Didi vs  Modi battle is an unimaginable battle:  బెంగాల్ ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమయ్యాయి.  టుడేస్ చాణక్య ,  పి-మార్క్ వంటి సంస్థలు ఈసారి  భారతీయ జనతా పార్టీ ప్రభంజనం సృష్టించబోతోందని, 150 నుండి 190 స్థానాలు గెలుచుకునే అవకాశం ఉందని జోస్యం చెబుతున్నాయి. మరోవైపు  పీపుల్స్ పల్స్ ,  జన్మత్ వంటి సంస్థలు తృణమూల్ కాంగ్రెస్ మళ్ళీ అధికారంలోకి వస్తుందని, మమతా బెనర్జీ హ్యాట్రిక్ విజయం ఖాయమని అంచనా వేస్తున్నాయి. ఈ భిన్నమైన అంచనాలు ఓటరు తీర్పును అంచనా వేయడంలో సర్వే సంస్థలు సైతం ఎంతగా తడబడుతున్నాయో స్పష్టం చేస్తున్నాయి.

Continues below advertisement

 రికార్డు స్థాయి పోలింగ్ - నిశ్శబ్ద విప్లవమా?

బెంగాల్ చరిత్రలోనే అత్యధికంగా సుమారు 92.93 శాతం  పోలింగ్ నమోదు కావడం విశ్లేషకులను ఆశ్చర్యానికి గురిచేస్తోంది. సాధారణంగా భారీ పోలింగ్ అధికార వ్యతిరేకతను సూచిస్తుందని ఒక వాదన ఉంటే, మహిళా ఓటర్ల భారీ భాగస్వామ్యం తమ సంక్షేమ పథకాలకు మద్దతు అని టీఎంసీ ధీమా వ్యక్తం చేస్తోంది. ముఖ్యంగా  స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ద్వారా దాదాపు 90 లక్షల నకిలీ ఓట్లను తొలగించిన తర్వాత జరిగిన తొలి ఎన్నికలు కావడం వల్ల, ఈ ఓటింగ్ సరళి అత్యంత పారదర్శకమైన తీర్పును ఇవ్వబోతోందని భావిస్తున్నారు.

Continues below advertisement

 బెంగాలీ అస్తిత్వం vs జాతీయవాదం

ఈ ఎన్నికల ప్రచారంలో టీఎంసీ ప్రధానంగా  బెంగాలీ అస్తిత్వం, ప్రాంతీయ సెంటిమెంట్‌ను నమ్ముకుంది. మమతా బెనర్జీ ప్రవేశపెట్టిన లక్ష్మీ భండార్ వంటి పథకాలు మహిళా ఓటర్లను ఆకట్టుకున్నాయి. మరోవైపు బీజేపీ, కేంద్రం నుండి వస్తున్న నిధుల దుర్వినియోగం, అవినీతి,  చొరబాటు వంటి అంశాలను ఎజెండాగా పెట్టింది. హిందూ ఓట్ల ధ్రువీకరణ, సిటిజన్‌షిప్ అమెండ్‌మెంట్ యాక్ట్ వంటి అంశాలు ఈసారి బీజేపీకి కలిసొచ్చే అవకాశం ఉందని కొన్ని సర్వేలు పేర్కొంటున్నాయి.

 ఓటరు  మౌనం  .. సర్వే సంస్థలకే సవాల్!

బెంగాల్ ఎన్నికల్లో అత్యంత కీలకమైన అంశం ఓటరు మౌనం. ప్రముఖ సర్వే సంస్థ  యాక్సిస్ మై ఇండియా  ఈసారి ఫలితాలను వెల్లడించడానికి నిరాకరించింది.  దాదాపు 70 శాతం మంది ఓటర్లు తమ మనసులో మాట చెప్పడానికి నిరాకరించడంతో, డేటా నాణ్యత లేదని ఆ సంస్థ ఫలితాలను ఆపేసింది. ఇది బెంగాల్‌లో ఓటరు ఎంతటి గోప్యతను పాటిస్తున్నారో తెలియజేస్తోంది. ఏ పార్టీకైనా మద్దతు ఇస్తున్నట్లు బయటపడితే గొడవలు జరుగుతాయనే భయంతో ఓటర్లు మౌనంగా ఉండి సైలెంట్ ఓటింగ్ వేసి ఉంటారనేది విశ్లేషకుల అంచనా.

  కింగ్ మేకర్ ఎవరు?

ప్రధాన పోటీ టీఎంసీ, బీజేపీ మధ్యే ఉన్నప్పటికీ.. లెఫ్ట్ ఫ్రంట్ . కాంగ్రెస్ కూటమి ఓట్లను ఎంతవరకు చీల్చగలవనేది కూడా ఫలితాలను ప్రభావితం చేస్తుంది. ఒకవేళ ఏ పార్టీకీ స్పష్టమైన మెజారిటీ రాని పక్షంలో , స్వతంత్రులు.  చిన్న పార్టీల పాత్ర కీలకం కానుంది. అయితే బెంగాల్ చరిత్రలో ఓటరు ఎప్పుడూ ఒక పక్షానికే మొగ్గు చూపుతాడు కాబట్టి, ఫలితాలు ఏకపక్షంగానే ఉంటాయని కొందరు భావిస్తున్నారు. ఓటరు వేసిన భారీ పోలింగ్ మార్పు కోసమా? లేక మమతమ్మ పాలనకు పునరంకితం కావడానికా? అనేది మే 4న వెల్లడయ్యే ఫలితాల్లో తేలనుంది. అంతవరకు బెంగాల్ రాజకీయం ఉత్కంఠభరితమైన సస్పెన్స్ థ్రిల్లర్‌ను తలపిస్తూనే ఉంటుంది.