Rajya Sabha Elections TDP, Janasena, BJP Seat Sharing: ఆంధ్రప్రదేశ్‌లో వచ్చే నెల జరగనున్న నాలుగు రాజ్యసభ స్థానాల ఎన్నికలు రాష్ట్ర రాజకీయాల్లో అమితాసక్తిని రేకెత్తిస్తున్నాయి. గత అసెంబ్లీ ఎన్నికల్లో అఖండ విజయం సాధించిన తెలుగుదేశం-జనసేన-బీజేపీ కూటమికి అసెంబ్లీలో ఉన్న తిరుగులేని బలంతో, ఈ నాలుగు స్థానాలూ ఏకగ్రీవంగా కూటమి ఖాతాలోకి వెళ్లడం ఖాయంగా కనిపిస్తోంది. అందుకే అభ్యర్థుల ఎంపిక, మిత్రపక్షాల మధ్య సీట్ల పంపకాలపై ఇప్పుడు చర్చోపచర్చలు జరుగుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ నుంచి రాజ్యసభకు ప్రాతినిధ్యం వహిస్తున్న నలుగురు సభ్యులు—ఆళ్ల అయోధ్య రామిరెడ్డి, పిల్లి సుభాష్ చంద్రబోస్, మోపిదేవి వెంకటరమణ, మరియు పరిమల్ నత్వానీల పదవీ కాలం జూన్ 21, 2026తో ముగియనుంది. ఖాళీ అవుతున్న ఈ నాలుగు స్థానాలను భర్తీ చేసేందుకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేయనుంది. అసెంబ్లీలో కూటమికి ఉన్న సుమారు 164 మంది ఎమ్మెల్యేల బలంతో, ఒక్కో స్థానానికి అవసరమైన కోటా ఓట్లు సులభంగా లభిస్తాయి. దీంతో విపక్ష వైఎస్సార్‌సీపీకి ఈ ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం కూడా లేని పరిస్థితి నెలకొంది.

Continues below advertisement

 మిత్రపక్షాల మధ్య సీట్ల లెక్కలు 

ఈ నాలుగు స్థానాల్లో సీట్ల పంపకంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్,  బీజేపీ అగ్రనాయకత్వం మధ్య ఇప్పటికే ప్రాథమిక చర్చలు జరిగినట్లు సమాచారం. అందుతున్న సంకేతాల ప్రకారం.. నాలుగు స్థానాల్లో  రెండు స్థానాలను తెలుగుదేశం పార్టీ  తన వద్దే ఉంచుకుని,  ఒకటి జనసేన కు,  మరొకటి బీజేపీ కి కేటాయించే అవకాశం ఉంది. జాతీయ రాజకీయాల్లో బీజేపీకి మద్దతుగా ఉండటంతో పాటు, రాష్ట్రంలో జనసేన త్యాగాలను గుర్తించి ఈ నిర్ణయం తీసుకున్నట్లు రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి.

Continues below advertisement

 బీజేపీ కోటాలో అన్నామలై? 

బీజేపీకి కేటాయించే ఒక స్థానంపై దేశవ్యాప్తంగా ఆసక్తి నెలకొంది. తమిళనాడులో పార్టీని బలోపేతం చేసేందుకు, ఫైర్ బ్రాండ్ నేత  కె. అన్నామలై ని ఏపీ నుంచి రాజ్యసభకు పంపాలని బీజేపీ హైకమాండ్ యోచిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఆయనను పార్లమెంటుకు పంపడం ద్వారా 2026 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీకి మైలేజీ వస్తుందని ఢిల్లీ పెద్దల వ్యూహం. ఒకవేళ అన్నామలై కాకపోతే, రాష్ట్రానికి చెందిన కీలక నేత లేదా కేంద్ర మంత్రివర్గంలో ఉన్న ఎవరైనా ఒకరికి ఈ అవకాశం దక్కవచ్చు.

 జనసేన నుంచి రేస్‌లో ఎవరు? 

జనసేన పార్టీకి దక్కే ఒక సీటు కోసం పార్టీలో గట్టి పోటీ నెలకొంది. పవన్ కళ్యాణ్‌కు అత్యంత సన్నిహితులు లింగమనేని రమేష్ పేరు వినిపిస్తోంది.  పార్టీ కోసం ఆర్థికంగా , నైతికంగా అండగా నిలిచినందున ఆయనకు ఈ అవకాశం దక్కవచ్చని ప్రచారం జరుగుతోంది. పవన్ కళ్యాణ్ ఈ విషయంలో సామాజిక సమీకరణాలను కూడా పరిగణనలోకి తీసుకునే అవకాశం ఉంది. తెలుగుదేశం పార్టీకి దక్కే రెండు స్థానాల కోసం ఆశావహుల జాబితా చాంతడంత ఉంది. పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు అండగా నిలిచిన సీనియర్ నేతలకు ప్రాధాన్యం ఇవ్వాలని చంద్రబాబు భావిస్తున్నారు. గత ఎన్నికల్లో సీటు త్యాగం చేసిన వారు, కీలకమైన సామాజిక వర్గాలకు చెందిన నేతల పేర్లను పరిశీలిస్తున్నారు. ముఖ్యంగా బీసీ, ఎస్సీ వర్గాల నుంచి ఒక్కొక్కరికి అవకాశం ఇవ్వడం ద్వారా సామాజిక న్యాయం పాటించాలని టీడీపీ యోచిస్తోంది.

ఏకగ్రీవం  ఖాయమే

అసెంబ్లీలో ప్రతిపక్ష వైఎస్సార్‌సీపీకి కేవలం 11 మంది ఎమ్మెల్యేలు మాత్రమే ఉండటంతో, వారు అభ్యర్థిని నిలబెట్టే సాహసం చేయడం లేదు. దీంతో కూటమి ప్రకటించే నలుగురు అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యే అవకాశాలే 99 శాతం ఉన్నాయి. వచ్చే నెలలో నోటిఫికేషన్ వెలువడగానే ఈ ఉత్కంఠకు తెరపడనుంది. మొత్తం మీద ఈ రాజ్యసభ ఎన్నికలు కూటమిలోని మూడు పార్టీల మధ్య బంధాన్ని మరింత బలోపేతం చేసే విధంగా ఉండబోతున్నాయి.