Ujjain Master Plan 2035 land conversion scam:  మధ్యప్రదేశ్ రాజకీయాల్లో ఒక భారీ భూ కుంభకోణం  వ్యవహారం ఒక్కసారిగా దేశవ్యాప్తంగా పెను సంచలనం సృష్టిస్తోంది. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మోహన్ యాదవ్  కుటుంబ సభ్యులు ఉజ్జయిని  నగర పరిసర ప్రాంతాల్లో పెద్ద ఎత్తున భూములు కొనుగోలు చేసిన తీరు తీవ్రమైన వివాదానికి దారితీసింది. సీఎం పదవి చేపట్టిన నాటి నుంచి ఆయన భార్య, కుమారుడు, కోడలు, సోదరులు, కజిన్స్ అందరూ కలిసి వందల కోట్లు పలికే ప్రైమ్ ల్యాండ్స్‌ను తమ ఖాతాలో వేసుకున్నట్లు వెల్లడవడంతో ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ దీనిని మహాకాల్ భూముల దోపిడీ గా అభివర్ణిస్తూ సీఎం రాజీనామాకు డిమాండ్ చేస్తోంది.

Continues below advertisement

 రూ. 45 కోట్లతో 168 ఎకరాల కొనుగోలు.. 

 2023 డిసెంబర్‌లో మోహన్ యాదవ్ మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రిగా పగ్గాలు చేపట్టారు. ఆయన ప్రమాణ స్వీకారం చేసిన నాటి నుంచి గడిచిన రెండేళ్ల కాలంలో ఆయన భార్య సీమా యాదవ్, కుమారుడు వైభవ్ యాదవ్, కోడలు శాలిని యాదవ్, సోదరులు నందలాల్, నారాయణ్ యాదవ్ ,  కజిన్స్ కలిసి ఉజ్జయిని ప్రాంతంలో దాదాపు 137 ప్లాట్లలో విస్తరించి ఉన్న 168 ఎకరాల భూమిని కేవలం  45 కోట్ల రూపాయలకు  కొనుగోలు చేసినట్లు భూమి యాజమాన్య రికార్డులు   స్పష్టం చేస్తున్నాయి. ఈ లావాదేవీలు కొన్ని నేరుగా వారి పేర్ల మీద, మరికొన్ని వారి కుటుంబానికి చెందిన నాలుగు రియల్ ఎస్టేట్ కంపెనీల ద్వారా జరిగాయి.   

Continues below advertisement

 ఉజ్జయిని మాస్టర్ ప్లాన్ 2035 - అసలు లింక్ ఇదే! 

ఈ భూముల కొనుగోలు జరిగిన కొద్ది కాలానికే.. మధ్యప్రదేశ్ ప్రభుత్వం ఉజ్జయిని నగరాన్ని అద్భుతంగా తీర్చిదిద్దేందుకు  ఉజ్జయిని మాస్టర్ ప్లాన్ 2035  ను అధికారికంగా ప్రకటించింది. చిత్రం ఏమిటంటే, ఈ మాస్టర్ ప్లాన్ కింద ప్రభుత్వం ప్రతిపాదించిన కొత్త జాతీయ రహదారులు, ఇండస్ట్రియల్ కారిడార్లు, బైపాస్ రోడ్లు , సింహస్థ కుంభమేళా మౌలిక వసతుల ప్రాజెక్టులన్నీ సరిగ్గా సీఎం కుటుంబం కొనుగోలు చేసిన 111 ఎకరాల భూముల పరిసర ప్రాంతాల గుండానే వెళ్తున్నాయి. అంతకంటే షాకింగ్ విషయం ఏమిటంటే.. వీరు కొనుగోలు చేసిన వ్యవసాయ భూములన్నీ   ఈ మాస్టర్ ప్లాన్ రాకతో రెసిడెన్షియల్,  కమర్షియల్ జోన్లుగా మారిపోయాయి.

 రాకెట్ వేగంతో పెరిగిన భూముల విలువ.. 

ప్రభుత్వ ప్రాజెక్టుల ప్రకటనకు ముందే ఇన్‌సైడర్ సమాచారంతో ఈ భూములు కొన్నారనే ఆరోపణలకు బలం చేకూరుస్తూ.. మాస్టర్ ప్లాన్ విడుదలైన వెంటనే ఆయా ప్రాంతాల్లోని ల్యాండ్స్ వాల్యూ రాత్రికి రాత్రే రాకెట్ వేగంతో పెరిగిపోయింది.  45 కోట్లకు కొన్న భూముల విలువ ఇప్పుడు వందల కోట్లకు చేరింది. ఈ వ్యూహాత్మక ల్యాండ్ బ్యాంక్‌ను ఉపయోగించుకుని సీఎం కజిన్స్ అప్పుడే కొన్ని ప్రైవేట్ బిల్డర్లతో హౌసింగ్ ప్రాజెక్టుల కోసం డెవలప్‌మెంట్ అగ్రిమెంట్లు కూడా కుదుర్చుకున్నట్లు ఆధారాలు లభించాయి. దీంతో ముఖ్యమంత్రి తన అధికారిక పరపతిని వాడుకుని ముందే ప్లాన్ చేసి తన కుటుంబానికి లబ్ధి చేకూర్చారనే ఆరోపణలు వెల్లువెత్తాయి.

 సొంత వ్యాపారమేనని సమర్థన.. కాంగ్రెస్ ఫైర్ 

ఈ వివాదంపై ముఖ్యమంత్రి కార్యాలయం నేరుగా స్పందించనప్పటికీ, సీఎం కుటుంబ సభ్యులు , అధికారులు మాత్రం ఈ ఆరోపణలను ఖండించారు. తమ కుటుంబం 2010 నుంచి రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ఉందని, తాము ప్రైవేట్ వ్యక్తులుగా సాధారణ వ్యాపార పద్ధతుల్లోనే భూములు కొన్నామని సీఎం మేనల్లుడు అనంత్ యాదవ్ వాదించారు. అయితే కాంగ్రెస్ నేత జైరామ్ రమేష్  .. బీజేపీ డబుల్ ఇంజన్ ప్రభుత్వంలో  లూటీ ఇంజన్  నడుస్తోందని ఎద్దేవా చేశారు. గతంలో 100 ఎకరాలు ఉన్న ఈ ఫ్యామిలీ ఆస్తులు సీఎం అయ్యాక ఏడాదిన్నరలోనే 335 ఎకరాలకు ఎలా పెరిగాయో సమాధానం చెప్పాలని, సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జితో జుడీషియల్ విచారణ జరిపించాలని కాంగ్రెస్ డిమాండ్ చేస్తోంది.