TS BJP Bandi Sanjay : తెలంగాణ బీజేపీలో వన్ మ్యాన్ షో లా పార్టీ వ్యవహారాలను నడుపుతున్నారని విమర్శలు ఎదుర్కొంటున్న బండి సంజయ్‌కు హైకమాండ్ బ్రేక్ వేసినట్లుగా తెలుస్తోంది. ఆయన పాదయాత్రకు  అడ్డు చెప్పని హైకమాండ్ ఇప్పుడు  బస్సు యాత్ర చేస్తానంటే మాత్రం ఇంకా గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదని చెబుతున్నారు. పాదయాత్ర లో వచ్చిన జనాన్ని చూసి ఓట్లు పడతాయని భావించకుండా క్షేత్ర స్థాయిలో పని చేయాలని సూచించినట్లు తెలుస్తోంది. తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికలు ఎప్పుడైనా రావచ్చు అని భావిస్తున్న బిజెపి అధిష్టానం ఇప్పటి నుంచి పార్టీ సంస్థాగత నిర్మాణం పై దృష్టి పెట్టాలని బండి సంజయ్‌కు సూచించినట్లుగా బీజేపీ వర్గాలు చెబుతున్నాయి. 


ఆరో విడత పాదయాత్రకూ ఇప్పుడల్లా చాన్స్ లేనట్లే..?


బండి సంజయ్‌ ఇటీవలే ఐదో విడత ప్రజా సంగ్రామ పాదయాత్రను పూర్తి చేసుకున్నారు. ఆ వెంటనే ఆరో విడత పాదయాత్రను కొనసాగించాలని భావించారు. అయితే దానికి పార్టీ అధిష్టానం నుంచి గ్రీన్‌ సిగ్నల్‌ రాలేదని తెలుస్తోంది. బండి సంజయ్ పాదయాత్రకు ప్రజా స్పందన బాగానే ఉన్నప్పటికీ ప్రస్తుతానికి ఆ యాత్రలకు బ్రేక్ ఇచ్చి తాము చెప్పిన పనులు ముందు పూర్తిచేయాలని పార్టీ పెద్దల నుంచి ఆదేశాలు వచ్చినట్లు సమాచారం. దాంతో సంక్రాంతి లోపు ఆరో విడత పాదయాత్రను పూర్తి చేయాలని అనుకున్నారు. ఆ తరువాత బస్సు యాత్ర ప్రారంభించాలని భావించారు. ఆ తరువాత బండి సంజయ్ అసెంబ్లీ ల వారీగా పర్యటించాలని రోజూ మూడు అసెంబ్లీల చొప్పున సంస్థాగత అంశాలపై సమీక్ష చేయాలని బూత్ కమిటీలను నేరుగా కలిసి మాట్లాడాలని భావిస్తున్నారు. ఈ కార్యక్రమాలన్నీ ఉన్నందున బండి సంజయ్ పాదయాత్ర దాదాపు ఇప్పుడల్లా నిర్వహించే అవకాశం లేదని భావిస్తున్నారు.


సంస్థాగతంగా బలోపేతం కావడంపై దృష్టి !


తెలంగాణ బీజేపీకి హైప్ వచ్చింది కానీ నియోజకవర్గాల్లో బలమైన నేతలు లేరన్న అభిప్రాయం ఉంది. అందుకే సంస్థాగత ఎన్నికలపై ముందు దృష్టి పెట్టాలని బండి సంజయ్‌కు హైకమాండ్ సూచించినట్లుగా చెబుతున్నారు. జనవరి మొదటి వారంలోగా మండలాల వారీగా బూత్ కమిటీల సమావేశాలు పూర్తి చేయాలని ఆదేశించింది. క్షేత్రస్థాయిలో పార్టీ బలోపేతానికి కృషి చేయాలని కూడా ఆయనకు స్పష్టం చేసింది.జనవరి 7వ తేదీన రాష్ట్రంలోని 119 నియోజకవర్గాల లో బూత్ కమిటీల తో అసెంబ్లీ సదస్సులు నిర్వహించాలని నిర్ణయం తీసుకుంది అధిష్టానం. దీని కోసం ఇప్పటి నుంచే బూత్ కమిటీల సమావేశాలకు ఏర్పాట్లు చేయాలని సూచించింది. బూత్ కమిటీలతో నిర్వహించే అసెంబ్లీ సదస్సులలో బిజెపి జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా వర్చువల్ గా ప్రసంగించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈలోగా డిసెంబర్ 28, 29, 30 తేదీలలో దక్షిణాది రాష్ట్రాల పూర్తి సమయ కార్యకర్తల సమావేశం, తెలంగాణ అసెంబ్లీ కోర్ కమిటీ సమావేశం హైదరాబాద్‌లో జరగబోతోంది.


ఇతర సీనియర్లకు  బండి సంజయ్ ప్రాధాన్యం ఇవ్వడం లేదన్న విమర్శలు


తెలంగాణ బీజేపీలో ఇతర సీనియర్ నేతలు ఉన్నారు. కిషన్ రెడ్డి, ఈటల రాజేందర్, డీకే అరుణ లాంటి  సీనియర్ నేతలు ఉన్నప్పటికీ వారికి లభిస్తున్న ప్రాధాన్యం తక్కువే. మొత్తం వ్యవహారాలన్నీ బండి సంజయ్ చేతుల మీదుగా నడుస్తున్నాయి.  దీంతో తెలంగాణ బీజేపీలో అసంతృప్తి కనిపిస్తోందన్న ప్రచారం జరుగుతోంది. పలుమార్లు హైకమాండ్ కూడా ఫిర్యాదు చేశారని చెబుతున్నారు. ఈ కారణంగానే బండి సంజయ్ దూకుడుకు కాస్త బ్రేక్ వేశారని అంటున్నారు.