AP Special Assembly hidden agenda : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరోసారి ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలను నిర్వహించాలని నిర్ణయించింది. మహిళా రిజర్వేషన్ బిల్లు వీగిపోవడం, విపక్షాల తీరును ప్రజల్లోకి తీసుకెళ్లడంపై చర్చిస్తారని అంటున్నారు. అయితే ఏపీలో ఈ బిల్లును వ్యతిరేకించిన పార్టీ కాంగ్రెస్ మాత్రమే. పార్లమెంట్లో వైసీపీ కూడా ఈ బిల్లుకు అనుకూలంగానే ఓటు వేసింది. మరి ఎవరికి వ్యతిరేకంగా చర్చిస్తారు?. ఏపీలో కాంగ్రెస్ ప్రభావం నామమాత్రమే. చర్చించడం వల్ల పెద్దగా ప్రయోజనం ఉండదు.
రాజ్యాంగ సవరణ - రాష్ట్రాల ఆమోదం
మహిళా రిజర్వేషన్ల బిల్లు రాజ్యాంగ సవరణకు సంబంధించింది కాబట్టి, ఆర్టికల్ 368 ప్రకారం రాష్ట్రాల ఆమోదం అవసరం. ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాల తర్వాత కేంద్రం ఈ ప్రక్రియను వేగవంతం చేయాలని చూస్తోంది. ఇప్పటికే రాజ్యసభ సభ్యులు బీజేపీలో చేరిక వంటివి జరుగుతున్నాయి. బెంగాల్ ఎన్నికల్లో బీజేపీ గెలిస్తే.. ఆ తర్వాత జరిగే రాజకీయాలు వేరుగా ఉంటాయి. అందుకే ఆ తర్వాత మరోసారి పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేసి రాజ్యాంగసవరణ బిల్లులను ఆమోదించవచ్చని భావిస్తున్నారు. అదే సమయంలో ఈ బిల్లు అమలు కావాలంటే దేశంలోని కనీసం 50 శాతం రాష్ట్రాల అసెంబ్లీల ఆమోదం తప్పనిసరి. కేంద్రం త్వరలోనే ఈ ప్రక్రియను పూర్తి చేయాలని భావిస్తున్న నేపథ్యంలో, దక్షిణాది నుంచి తొలి రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ ఈ బిల్లుకు ఆమోదం తెలిపి, మహిళా సాధికారతపై తన చిత్తశుద్ధిని చాటుకోవాలని చంద్రబాబు వ్యూహరచన చేస్తున్నట్లు తెలుస్తోంది.
అమరావతి మించిన ప్రాధాన్యత?
ఇటీవలే అమరావతి రాజధానిపై తీర్మానం కోసం ప్రత్యేక సమావేశాలు నిర్వహించారు. ఇప్పుడు అంతకు మించిన సందర్భం ఏముందనే ప్రశ్న తలెత్తుతోంది. కేవలం రిజర్వేషన్లకే పరిమితం కాకుండా, ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టంలోని పెండింగ్ హామీలు ..ఇతర అంశాలపై కీలకమైన బిల్లులను ప్రభుత్వం తెరపైకి తెచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు. చర్చల కోణంలో చూస్తే.. మహిళా రిజర్వేషన్లతో పాటు రాష్ట్రంలో అమలు చేస్తున్న తల్లికి వందనం, మహిళల భద్రత కోసం మరిన్ని కఠినమైన చట్టాలను ప్రత్యేక బిల్లుల రూపంలో ప్రవేశపెట్టే అవకాశం ఉంది. ఇతర రాష్ట్రాల్లో కాంగ్రెస్ , ఇతర పార్టీలు ఈ బిల్లుపై రాజకీయ విమర్శలు చేస్తున్న తరుణంలో, ఏపీలో మాత్రం ఎన్డీయే భాగస్వామిగా ఉన్న చంద్రబాబు ఈ అవకాశాన్ని అందిపుచ్చుకుని కేంద్రంతో ఉన్న సాన్నిహిత్యాన్ని, తన పట్టును ప్రదర్శించనున్నారు.
రాజకీయ కోణం - విపక్షానికి సవాల్
వైసీపీ కూడా రిజర్వేషన్లకు అనుకూలమని చెప్పినప్పటికీ, అసెంబ్లీ వేదికగా ఆ పార్టీపై పదునైన విమర్శలు చేసేందుకు ఈ సమావేశాలను వేదికగా మార్చుకోనున్నారు. ఏపీలో జగన్ హయాంలో మహిళా భద్రత, వైసీపీ నేతల వేధింపులు వంటి వాటిపై తులనాత్మక చర్చ జరపడం ద్వారా వైసీపీకి రాజకీయంగా చెక్ పెట్టవచ్చని కూటమి ప్రభుత్వం భావిస్తున్నట్లుగా ప్రచారం జరుగుతోంది. ఈ ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలు కేవలం ఒక సాంకేతిక ప్రక్రియ మాత్రమే కాదు.. ఏపీ రాజకీయాల్లో చంద్రబాబు తన మార్కు మాస్టర్ స్ట్రోక్ ఇవ్వబోతున్నారని ఎక్కువ మంది నమ్ముతున్నారు. అదేమిటనేది అసెంబ్లీ సమావేశాల్లోనే క్లారిటీ వస్తుంది.
