Modi Shah Experiment Fail In MP Rajasthan:  భారతీయ జనతా పార్టీ జాతీయ రాజకీయాల్లో ఇప్పుడు ఒక ఆసక్తికరమైన, సంచలన చర్చ నడుస్తోంది. హిందీ హార్ట్ ల్యాండ్ లాంటి కీలక రాష్ట్రాలైన మధ్యప్రదేశ్, రాజస్థాన్‌లలో ముఖ్యమంత్రులను మార్చబోతున్నారని ఈ చర్చల సారాంశం.  గత అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన తర్వాత.. అందరి అంచనాలను తలకిందులు చేస్తూ శివరాజ్ సింగ్ చౌహాన్, వసుంధర రాజె లాంటి సీనియర్, హేమాహేమీ నేతలను కాదని.. ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రి అమిత్ షాలు మోహన్ యాదవ్ , భజన్ లాల్ శర్మ  ల రూపంలో కొత్త ముఖాలకు, జూనియర్లకు అనూహ్యంగా ఛాన్స్ ఇచ్చారు. అయితే, వారు ఊహించినట్లుగా ఈ ఇద్దరు ముఖ్యమంత్రులు రాణించలేకపోతున్నారన్న అభిప్రాయం బలపడుతోంది. 

Continues below advertisement

మోదీ, షాల ప్రయోగం వికటించిందా? 

  మోదీ-షా ద్వయం పార్టీలో సెకండ్ లైన్ లీడర్‌షిప్‌ను తయారు చేయాలనే ఉద్దేశంతో చేసిన ఈ  కొత్త ప్రయోగం  ప్రస్తుతం క్షేత్రస్థాయిలో వికటిస్తోందనే సంకేతాలు వస్తున్నాయి. సీనియర్లను కాదని తెచ్చిన కొత్త ముఖ్యమంత్రులు ఇద్దరూ అటు ప్రభుత్వ పాలనపై పట్టు సాధించడంలో, ఇటు పార్టీలోని సీనియర్ గ్రూపులను సమన్వయం చేసుకోవడంలో తీవ్రంగా తడబడుతున్నారు. బ్యూరోక్రసీ పై పట్టు లేకపోవడం, అనుభవరాహిత్యం వల్ల కీలకమైన సంక్షేమ పథకాలు, డెవలప్‌మెంట్ ప్రాజెక్టులు మందగించాయనే విమర్శలు దిల్లీ అధిష్ఠానానికి చేరాయి. రెండు రాష్ట్రాల్లోనూ కొత్త సీఎంలపై జనంలో కంటే.. సొంత పార్టీ ఎమ్మెల్యేలు, సీనియర్ నేతల్లోనే అసంతృప్తి ఎక్కువగా ఉంది. తమను సీఎంలు పట్టించుకోవడం లేదని, పనులు కావడం లేదని పలువురు సీనియర్లు అంతర్గత సమావేశాల్లో బాహాటంగానే అసమ్మతి వెళ్లగక్కుతున్నారు. 

Continues below advertisement

మధ్యప్రదేశ్ సీఎంపై అవినీతి ఆరోపణలు

విషయానికి వస్తే.. దశాబ్దాల పాటు రాష్ట్రాన్ని ఏలిన శివరాజ్ సింగ్ చౌహాన్ ఇమేజ్ నుంచి బయటపడటం సీఎం మోహన్ యాదవ్‌కు సాధ్యం కావడం లేదు. శివరాజ్ తెచ్చిన  లాడ్లీ బెహనా వంటి సూపర్ హిట్ స్కీమ్‌లను అంతే సమర్థవంతంగా ముందుకు తీసుకెళ్లడంలో మోహన్ యాదవ్ సర్కార్ ఆర్థిక ఇబ్బందుల వల్ల ఇబ్బంది పడుతోంది. దీనికి తోడు రాష్ట్రంలో నేరాల రేటు పెరగడం, అంతర్గతంగా శివరాజ్ వర్గం, జ్యోతిరాదిత్య సింధియా వర్గాల మధ్య ఉన్న గ్రూపు రాజకీయాలను సర్దుబాటు చేయలేక మోహన్ యాదవ్ సతమతమవుతున్నారు. అదే సమయంలో ఉజ్జయినీ భూవివాదం ఆయనను చుట్టుముట్టింది.  దిల్లీ పెద్దలు పూర్తి స్వేచ్ఛ ఇచ్చినప్పటికీ.. పబ్లిక్ ప్రెజెన్స్‌లో ఆయన ఇంకా ఒక పవర్ ఫుల్ మాస్ లీడర్‌గా ఎదగలేకపోయారు. 

రాజస్థాన్‌లోనూ అంతే ! 

ఇక రాజస్థాన్‌లో పరిస్థితి మరీ దారుణంగా ఉందనే వార్తలు వస్తున్నాయి. వసుంధర రాజె లాంటి   నేతను పక్కనపెట్టి.. మొదటిసారి ఎమ్మెల్యే అయిన భజన్ లాల్ శర్మకు ముఖ్యమంత్రి కిరీటం పెట్టడం అప్పట్లోనే సంచలనం. అయితే, భజన్ లాల్ శర్మ కేవలం దిల్లీ హైకమాండ్ చెప్పినట్లే వినే ఒక రబ్బర్ స్టాంప్  సీఎంలా వ్యవహరిస్తున్నారనే ప్రచారం ప్రతిపక్ష కాంగ్రెస్‌తో పాటు బీజేపీ అంతర్గత వర్గాల్లోనూ గట్టిగా సాగుతోంది. రాష్ట్రంలో ఇటీవల జరిగిన ఉప ఎన్నికల ఫలితాలు, స్థానిక సంస్థల సమీకరణాల్లో బీజేపీ ఆశించిన స్థాయిలో రాణించకపోవడానికి సీఎం వైఫల్యమే కారణమని వసుంధర రాజె వర్గం గట్టిగా వాదిస్తోంది. రాజస్థాన్‌ను కంట్రోల్ చేయడం భజన్ లాల్ వల్ల కాదనే ముగింపునకు అధిష్ఠానం కూడా వచ్చిందనే టాక్ వినిపిస్తోంది.

సీఎంలను మారుస్తారా? 

2029 సార్వత్రిక ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని.. ఇప్పటి నుంచే ఈ రెండు పెద్ద రాష్ట్రాల్లో డ్యామేజ్ కంట్రోల్ చర్యలు చేపట్టాలని మోదీ, అమిత్ షా భావిస్తున్నట్లు సమాచారం. అనుభవం లేని కొత్త వారితో ప్రయోగాలు చేస్తే రాష్ట్రాలు చేజారిపోయే ప్రమాదం ఉందని, కాబట్టి పరిపాలనా దక్షత, పొలిటికల్ వెయిట్ ఉన్న సీనియర్ల వైపో లేదా మరికొంత యాక్టివ్ గా ఉండే సమర్థులైన నేతల వైపో మొగ్గు చూపడం ఉత్తమమనే చర్చ దిల్లీలో నడుస్తోంది. మధ్యప్రదేశ్, రాజస్థాన్‌లలో సీఎంల మార్పు అనేది రాత్రికి రాత్రి జరగకపోయినా, రాబోయే కొన్ని నెలల్లో   లీడర్‌షిప్ మార్పు దిశగా హైకమాండ్ అడుగులు వేయడం ఖాయంగా కనిపిస్తోంది. బ్రాండ్ మోదీ ఇమేజ్‌తో ఏ రాష్ట్రంలోనైనా, ఎవరినైనా కూర్చోబెట్టి గెలిపించవచ్చు అనే నమ్మకం గత కొన్ని ఎన్నికల ఫలితాలతో కాస్త తగ్గినందున క్షేత్రస్థాయి లీడర్‌షిప్ బలంగా ఉండాలనే చారిత్రక సత్యాన్ని బీజేపీ అధిష్ఠానం గుర్తిస్తోంది. మోదీ-షా చేసిన ఈ జూనియర్ సీఎంల ప్రయోగం వికటించిందనేది నిజమని తేలితే.. త్వరలోనే ఈ రెండు రాష్ట్రాల రాజకీయం సరికొత్త మలుపు తిరగడం ఖాయం.