అమ్మో ఆయన కాలు పెడితే ఇంకేమైనా ఉందా? ఒక్కసారి మీరూ ఆలోచించండి అని వైసీపీ నేతలు మరోసారి సెంటిమెంట్‌ని గుర్తు చేస్తున్నారు. ఇంతకీ ఎవరి గురించి అంటే టిడిపి అధినేత చంద్రబాబు ఆయన కొడుకు లోకేష్‌ గురించేనంటున్నారు. తండ్రీ కుమారులు ఎక్కడ లెగ్‌ పెడితే అక్కడ భస్మమేనని పదేపదే నొక్కి చెబుతున్నారు. 


టిడిపి అధినేత చంద్రబాబు రోడ్‌ షోల్లో అపశృతి జరగడం ఆపార్టీని కలవరపెడుతోంది. ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తి చూపుతూ నిర్వహిస్తోన్న పలు కార్యక్రమాలు ఎన్నికల ప్రచారాలను తలపించేలా సాగుతున్నాయి. ఈ క్రమంలో భారీగా టిడిపి అభిమానులు, ప్రజలు వస్తున్నారు. చాలా రోడ్‌ షోల్లో తోపులాటలు, ఉద్రిక్తతలు నెలకొంటున్నాయి. ఇంతకుముందు ప్రభుత్వం ఈ తరహా షోలకు అనుమతి నిరాకరించినప్పటికీ కోర్టుల పర్మిషన్‌తో బాబు జిల్లా పర్యటనలు, రోడ్‌షోలు కొనసాగాయి. ఈ క్రమంలోనే కందుకూరులో జరిగిన రోడ్‌ షోలో తొక్కిసలాట జరిగి 8 మంది ప్రాణాలు కోల్పోయారు. గుంటూరులో ఓ ఎన్‌ఆర్‌ఐ ఆధ్వర్యంలో జరిగిన చంద్రన్న సంక్రాంతి కానుక కార్యక్రమంలోనూ తోపులాట జరిగి ముగ్గురు చనిపోయారు. ఈ ఘటనలపై అధికారపార్టీ తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేస్తూ తమదైన స్టైల్లో విమర్శలు చేసింది.


ఒకప్పుడు తనని ఐరన్‌ లెగ్‌ అని అవహేళన చేసిన టిడిపిని అదే స్టైల్లో పంచ్‌ ఇచ్చారు మంత్రి రోజా. ఆ బాబు ఎక్కడ లెగ్‌ పెడితే అక్కడ ప్రాణాలు పోతాయని ఈ చిన్నబాబు ఎక్కడ పాదం మోపితే అక్కడ తండ్రికి చిక్కులేనని చెబుతూ ఎమ్మెల్యేగా గెలవలేని లోకేష్‌ ఎమ్మెల్సీగా సభలోకి అడుగుపెట్టగానే ఓటుకునోటు కేసులో చంద్రబాబుకి నోటీసులు వచ్చాయని గుర్తు చేశారు. అలా ఇద్దరిదీ ఐరెన్‌ లెగ్‌ అని సెటైర్లు వేశారు.


మరో మంత్రి అంబటి కూడా చంద్రబాబు పాదం మాములది కాదన్నారు. ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి అన్న పేరుని పెట్టినప్పుడు ఆపార్టీ నేతలే వద్దన్న విషయాన్ని ప్రస్తావిస్తూ ఆ ఖర్మే టిడిపికి చుట్టుకుందని ఎద్దేవా చేశారు. మాజీ మంత్రి కొడాలి అయితే దశమ గ్రహంతో చంద్రబాబుని పోల్చారు. ఇలా ఏపీ మంత్రులతోపాటు జగన్‌ కూడా బాబు పబ్లిసిటీ పిచ్చితో ప్రజల ప్రాణాలు తీస్తున్నాడని మరోసారి ఆరోపించారు. తూర్పుగోదావరి జిల్లా పర్యటనలో భాగంగా గతంలో గోదావరి పుష్కరాల సమయంలో జరిగిన తొక్కిసలాటని గుర్తు చేశారు.


ఇలా వైసీపీ నేతలంతా మూకుమ్మడిగా టిడిపి పార్టీపై ఐరన్‌ లెగ్ సెంటిమెంట్‌ ముద్ర వేస్తోందన్న వాదన వినిపిస్తోంది. పనిలోపనిగా టిడిపికి మద్దతుగా ఉన్న జనసేన పార్టీని కూడా కలిసొచ్చేలా విమర్శలు చేస్తోంది. రోడ్‌ షోలతో ప్రాణాలు తీస్తోన్న చంద్రబాబుపై ఎందుకు పవన్‌ కల్యాణ్‌ ప్రేక్షకపాత్ర వహిస్తున్నారని నిలదీస్తోంది.