మంలో నిర్వహించిన బీఆర్ఎస్ ఆవిర్భావ సభకు  హ్యాండ్ ఇచ్చాు.  దాంతో జేడీఎస్ సపోర్ట్‌తో కర్ణాటకలో అడుగు పెట్టాలని ఆశించిన బీఆర్ఎస్ బాస్ కేసీఆర్‌కు పరిస్థితులు కలిసి రావడం లేదన్న ప్రచారం జరుగుతోంది.  ఇప్పుడు పోటీ సంగతి సరే.. కనీసం జేడీఎస్‌కు మద్దతుగా ప్రచారం గురించి కూడా కేసీఆర్ పట్టించుకోవడం లేదు.