Seat Sharing Issues AP NDA:   ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి  సీట్ల సర్దుబాటు  వేడి మొదలైంది.  2026 జూన్‌లో ఖాళీ అవుతున్న నాలుగు రాజ్యసభ స్థానాల కు షెడ్యూల్ విడుదల కావడంతో అధికార కూటమిలో సమీకరణాలు ఆసక్తికరంగా మారాయి. మొత్తం నాలుగు స్థానాలనూ కూటమి గెలుచుకునే అవకాశం ఉన్నప్పటికీ, వాటి పంపిణీలో తెలుగుదేశం పార్టీ తన కోటాను మిత్రపక్షాలకు ధారపోయాల్సి రావడం ఇప్పుడు క్షేత్రస్థాయి కేడర్‌లో అసహనానికి దారితీస్తోంది. దశాబ్ద కాలంగా పార్టీ కోసం కష్టపడిన 'తమ్ముళ్ల' ఆశలపై కూటమి రాజకీయాలు నీళ్లు చల్లుతున్నాయనే ఆవేదన వ్యక్తమవుతోంది.
 
 
ప్రస్తుత అసెంబ్లీ బలాబలాల ప్రకారం ఖాళీ అవుతున్న 4 రాజ్యసభ స్థానాలనూ  కూటమి అవలీలగా గెలుచుకోగలదు. అయితే, ఢిల్లీ రాజకీయ అవసరాలు,  కూటమి ధర్మం ప్రకారం.. ఈ నాలుగు స్థానాల్లో  రెండింటిని మాత్రమే టీడీపీ  ఉంచుకుని, మిగిలిన రెండింటిని జనసేన ,  బీజేపీలకు కేటాయించే అవకాశం ఉందని తెలుస్తోంది. లోక్‌సభలో బలంగా ఉన్నప్పటికీ, రాజ్యసభలో ప్రాతినిధ్యం పెంచుకోవాలన్న తహతహలో ఉన్న బీజేపీకి ఒక స్థానం, పవన్ కళ్యాణ్ కోరిక మేరకు జనసేనకు ఒక స్థానం దక్కనున్నాయి. దీనివల్ల పదవుల కోసం ఏళ్ల తరబడి వేచి చూస్తున్న టీడీపీ సీనియర్ నేతలకు మొండిచేయి ఎదురవుతోంది.
 
 
కేవలం రాజ్యసభ సీట్లే కాదు, ఇటీవల జరిగిన నామినేటెడ్ పోస్టుల భర్తీలోనూ టీడీపీ కేడర్ తీవ్ర అసంతృప్తితో ఉంది. మొదటి విడతగా ప్రకటించిన కార్పొరేషన్ ఛైర్మన్ పదవుల్లో జనసేన, బీజేపీలకు గౌరవప్రదమైన వాటా దక్కినప్పటికీ, అనేక జిల్లాల్లో క్షేత్రస్థాయిలో పార్టీని కాపాడుకున్న టీడీపీ నేతలకు డైరెక్టర్ పదవులతో సరిపెట్టడంపై అసహనం నెలకొంది. మాజీ మంత్రులు దేవినేని ఉమ వంటి సీనియర్లకు ఇప్పటికీ సరైన గుర్తింపు దక్కకపోవడం, జనసేన సిఫార్సు చేసిన వారికి కీలక పోస్టులు దక్కడం వంటివి టీడీపీ శ్రేణులను ఇబ్బంది పెడుతున్నాయి.
 
 స్థానిక ఎన్నికల భయం – కేడర్ ఆందోళన 
 
ముందున్న స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ ఇదే త్యాగాల పర్వం  కొనసాగుతుందేమోనని కార్యకర్తలు భయపడుతున్నారు. సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాల్లో జనసేన పట్టుబట్టడం వల్ల పదేళ్ల పాటు గ్రామా స్థాయిలో పోరాడిన టీడీపీ కార్యకర్తలు తమ స్థానాలను కోల్పోయే ప్రమాదం ఉందని భావిస్తున్నారు. "అధికారంలోకి వచ్చినా పదవులు మిత్రపక్షాలకే పోతుంటే, మేం ఎవరి కోసం కష్టపడాలి?  అన్న ప్రశ్న తమ్ముళ్ల నుంచి వినిపిస్తోంది. ఈ అసంతృప్తిని చల్లార్చేందుకు చంద్రబాబు నాయుడు, నారా లోకేష్  ప్రయత్నిస్తున్నారు.  నారా లోకేష్ స్వయంగా ప్రతి జిల్లా నేతలతో భేటీ అవుతూ, కూటమి అవసరాలను వివరిస్తూనే.. భవిష్యత్తులో వారికి తగిన గుర్తింపు ఇస్తామని భరోసా ఇస్తున్నారు. నామినేటెడ్ పదవులు రాని వారికి ప్రభుత్వ పథకాల పర్యవేక్షణ కమిటీలు, మార్కెట్ యార్డుల్లో ప్రాధాన్యత కల్పిస్తామని చెబుతున్నారు.
 
కూటమి ధర్మం వర్సెస్ కేడర్ సెంటిమెంట్ 
 
రాష్ట్ర అభివృద్ధికి కేంద్ర సహకారం కావాలంటే బీజేపీని, క్షేత్రస్థాయిలో ఓట్లు చీలకూడదంటే జనసేనను కలుపుకుపోవడం చంద్రబాబుకు అనివార్యం. అయితే, ఈ త్యాగాలు పార్టీ పునాదులను  కదిలించకుండా చూసుకోవడమే ఇప్పుడు టీడీపీ హైకమాండ్ ముందున్న అసలైన సవాలు. 2026 రాజ్యసభ ఎన్నికల నామినేషన్ల నాటికి ఈ అసంతృప్తి తగ్గుతుందా లేదా అనేది పార్టీ అంతర్గత సర్దుబాట్లపైనే ఆధారపడి ఉంది.