BJP First List : హ్యాట్రిక్ విజయంపై కన్నేసిన బీజేపీ(BJP) సార్వత్రిక ఎన్నికలకు గెలుపు గుర్రాలను  సిద్ధం చేస్తోంది. నేడు వందమందితో తొలిజాబితా విడుదల చేయనుంది. అన్ని రాష్ట్రాల బీజేపీ నేతలతో చర్చించిన బీజేపీ అధిష్ఠానం..అభ్యర్థల ఎంపికపై తుది నిర్ణయం తీసుకుంది. ఎలాంటి వివాదాలు లేని వందచోట్ల అభ్యర్థులను ప్రకటించనుంది. వీటిల్లో తెలంగాణ(Telangana)కు చెందిన లోక్ సభ అభ్యర్థులు కూడా ఉండనున్నారు


బీజేపీ తొలి జాబితా
లోక్ సభ ఎన్నికల్లో హ్యాట్రిక్ విజయడంతోపాటు 400సీట్లు దక్కించుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్న బీజేపీ అధిష్ఠానం....అందుకు తగ్గట్లుగా వడివడిగా అడుగులు వేస్తోంది. ఒక పక్క విపక్ష ఐఎన్‌డీఐఏ (I.N.D.I.A) కూటమి సీట్ల సర్దుబాటు చేసుకోలేక ఉక్కిరిబిక్కిరి అవుతుంటే...బీజేపీ మాత్రం ఎన్నికల షెడ్యూలు విడుదలకాక ముందే ఏకంగా వందమందితో నేడు తొలి జాబితా(1st List Of BJP) విడుదల చేయనుంది. ఈమేరకు బీజేపీ సీనియర్ నేత అమిత్ షా(Amit shah), జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా(J.P.Nadda)  మధ్యప్రదేశ్, హర్యానా, రాజస్థాన్, ఉత్తరాఖండ్‌, ఉత్తర్‌ప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, తెలంగాణ రాష్ట్రాలకు చెందిన నేతలతో చర్చించారు. తుది కూర్పుపై ఆయా రాష్ట్రాల నేతలతో చర్చించిన అధిష్ఠానం పెద్దలు...ఎలాంటి వివాదాలు లేని వందసీట్లతో నేడు తొలి జాబితా విడుదల చేయనున్నారు.


లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ నుంచి బరిలో దిగే అభ్యర్థుల జాబితాపై పార్టీ వర్గాల్లో ఆసక్తి నెలకొంది. ప్రధానమంత్రి నరేంద్రమోదీ(Narendra Modi), అమిత్‌ షా వంటి అగ్రనేతల పేర్లు తొలి జాబితాలోనే ఉండే అవకాశం ఉంది. ఈసారి ఉత్తరప్రదేశ్ పై ప్రత్యేకంగా దృష్టి సారించిన బీజేపీ....తొలి జాబితాలోనే ఎక్కువ సీట్లు ప్రకటించనన్నారని టాక్. ఇటీవల ఐదురాష్ట్రాల ఎన్నికల్లో చివరి నిమిషం వరకు సీట్ల సంగతి తేల్చకపోవడంతో కొంత బీజేపీ ఇబ్బందిపడింది, పార్లమెంట్ ఎన్నికల్లో అలాంటి ఇబ్బందులేమీ లేకుండా ముందుగానే సీట్ల సంగతి తేల్చాలని నిర్ణయించారు. తద్వారా అభ్యర్థుల ఎన్నికల ప్రచారానికీ సమయం దొరకుతుందని బీజేపీ అధిష్టానం భావిస్తోంది. మధ్యప్రదేశ్(Madya Pradesh) అసెంబ్లీ ఎన్నికల్లో ఇదే స్ట్రాటజీ ఉపయోగించి సత్ఫలితాలు సాధించింది. ఇప్పుడు లోక్ సభ ఎన్నికల్లోనూ అదే పంథా అనుసరించాలని నిర్ణయించింది. నేడు విడుదల చేయని  ఫస్ట్‌ లిస్ట్‌లో.. 2019 ఎన్నికల్లో గెలవని స్థానాలను కూడా చేర్చాలని కమలదళపతులు యోచిస్తున్నారు. వీరికి ప్రచారానికి ఎక్కువ సమయం ఉండటంతో కొంచెం ఉపయుక్తంగా ఉంటుందని భావిస్తున్నారు. తొలి జాబితాలో దక్షిణ ప్రాంతం నుంచే అత్యధిక స్థానాల ప్రకటన ఉండొచ్చని తెలుస్తోంది.


తెలంగాణ అభ్యర్థులు వీరే...!
నేడు విడుదల చేయనున్న తొలి జాబితాలో తెలంగాణలో ఆరుగురి నుంచి పదిమంది అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉంది. సిట్టింగ్ ఎంపీలు నలుగురితోపాటు మరో ఐదు, ఆరుచోట్ల అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉంది. మహబూబ్ నగర్ లోక్ సభ నుంచి సీనియర్ నేతలు జితేందర్ రెడ్డి(Jithendra Reddy), డీకే అరుణ(D.K.Aruna) పేర్లు వినిపిస్తున్నాయి. మల్కాజిగిరి, ఖమ్మం స్థానాల్లో కమ్మ సామాజిక వర్గానికి చెందిన వారికి ప్రాధ్యానం ఇస్తారని తెలుస్తోంది. బీఆర్‌ఎస్ నాగర్‌కర్నూలు  ఎంపీ రాములు(Ramulu) బీజేపీలో చేరడంతో నేడు ప్రకటించనున్న లిస్ట్‌లో ఆయన పేరు కూడా ఉండే అవకాశం ఉంది. చేవెళ్ల సీటు కొండా విశ్వేశ్వర్‌ రెడ్డికి ఇవ్వనున్నట్లు సమాచారం. ఖమ్మం నుంచి డాక్టర్ వెంకటేశ్వరరావు, భువనగిరి నుంచి బూర నర్సయ్య గౌడ్‌ బరిలో దిగనున్నట్లు తెలిసింది. మల్కాజిగిరి నుంచి ఈటల రాజేందర్, మురళీధర్ రావుతో పాటు ప్రైవేట్‌ విద్యా సంస్థల అధిపతి మల్క కొమురయ్య పేరును కూడా పార్టీ నాయకత్వం పరిశీలిస్తున్నట్టు సమాచారం. వీళ్లతో పాటు అసెంబ్లీ ఎన్నికల్లో దుబ్బాక నుంచి పోటీచేసి ఓడిపోయిన రఘునందనరావుకు కూడా మెదక్ ఎంపీ టికెట్ ఇస్తారని ప్రచారం జరుగుతోంది.