BRS vs BJP:  తెలంగాణ రాజకీయ క్షేత్రంలో గత కొంతకాలంగా తెరవెనుక సాగుతున్న పొత్తుల ఊహాగానాలకు, రహస్య అవగాహన ప్రచారాలకు బండి భగీరథ్ పోక్సో కేసు ఉదంతం తెరదించేసింది. వచ్చే ఎన్నికల నాటికి అధికార కాంగ్రెస్ పార్టీని గద్దె దించడమే లక్ష్యంగా.. లోపాయికారీగా భారత్ రాష్ట్ర సమితి , భారతీయ జనతా పార్టీ  ల మధ్య ఒక బలమైన కూటమి లేదా అవగాహన ఏర్పడే అవకాశం ఉందనే నమ్మకం రాజకీయ వర్గాల్లో బలంగా వినిపించింది. దీనికి బలం చేకూరుస్తూ బీఆర్ఎస్ అగ్రనేతలు కేసీఆర్, కేటీఆర్‌లు కేంద్రంలోని బీజేపీ లీడర్‌షిప్‌ను నేరుగా విమర్శించకుండా, కేవలం రాష్ట్ర స్థాయి నేతలపైనే విమర్శల బాణాలు ఎక్కుపెడుతూ వచ్చారు. కానీ, తాజా లీగల్ బ్యాటిల్ ఈ గులాబీ-కమలం సమీకరణాలను పూర్తిగా మార్చేసి, రాబోయే రోజుల్లో రాష్ట్రంలో పక్కాగా త్రిముఖ పోరు జరగబోతోందనే స్పష్టమైన సంకేతాలను ఇచ్చింది.

Continues below advertisement

సయోధ్యకు తావులేదు - బీఆర్ఎస్ దూకుడు 

కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్‌పై నమోదైన పోక్సో కేసును, ఆ తర్వాత చోటుచేసుకున్న పరిణామాలను బీఆర్ఎస్ లీడర్‌షిప్ రాజకీయంగా అత్యంత దూకుడుగా టేకప్ చేసింది. బండి సంజయ్‌ను కేంద్ర మంత్రిమండలి నుంచి తొలగించాలంటూ కేటీఆర్ స్వయంగా డిమాండ్ చేయడం, క్షేత్రస్థాయిలో గులాబీ కేడర్ నిరసనలకు దిగడం ద్వారా తాము బీజేపీతో ఎలాంటి సయోధ్యకూ సిద్ధంగా లేమని బీఆర్ఎస్ స్పష్టం చేసింది. అవకాశం దొరికితే చట్టపరమైన అంశాలను అస్త్రాలుగా మార్చుకుని తమను దారుణంగా దెబ్బకొట్టడానికి, రాజకీయంగా అగాధంలోకి నెట్టడానికి బీఆర్ఎస్ కాచుకుని కూర్చుందనే చేదు వాస్తవం ఈ ఉదంతంతో కమలనాథులకు పూర్తిగా అర్థమైంది.

Continues below advertisement

మెత్తటి వైఖరి వీడనున్న బీజేపీ 

ఈ తాజా ఉదంతంతో బీజేపీ అగ్రనాయకత్వం తన వ్యూహాన్ని పూర్తిగా మార్చేసింది. ఇప్పటివరకు బీఆర్ఎస్ పట్ల చూపిస్తూ వచ్చిన   సానుభూతిని ఇకపై కొనసాగించాల్సిన అవసరం లేదనే తుది నిర్ణయానికి ఢిల్లీ పెద్దలు వచ్చినట్లు తెలుస్తోంది. పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో సాధించిన చారిత్రాత్మక విజయం తర్వాత ఫుల్ జోష్‌లో ఉన్న బీజేపీ, తన తదుపరి ప్రధాన టార్గెట్‌గా తెలంగాణను ఎంచుకుంది. బెంగాల్ తరహాలోనే ఇక్కడ కూడా దూకుడు రాజకీయాలను ప్రదర్శించాలని భావిస్తున్న తరుణంలో, బీఆర్ఎస్ ఇస్తున్న కౌంటర్లు కమలదళాన్ని మరింత రెచ్చగొట్టేలా మార్చాయి. దీంతో బీఆర్ఎస్ పార్టీని క్షేత్రస్థాయిలో పూర్తిగా నిర్వీర్యం చేయడమే ఏకైక లక్ష్యంగా బీజేపీ తన అసలు గేమ్ ను ప్రారంభించబోతోందని విశ్వసనీయ సమాచారం.

 రాబోయే రోజుల్లో రివర్స్ అటాక్ 

ప్రస్తుతం నడుస్తున్న పోక్సో కేసు  తీవ్రత కాస్త చల్లబడిన తర్వాత.. బీఆర్ఎస్ పార్టీపై బీజేపీ ప్లాన్ చేస్తున్న రివర్స్ ఎటాక్ అంతకంటే వంద రెట్లు ఎక్కువ దూకుడుగా ఉంటుందని పార్టీ అంతర్గత వర్గాలు విశ్లేషిస్తున్నాయి.   రాబోయే రెండు, మూడు నెలల వ్యవధిలోనే బీఆర్ఎస్ అగ్రనాయకత్వానికి కేంద్రం తరఫున అసలైన పొలిటికల్ మ్యూజిక్ ప్రారంభమయ్యే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఈ మారిన పరిణామాల వల్ల తెలంగాణ రాజకీయాల్లో ఒకేసారి రెండు సమాంతర యుద్ధాలు జరగబోతున్నాయి. ఒకవైపు అధికార కాంగ్రెస్ పార్టీ క్షేత్రస్థాయిలో బీఆర్ఎస్ ఓటు బ్యాంకును, కేడర్‌ను ఆకర్షించే ప్రయత్నంలో ఉండగా, మరోవైపు కేంద్రంలోని బీజేపీ తన రాజకీయ ,చట్టపరమైన వ్యూహాలతో గులాబీ దళాన్ని డిఫెన్స్‌లోకి నెట్టేందుకు సిద్ధమవుతోంది.  బీఆర్ఎస్ తన ఉనికిని ఎలా కాపాడుకుంటుందనేది మిలియన్ డాలర్ల ప్రశ్న.  

మొత్తం మార్చేసిన బండి భగీరథ కేసు

మొత్తానికి బండి భగీరథ కేసు కేవలం ఒక వ్యక్తిగత చట్టపరమైన వివాదంగా మిగిలిపోకుండా.. తెలంగాణ భవిష్యత్తు పొత్తుల పటాన్ని మార్చేసిన టర్నింగ్ పాయింట్‌గా నిలిచింది. ఇకపై ఎలాంటి రహస్య అవగాహనలకు తావులేకుండా కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు ఒంటరిగానే బరిలోకి దిగడం ఖాయమైంది. ఈ త్రిముఖ పోరులో ఎవరు ఎవరిని దెబ్బతీస్తారు, క్షేత్రస్థాయిలో ప్రభుత్వ వ్యతిరేక ఓట్లను కమలం, గులాబీ పార్టీలు ఎలా పంచుకుంటాయి అనే అంశాలపైనే రాబోయే ఎన్నికల ఫలితాలు ఆధారపడి ఉంటాయి. చదరంగం లాంటి తెలంగాణ రాజకీయాల్లో రాబోయే రోజుల్లో మరిన్ని సంచలన పరిణామాలు చోటుచేసుకోవడం ఖాయంగా కనిపిస్తోంది.