Bandi Sanjay Son Controversy Impact:  తెలంగాణ బీజేపీలో  ఫైర్ బ్రాండ్ గా పేరు తెచ్చుకున్న బండి సంజయ్ కుమార్ రాజకీయ భవిష్యత్తు ఇప్పుడు జాతీయ స్థాయిలో చర్చనీయాంశమైంది. అమిత్ షా ,  మోదీల నమ్మకస్తుడిగా, హిందుత్వ వాదాన్ని బలంగా వినిపించే నేతగా ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉన్నప్పటికీ, ఇటీవలి కొన్ని పరిణామాలు ఆయన ప్రమోషన్‌కు అడ్డంకిగా మారుతాయా? అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి.  

Continues below advertisement

 ప్రమోషన్ దక్కేనా.. వ్యూహాత్మక విరామమా? 

మోదీ 3.0 క్యాబినెట్‌లో ప్రస్తుతం సహాయ మంత్రిగా ఉన్న బండి సంజయ్‌కు త్వరలో జరగబోయే విస్తరణలో కేబినెట్ ర్యాంక్  దక్కుతుందనే ప్రచారం ఒకవైపు సాగుతోంది. తెలంగాణలో బీజేపీ ఎదుగుదలకు ఆయన వేసిన పునాదులు, క్షేత్రస్థాయి కార్యకర్తల్లో ఆయనకున్న క్రేజ్ దీనికి ప్రధాన కారణాలు. అయితే, ఈ సమీకరణాల్లో ఆయన కుమారుడికి సంబంధించిన కేసు పరిణామాలు హైకమాండ్ నిర్ణయంపై ప్రభావం చూపుతాయా అన్నది అసలు ప్రశ్న. ఒకవేళ ఆయనకు ప్రమోషన్ ఇస్తే, పార్టీ క్రమశిక్షణ కంటే  విన్నింగ్ హార్స్ కే ప్రాధాన్యత ఇచ్చారనే విమర్శలు వచ్చే అవకాశం ఉంది.

Continues below advertisement

 సామాజిక సమీకరణాలు – బండికి శ్రీరామరక్ష? 

తెలంగాణలో బలమైన మున్నూరు కాపు   సామాజిక వర్గానికి చెందిన నేత కావడం బండి సంజయ్‌కు ఉన్న అతిపెద్ద ప్లస్ పాయింట్. రాష్ట్రంలో బీసీ ఓటు బ్యాంకును ఆకర్షించడంలో ఆయన సక్సెస్ అయ్యారు. కిషన్ రెడ్డి,  ఈటల రాజేందర్ వంటి నేతలతో బ్యాలెన్స్ చేయాలంటే, బండి సంజయ్‌ను కేంద్రంలో కీలకమైన పదవిలో ఉంచడం ఢిల్లీ పెద్దలకు అనివార్యం. కేవలం పనితీరునే కాకుండా, 2028లో జరగబోయే అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని బీజేపీ హైకమాండ్ ఆయనను పక్కన పెట్టే సాహసం చేయకపోవచ్చు.

 వారసుడి కేసు  క్రమశిక్షణకు పరీక్ష 

బండి సంజయ్ కుమారుడు  పోక్సో కేసులో ఇరుక్కోవడం ఆయనకు సమస్యగా మారింది.  బీజేపీ ఎప్పుడూ  వారసత్వ రాజకీయాలకు ,  అక్రమాలకు వ్యతిరేకమని చెబుతుంటుంది. ఈ  వివాదం సమయంలో ఆయనకు కేబినెట్ ర్యాంక్ ఇస్తే, ఆరోపణలు ఉన్న కుటుంబ సభ్యుల పట్ల పార్టీ మెతక వైఖరి అవలంబిస్తోందనే సంకేతాలు వెళ్తాయి. ఒకవేళ ఇదే కారణంతో ఆయనను తప్పిస్తే లేదా ఉన్న పదవిలోనే ఉంచితే మాత్రం, అది సంజయ్ రాజకీయ ప్రస్థానానికి ఒక స్పీడ్ బ్రేకర్ లాంటిదే అని విశ్లేషకులు భావిస్తున్నారు.

 సవాళ్లు - పార్టీలోని అంతర్గత పోటీ 

ఒకప్పుడు తెలంగాణ బీజేపీ అంటే బండి సంజయ్ అన్నట్లు ఉండేది. కానీ ఇప్పుడు ఈటల రాజేందర్ జాతీయ స్థాయిలో చక్రం తిప్పుతున్నారు, రఘునందన్ రావు వంటి వారు కూడా రేసులో ఉన్నారు. ఈ క్రమంలో తన ఉనికిని కాపాడుకోవడానికి సంజయ్ తీవ్రంగా శ్రమించాల్సి వస్తోంది. పార్టీపై ఎంతో నమ్మకంగా ఉన్నానని, క్రమశిక్షణ కలిగిన కార్యకర్తగా అదిష్టానం ఏ బాధ్యత ఇచ్చినా చేస్తానని ఆయన చెబుతున్నప్పటికీ, లోపల మాత్రం  ప్రమోషన్  కోసం గట్టిగానే ప్రయత్నాలు సాగిస్తున్నట్లు తెలుస్తోంది.   జాతీయ స్థాయిలో కేబినెట్ మంత్రులుగా ఉండేవారికి కేవలం దూకుడు మాత్రమే కాదు, పరిపాలనా దక్షత కూడా ఉండాలని అధిష్టానం భావిస్తోంది. బండి సంజయ్ కేవలం  హిందుత్వ ఫేస్ గానే మిగిలిపోతారా లేక  అడ్మినిస్ట్రేటర్  గా గుర్తింపు తెచ్చుకుంటారా అనే దానిపైనే ఆయన పదోన్నతి ఆధారపడి ఉంటుంది.

 భవిష్యత్తు అడుగులు ఎటు? 

బండి సంజయ్ రాజకీయ భవిష్యత్తు ఇప్పుడు ఒక సంధి కాలంలో ఉంది. సామాజిక సమీకరణాలు ఆయనను కాపాడుతాయా లేక వివాదాలు ఆయన వేగాన్ని తగ్గిస్తాయా అన్నది తేలాల్సి ఉంది. ఏది ఏమైనా, తెలంగాణలో బీజేపీ దూకుడు తగ్గకూడదంటే బండి సంజయ్ వంటి మాస్ లీడర్ కేంద్రంలో కీలక పాత్రలో ఉండటం పార్టీకి అవసరమేనని క్యాడర్ నమ్ముతోంది.