Andhra Pradesh DSC 2025:  ఆంధ్రప్రదేశ్‌లో 'మెగా డీఎస్సీ'  నియామకాల చుట్టూ జరుగుతున్న రాజకీయ పోరు తీవ్ర స్థాయికి చేరింది. ఉపాధ్యాయ నియామకాలు పూర్తయి అభ్యర్థులు విధుల్లో చేరిన తొమ్మిది నెలల తర్వాత, ప్రతిపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ  ఒక్కసారిగా ఈ అంశాన్ని తెరపైకి తెచ్చింది. పేపర్ లీకులు, స్పోర్ట్స్ కోటాలో అక్రమాలు జరిగాయని, అర్హులకు అన్యాయం చేసి ఉద్యోగాలు అమ్ముకున్నారంటూ రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలకు దిగింది. అయితే, ఈ రాజకీయ దాడిని అధికార తెలుగుదేశం పార్టీ  కూటమి ప్రభుత్వం ఎదుర్కొంటున్న తీరు, క్షేత్రస్థాయిలో అందుతున్న పారదర్శక వివరణలు వైరల్ అవుతున్నాయి.   తొమ్మిది నెలల తర్వాత వైసీపీ అటాక్ – టైమింగ్ వెనుక వ్యూహం 

Continues below advertisement

ఉద్యోగ నియామకాలు ముగిసి, విద్యావ్యవస్థ సాఫీగా సాగుతున్న తరుణంలో వైసీపీ ఈ వివాదాన్ని లేపడం వెనుక పక్కా రాజకీయ కార్యాచరణ ఉందనేది స్పష్టమవుతోంది. స్పోర్ట్స్ కోటా కింద 421 పోస్టుల భర్తీలో నిబంధనలు ఉల్లంఘించారని, జీవోలను మార్చడం ద్వారా తప్పుడు సర్టిఫికేట్లు ఉన్నవారికి లబ్ధి చేకూర్చారని మాజీ మంత్రి పేర్ని నాని వంటి సీనియర్ నేతలు ఆరోపిస్తున్నారు. ఉపాధ్యాయ ఉద్యోగం రాని నిరుద్యోగుల్లో ఉన్న అసంతృప్తిని క్యాష్ చేసుకుని, కూటమి ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత పెంచాలనే ఉద్దేశంతోనే ఈ పేపర్ లీక్, అక్రమాల అస్త్రాన్ని ఆ పార్టీ ప్రయోగించిందని  భావిస్తున్నారు.

 ఆవేశపడకుండా 'ఆధారాలతో' సమాధానం ఇస్తున్న ప్రభుత్వం 

Continues below advertisement

సాధారణంగా ఇలాంటి భారీ ఆరోపణలు వచ్చినప్పుడు ప్రభుత్వాలు డిఫెన్స్‌లో పడటం లేదా ఎదురుదాడికి దిగడం చూస్తుంటాం. కానీ, చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఈ విషయంలో వ్యూహాత్మక ఓపికను ప్రదర్శిస్తోంది.  స్వయంగా ప్రెస్ మీట్ పెట్టి, వైసీపీ చేస్తున్న ప్రతి ఆరోపణకూ సుదీర్ఘంగా, ఓపిగ్గా వివరణ ఇచ్చారు. స్పోర్ట్స్ కోటా భర్తీ అంతా కేంద్ర ప్రభుత్వం నిర్దేశించిన కేటగిరీలు, గైడ్‌లైన్స్ ప్రకారమే జరిగిందని, ఆరోపణలు చేసేవారికి కనీసం అందులోని క్రీడల పేర్లు కూడా తెలియవంటూ సీఎం గట్టి కౌంటర్ ఇచ్చారు. అలాగే విద్యాశాఖ ఉన్నతాధికారులు కూడా ప్రెస్ మీట్లు పెట్టి ప్రతి అంశాన్ని లెక్కలతో సహా నిరూపిస్తున్నారు.

 డిజిటల్ పారదర్శకత  – సామాజిక మాధ్యమాల్లో వాస్తవాల ప్రదర్శన 

వైసీపీ అనుకూల మీడియా , సోషల్ మీడియా హ్యాండిల్స్ ఎక్కడ ఏ అభ్యర్థి పేరుతో తప్పుడు ప్రచారం ప్రారంభించినా, టీడీపీ సోషల్ మీడియా విభాగాలు గంటల వ్యవధిలోనే ఆ అభ్యర్థికి సంబంధించిన హాల్ టికెట్ నంబర్, మెరిట్ మార్కులు, ర్యాంకు వివరాలను ఆధారాలతో సహా ఆన్‌లైన్‌లో పెడుతున్నాయి. మెరిట్ జాబితాలో లేని వారు, క్వాలిఫై కాని వారు కేవలం నిరుద్యోగులను తప్పుదోవ పట్టించడానికి చేస్తున్న ప్రయత్నాలను డిజిటల్ సాక్ష్యాలతో తిప్పికొడుతున్నారు. ప్రభుత్వం డీఎస్సీ డేటాను, సెలక్షన్ లిస్టులను పూర్తిగా ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంచడం, ఎవరికి ఏ అనుమానం ఉన్నా వెరిఫై చేసుకునే వీలు కల్పించడంతో సాధారణ అభ్యర్థులకు సైతం వాస్తవాలు కళ్లెదుటే కనిపిస్తున్నాయి. దీంతో ఒకప్పుడు క్షేత్రస్థాయిలో సంచలనం సృష్టిస్తుందనుకున్న వైసీపీ డీఎస్సీ స్కామ్  వాదన.. డేటా ముందు నిలబడలేక క్రమంగా పస కోల్పోతోంది. ఉపాధ్యాయులుగా ఎంపికైన రూరల్ బ్యాక్‌గ్రౌండ్ అభ్యర్థులు, క్రీడాకారులు కూడా స్వయంగా వీడియోలు విడుదల చేస్తూ.. తాము కష్టపడి మెరిట్ ద్వారానే ఉద్యోగాలు సాధించామని, తమను రాజకీయంలోకి లాగొద్దని అంటున్నారు. 

 పైచేయి ఎవరిది? 

ఈ మొత్తం ఎపిసోడ్‌ను గమనిస్తే, రాజకీయంగా ప్రస్తుతానికి కూటమి ప్రభుత్వానిదే పైచేయిగా కనిపిస్తోంది. వైసీపీ ఆరోపణల తీవ్రతతో ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టాలని చూసినప్పటికీ, టీడీపీ ప్రభుత్వం ఆవేశం కంటే డేటా ప్రదర్శన  మిన్న అనే సూత్రాన్ని నమ్మింది. అయితే, కోర్టుల్లో నడుస్తున్న కొన్ని పిటిషన్లు, విచారణల వల్ల భవిష్యత్తులో ఈ వివాదం ఎలాంటి మలుపు తీసుకుంటుందనేది చూడాలి. కానీ ప్రస్తుతానికి మాత్రం పారదర్శకత అనే కేడర్ ద్వారా ప్రభుత్వం ఈ పొలిటికల్ దాడిని విజయవంతంగా తిప్పికొట్టిందనే చెప్పవచ్చు.