Telangana anti corruption bureau latest raids 2026:  తెలంగాణలో అవినీతి తిమింగలాల వేటను యాంటీ కరప్షన్ బ్యూరో మరింత ఉధృతం చేసింది. ఆదాయానికి మించిన ఆస్తులు కలిగి ఉన్నారనే నమ్మదగిన సమాచారంతో నిజామాబాద్ జిల్లా ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ సూపరింటెండెంట్  కె. మల్లా రెడ్డిని లక్ష్యంగా చేసుకుని ఏసీబీ అధికారులు మంగళవారం ఉదయం ఏకకాలంలో మెరుపు దాడులు ప్రారంభించారు.  

Continues below advertisement

 11 బృందాలతో ఏకకాలంలో దాడులు.. 

మల్లా రెడ్డి అక్రమాస్తుల గుట్టు రట్టు చేసేందుకు ఏసీబీ ఏకంగా 11 ప్రత్యేక బృందాలను రంగంలోకి దించింది. హైదరాబాద్‌లోని మాచ బొల్లారంలో ఉన్న ఆయన నివాసంతో పాటు నిజామాబాద్‌లోని ఆయన కార్యాలయం, నివాసాలపై అధికారులు విరుచుకుపడ్డారు. వీటితో పాటు మల్లా రెడ్డికి అత్యంత ఆప్తులు, కుటుంబ సభ్యులు, బంధువులు, బినామీలుగా అనుమానిస్తున్న వారి ఇళ్లు, వ్యాపార సంస్థల్లోనూ ఏసీబీ అధికారులు ఏకకాలంలో సోదాలు నిర్వహిస్తున్నారు.

Continues below advertisement

 ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నట్లు గుర్తింపు.. 

తన అధికారిక ఆదాయ వనరులకు మించి మల్లా రెడ్డి భారీగా ఆస్తులను కూడబెట్టారనే బలమైన ఆరోపణలు, ఫిర్యాదుల ఆధారంగా ఏసీబీ ఈ కేసు నమోదు చేసింది. ప్రాథమిక దర్యాప్తులో ఆయన పెద్ద ఎత్తున అక్రమ సంపాదనకు పాల్పడినట్లు ఆధారాలు లభించడంతో, కోర్టు అనుమతితో ఈ సర్ప్రైజ్ రైడ్స్ ప్లాన్ చేశారు. సోదాల సందర్భంగా అధికారులు ల్యాండ్‌ డాక్యుమెంట్లు, బ్యాంక్ పాస్‌బుక్కులు, బంగారు ఆభరణాలు, భారీగా నగదును గుర్తించినట్లు తెలుస్తోంది.   

 ఆర్థిక రికార్డులు, డాక్యుమెంట్ల పరిశీలన.. 

ప్రస్తుతం ఆయా ప్రాంతాల్లో సోదాలు ఇంకా కొనసాగుతున్నాయి. స్వాధీనం చేసుకున్న ఆస్తుల విలువ, ల్యాండ్ డాక్యుమెంట్లు, బ్యాంకు లాకర్ల వివరాలు మరియు ఇతర ఆర్థిక లావాదేవీల రికార్డులను ఏసీబీ అధికారులు నిశితంగా పరిశీలిస్తున్నారు. మల్లా రెడ్డి సర్వీస్ కాలంలో సంపాదించిన చట్టబద్ధమైన ఆదాయానికి, ప్రస్తుతం దొరికిన ఆస్తుల విలువకు మధ్య ఉన్న వ్యత్యాసాన్ని లెక్కగట్టే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు.

 అధికార వర్గాల్లో తీవ్ర కలకలం..                                 

ఒక కీలక జిల్లాకు ఎక్సైజ్ సూపరింటెండెంట్‌గా పనిచేస్తున్న అధికారి నివాసాలపై ఈ స్థాయిలో ఏసీబీ దాడులు జరగడం కలకలం రేపుతోంది. సోదాలు పూర్తిగా ముగిసిన తర్వాత మల్లా రెడ్డి అక్రమాస్తుల అసలు విలువ ఎంత? ఎక్కడెక్కడ బినామీల పేర్లతో ఆస్తులు కొనుగోలు చేశారు? అనే పూర్తి వివరాలను అధికారికంగా ప్రకటిస్తామని ఏసీబీ ఉన్నతాధికారులు తెలిపారు. అక్రమాలు రుజువైతే ఆయనపై కఠిన చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు.