గుంటూరులో జరిగిన తొక్కిసలాటపై ప్రభుత్వం, వైఎస్‌ఆర్‌సీపీ ఒక స్టాండ్‌పై ఉంటే... అందుకు భిన్నంగా మాట్లాడారు మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్. ఇప్పుడు ఆయన చేసిన కామెంట్స్‌ సంచలనంగా మారుతున్నాయి 


గుంటూరు తొక్కిసలాట దురదృష్టకరమన్న వసంత కృష్ణప్రసాద్... దీన్ని చిలువలు పలువలు చేస్తున్నారని కామెంట్ చేశారు. అనుకోకుండా జరిగిన ఘటనే తప్ప ఇందులో ఎలాంటి తప్పు లేదన్నారు. ప్రజలకు నష్టం, కష్టం కలిగించాలన్న ఉద్దశంతో చేసింది కాదేకాదన్నారు. 


ఉయ్యూరు శ్రీనివాస్ తనకు మంచి మిత్రుడని...ప్రవాసాంధ్రుల వలన దేశానికి మంచి జరుగుతుందన్నారు వసంత కృష్ణప్రసాద్‌.
శ్రీనివాస్ పేదల పట్ల అభిమానం ఉన్న వ్యక్తిగా అభివర్ణించారు. టీడీపీతో కలిసి కార్యక్రమం చేశారు కాబట్టే శ్రీనివాస్‌పై ఇలా వివాదాలు ముసురుకుంటున్నాయన్నారు. 


సేవా కార్యక్రమాలు చేయడం మంచి పని అని అభిప్రాయపడ్డారు వసంత కృష్ణప్రసాద్‌. ఇలా ప్రవర్తిస్తే భవిష్యత్‌లో ప్రవాసాంధ్రుల ఇక్కడ సేవ చేయడానికి ముందుకు రారని... ఎలాంటి సేవా కార్యక్రమాలు చేయరని ఆందోళన వ్యక్తం చేశారు.
ఎన్‌ఆర్‌ఐలను భయపడ్డే సంస్కృతి మంచిది కాదన్నారు. ఎన్‌ఆర్‌ఐలు వాళ్ల పని వాళ్లు చేసుకోవాలని కొందరు కామెంట్స్‌ చేస్తున్నరాని ఇది సరికాదన్నారు. ఇలా చేస్తే వారు చేసే అభివృద్ధిని ఆపడమే అవుతుందన్నారు.