Andhra Pradesh Legislative Council : అసెంబ్లీ ఎన్నిక‌ల్లో వైసీపీ ఘోర పరాజ‌యం త‌ర్వాత ఆ పార్టీకి వ‌రుస‌గా షాక్‌ల మీద షాక్‌లు త‌గులుతున్నాయి. పార్టీ నాయ‌కులు ఒక్కొక్క‌రిగా వైసీపీని వీడి ప్రత్యామ్నాయం కోసం చూస్తున్నారు. తాజాగా వైసీపీకి మ‌రో పెద్ద ఎదురుదెబ్బ త‌గిలింది. మంత్రి నారా లోకేశ్‌ను మండ‌లి డిప్యూటీ ఫ్లోర్ లీడ‌ర్ జ‌కియా ఖానుమ్ క‌ల‌వ‌డం ప్రాధాన్య‌త సంత‌రించుకుంది. కొంత‌కాలంగా ఆమె వైసీపీని వీడి టీడీపీలో చేర‌తార‌నే ప్ర‌చారం జ‌రుగుతోంది. వైసీపీ నేతలు అసెంబ్లీ సమావేశాలను బహిష్కరించినా, ఆమె మాత్రం శాసనమండలికి హాజరవుతున్నారు.మంత్రి ఫరూఖ్‌ను జకియా ఖానమ్ ఇటీవలే కలవడంతో ఊహాగానాలకు బలం చేకూరింది. ఇప్పుడు ఆమె  తన కుటుంబ సభ్యులతో కలిసి మంత్రి నారా లోకేశ్ తో భేటీ అయ్యారు. లోకేశ్ తో పలు అంశాలపై ఆమె చర్చించారు. ఇప్ప‌టికే మంత్రి ఫ‌రూక్‌తో భేటీ అయిన ఆమె తాజాగా మంత్రి నారా లోకేశ్‌ను కుటుంబం స‌భ్యుల‌తో వెళ్లి పుష్ప‌గుచ్ఛం అందించి రావ‌డం చూస్తుంటే త్వ‌ర‌లోనే ఆమె వైసీపీకి గుడ్ బై చెబుతార‌నే టాక్ న‌డుస్తోంది. 


మొట్ట‌మొద‌టి సారిగా డిప్యూటీ చైర్మ‌న్‌గా మైనారిటీ మ‌హిళ‌


రాయచోటి నియోజకవర్గానికి చెందిన జకియా ఖానంకు వైసీపీ నుంచి ఎమ్మెల్సీని చేయడమే కాకుండా.. మండలి డిప్యూటీ చైర్ పర్సన్ పదవి కూడా కట్టబెట్టింది పార్టీ. మూడేళ్ల పాటు పార్టీలో, పార్టీ పెద్దలతో బాగానే ఉన్న జకీయా ఈ మధ్య ఎందుకో వైసీపీతో అంటీముట్టనట్టుగానే ఉంటున్నారు. ఈ క్రమంలోనే పార్టీతో చెడిందని.. వైసీపీకి గుడ్ బై చెప్పడానికి సిద్ధమైనట్లు వార్తలు గుప్పుమన్నాయి. సరిగ్గా ఈ నేపథ్యంలోనే మంత్రి నారా లోకేశ్‌తో జకియా ప్రత్యేకంగా భేటీ అయ్యారు. అసెంబ్లీ సమావేశాలకు హాజరైన ఎమ్మెల్సీ జకియా ఖానమ్ కుటుంబ సభ్యులతో కలిసి మంత్రితో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా లోకేశ్‌కు పుష్పగుచ్ఛం అందజేసి మరీ అభినందించారు. దాదాపు అరంగట  శాసన మండలి లాబీలో ఈ భేటీ జరిగింది. టీడీపీలో (Telugu Desam) చేరికపై ఆమె ప్రస్తావించగా.. లోకేశ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లుగా టాక్ నడుస్తోంది. దీంతో ఇన్నాళ్లు టీడీపీలో చేరికపై వచ్చిన వార్తలకు మరింత ప్రాధాన్యత సంతరించుకున్నట్లు అయ్యింది. జకియా ఖానం త్వరలోనే టీడీపీలోకి అంటూ అటు వైసీపీలో.. ఇటు తెలుగుదేశం పార్టీలోనూ పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. రాష్ట్ర శాసనమండలి చరిత్రలోనే మొట్ట మొదటిసారి ఓ మైనారిటీ మహిళను డిప్యూటీ చైర్ పర్సన్‌గా ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు అప్పట్లో వైసీపీ ప్ర‌చారం చేసుకుంది. 


టీడీపీకీ మండ‌లి స‌భ్యులు అవ‌స‌ర‌మే..


సంఖ్యా ప‌రంగా చూసుకుంటే మండ‌లిలో టీడీపీకి బ‌లం చాలా త‌క్కువ‌గా ఉంది. ఏవైనా బిల్లులు పాస్ కావాలంటే మ‌రింత మంది మండ‌లి స‌భ్యులు అవ‌స‌రం. ఈ నేప‌థ్యంలో వైసీపీ నుంచి ఎంత‌మంది వ‌చ్చినా కాద‌న‌కుండా చేర్చుకునే ఆలోచ‌న‌లో టీడీపీ ఉంది. భారీ ఓట‌మి త‌ర్వాత పార్టీ నాయ‌కుల్లోనూ నిస్తేజం ఆవ‌రించింది. చంద్ర‌బాబు నుంచి గ్రీన్ సిగ్న‌ల్ రావ‌డ‌మే త‌రువాయి పార్టీ మారేందుకు చాలా మంది ఎమ్మెల్సీలు సిద్ధంగా ఉన్నార‌ని టీడీపీ కూడా ప్ర‌చారం చేసుకుంటోంది. కానీ త‌మ‌కు తాముగా చేర్చుకుంటే ప్ర‌జ‌ల్లో చెడ్డ‌పేరు వ‌స్తుంద‌ని గ్ర‌హించి సంద‌ర్భం కోసం ఎదురు చూస్తున్నట్టుగా తెలుస్తోంది.


Also Read: 'జగన్ గారూ మీకు ఎందుకు సంఘీభావం ప్రకటించాలి?' - ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పాలంటూ వైఎస్ షర్మిల కౌంటర్