Bharat Ratna For LK Advani is Modi mark of politics: ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోడీ(PM NARENDRA MODI).. తాజాగా బీజేపీ కురువృద్ధుడు, అయోధ్య రామాల‌యం ( AYODHYA RAMALAYAM)  కోసం పోరాటం స‌ల్పిన లాల్ కృష్ణ అద్వానీకి పెద్ద‌పీట వేశారు. భార‌త దేశ అత్యున్న‌త పౌర‌పురస్కార మైన భార‌త ర‌త్నను ప్ర‌క‌టించారు. అది .. ఒక‌ర‌కంగా.. జీవించి ఉన్న నాయ‌కుల్లో ఈ ఏడాది అద్వానీకి ద‌క్కిన అపురూప గౌర‌వ‌మ‌నే చెప్పాలి. దీంతోపాటు కొన్ని రోజుల కింద‌ట ఎవ‌రూ ఊహించ‌ని విధంగా మాజీ ఉప రాష్ట్ర‌ప‌తి ఏపీకి చెందిన బీజేపీ సీనియ‌ర్ నాయ‌కుడు ముప్ప‌వ‌ర‌పు వెంక‌య్య నాయుడుకు కూడా ప‌ద్మ‌విభూష‌ణ్ ప్ర‌క‌టించారు. 


ఈ రాజ‌నీత‌జ్ఞ‌త వెనుక‌ రాజకీయం 


ఎల్‌కే అద్వానీకి భారత  రత్న ప్రకటించడంపై బీజేపీలో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.  అవినీతి, అక్ర‌మాల ఆరోప‌ణ‌ల‌కు క‌డు దూరంగా బీజేపీ(BJP), ఆర్ ఎస్ ఎస్(RSS) సిద్ధాంతాల‌ను పుణికి పుచ్చుకుని.. కుటుంబ రాజ‌కీయాల‌కు దూరంగా ఉన్న‌ారు అద్వానీ, పద్మ విభూషణ్  పొందిన వెంకయ్య కూడా అంతే.  . వారికి ఈ అవార్డులు ప్రకటించడంపై పెద్దగా  ఎవ‌రికీ ఎలాంటి అభ్యంత‌రాలు లేవు.  అయితే.. ఇలా.. ఇప్పుడే వీరికి అవార్డులు ప్ర‌క‌టించ‌డం వెనుక వున్న వ్యూహం. ఏమిటన్నది మాత్రం హాట్ టాపిక్  గా మారుతోంది. 


1990ల నుంచి 2000 వ‌ర‌కు


 1990ల నుంచి 2000ల‌వ‌ర‌కు ఉన్న బీజేపీ నేత‌ల్లో వెంక‌య్య‌నాయుడు (VENKAIAH NAIDU), ల‌క్ష్మ‌ణ్‌( LAKSHMAN) , ముర‌ళీ మ‌నోహ‌ర్‌జోషి, ఉమా భార‌తి వంటివారు కీల‌కంగా వ్య‌వ‌హ‌రించారు. వీరిలో వెంక‌య్య‌ను ప‌క్క‌న పెడితే.. మిగిలిన ముగ్గ‌రు, అద్వానీ.. జోషి, భార‌తిలు ఫైర్ బ్రాండ్‌లుగా రాజ‌కీయాలను చేప‌ట్టారు. అలానే జీవించారు. అయోధ్య రామ‌మందిర నిర్మాణం ఇప్పుడు సాకారం చేసుకుని క్రెడిట్‌ను త‌న ఖాతాలో వేసుకున్న మోడీకి.. ఆ బాట ప‌రిచిన వారిలో వీరే అగ్ర‌గ‌ణ్యులు. 


మోదీ హవా  ప్రారంభమయ్యాక అద్వానీకి తగ్గిన ప్రాధాన్యం  !


అయితే.. మోడీ పాల‌నా ప‌గ్గాలు చేప‌ట్టిన త‌ర్వాత‌.. వీరికి ప్రాధాన్యం లేకుండా పోయింద‌నేది వాస్త‌వం. ముఖ్యంగా అయోధ్య రామ‌మందిరం కోసం చేసిన కృషిని క‌నీసం తెర‌మీదికి రాకుండా.. మేనేజ్ చేశార‌ని ఇటీవ‌ల వీరి అనుచ‌రులు, బీజేపీలోనే ఉన్న వీరి వ‌ర్గాలు ఆఫ్ ది రికార్డుగా వాయిస్ వినిపించాయి. దీంతో బీజేపీలో క్షేత్ర‌స్థాయి నేత‌ల‌కు విలువ లేకుండా పోయింద‌నే వాద‌న ఉంది. ఈ నేప‌థ్యంలో ఎన్నిక‌ల ముంగిట‌.. ఇలాంటి బ్యాచ్‌ను మ‌చ్చిక చేసుకునేందుకు మోడీ వ్యూహాత్మ‌కంగా వీరికి బాట‌లు ప‌రిచి. అత్యున్న పౌర పుర‌స్కారాల‌కు ఎంపిక అయ్యేలా చ‌క్రం తిప్పార‌నే వాద‌న జాతీయ రాజ‌కీయాల్లో వినిపిస్తోంది. 


దేశం మొత్తాన్నీ ప్ర‌భావితం చేసిన‌ అద్వానీ రథయాత్ర


నిజానికి అద్వానీ.. విష‌యాన్ని తీసుకుంటే.. ఆయ‌న డిప్యూటీ ప్ర‌ధానిగా సేవ‌లందించారు. ఫొక్రాన్ అణు ప‌రీక్ష‌ల స‌మయంలో ఆయ‌న చాలా వ్యూహాత్మ‌కంగా.. అప్ప‌టి ప్ర‌దాని వాజ‌పేయికి వెన్నుద‌న్నుగా ఉన్నారు. ఆర్ ఎస్ ఎస్ సిద్ధాంతాలను పూర్తిగా పుణికి పుచ్చుకుని.. ముందుకు సాగారు. ``త‌ల తెగిప‌డినా ఇష్ట‌మే.. రాముడు వ‌చ్చి అక్క‌డ కూర్చోవాల్సిందే.`` అని భీష‌ణ ప్ర‌తిజ్ఞ చేసిన అద్వానీ.. వేల మంది అరెస్టులు జ‌రుగుతున్నా.. తొణ‌కుండా.. త‌ను ఎంచుకున్న మార్గాన్ని నిర్విఘ్నంగా ముందుకు తీసుకువెళ్లారు. ర‌థ‌యాత్ర ద్వారా.. అశేష భార‌తావ‌నిని బీజేపీవైపు దృష్టి కేంద్రీక‌రించేలా చేశారు.   ఇక‌, వెంక‌య్య విష‌యాన్ని తీసుకుంటే.. ఆయ‌న బీజేపీ జాతీయ అధ్య‌క్షుడిగా కీల‌క‌మైన సంస్క‌ర‌ణ‌ల‌కు పునాదులు వేశారు. ఈ నేప‌థ్యంలోనే తొలి కేబినెట్‌లో ఆయ‌న‌కు మోడీ మంత్రి ప‌ద‌విని ఇచ్చారు. కానీ, మ‌లి కేబినెట్‌కు వ‌చ్చే స‌రికి ప్ర‌త్య‌క్ష రాజ‌కీయాల‌కు దూరం పెట్టి. త‌న వ‌ర్గాన్ని పెంచుకున్నారు. ఇది వెంక‌య్య అనుకూలురుకు.. ముఖ్యంగా ద‌క్షిణాది రాష్ట్రాల్లోనూ చ‌ర్చ‌నీయాంశం అయింది. ఉప‌రాష్ట్ర‌ప‌తి ప‌ద‌విని ఇవ్వ‌డం ద్వారా ప్ర‌త్య‌క్ష రాజ‌కీయాల‌కు దూరం చేశార‌నే వాద‌నా వినిపించింది. 


పెద్దలకు గౌరవం ఇచ్చినట్లుగా ప్రజల్లోకి సంకేతాలు 


క‌నీసం విధాన‌ప‌ర‌మైన నిర్ణ‌యాల్లోనూ ఆయ‌న కు చోటు పెట్ట‌లేదు. అంతేకాదు.. ఇటీవ‌ల అయోధ్య రామ‌మందిర ప్రాణ ప్ర‌తిష్ట‌కు కూడా ఆహ్వానం ఇచ్చి మ‌రీ రావ‌ద్ద‌న్నార‌నే వార్త‌లు వ‌చ్చాయి. ఈ ప‌రిణామాల నేప‌థ్యంలో ఎన్నికల ముంగిట అద్వానీ.. వెంక‌య్య‌, ఉమాభార‌తి, మ‌నోహ‌ర్ జోషి వంటి కీల‌క నేత‌ల అనుచ‌రుల‌ను శాంతింప జేసేందుకు.. తాను ఆర్ ఎస్ ఎస్ వాదుల‌కు ప్రాధాన్యం ఇస్తున్నాన‌న్న వాద‌న‌ను ప్ర‌జ‌ల్లోకి తీసుకువెళ్లేందుకు మోడీ చేసిన ప్ర‌య‌త్నంగానే జాతీయ మీడియా విశ్లేషిస్తోంది.