Chandra Babu And Modi: విజయం సాధించి ముఖ్యమంత్రిగా ఢిల్లీ వెళ్లిన ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కేంద్రం ముందు భారీ డిమాండ్లు ఉంచినట్టు సమాచారం. దీనిపై బ్లూమ్‌బర్గ్ సంచలన కథనం ప్రచురించింది. తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో ఇదే సంచలనంగా మారుతోంది. దీన్ని కోట్ చేసిన తెలంగాణ మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ ప్రజలూ గమనిస్తున్నారా అంటూ ఆయన బ్లూమ్‌బర్గ్‌ కథనాన్ని రీపోస్టు చేశారు. 


ఈ నెలలోనే కేంద్రం బడ్జెట్ ప్రవేశపెట్టనుంది. అదే టైంలో ఏపీ కూడా బడ్జెట్ ప్రవేశ పెట్టనుంది. ఇప్పటికే అప్పుల ఊబిలో ఉన్న ఆంధ్రప్రదేశ్‌ను కేంద్ర సాయం లేకపోతే గట్టెక్కించడం కష్టమని మొదటి నుంచి చెబుతున్న ఏపీ సీఎం అదే దిశగా ప్రయత్నాలు చేస్తోంది. మొన్నటి ఢిల్లీ టూర్‌లో ఇదే అంశంపై కేంద్రంతో చంద్రబాబు చర్చలు జరిపారని బ్లూమ్‌బర్గ్ సంచలన కథనం ప్రచురించింది. 






ఆ కథనంలో ఏముంది అంటే... 
ట్రిలియన్‌ రూపాయలు కేంద్రం సాయం ఉంటే తప్ప ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం నిలదొక్కోవడం చాలా కష్టమని కేంద్రానికి చంద్రబాబు చెప్పారట. ఆంధ్రప్రదేశ్ రాజధాని నిర్మాణంతోపాటు ఇతర కీలకమైన ప్రాజెక్టులు పూర్తి చేయాలంటే భారీగా నిధులు అవసరమని ప్రధానమంత్రి మోదీకి చెప్పినట్టు ఆ కథనం వెల్లడించింది. ఏపీ కోలుకునేందుకు ఈ బడ్జెట్‌లో కేంద్రం నుంచి భారీగా సాయం చేయాలనే ప్రతిపాదన మోదీ ముందు చంద్రబాబు ఉంచారని సమాచారం. 


ప్రస్తుత మోదీ ప్రభుత్వానికి పెద్దగా మెజార్టీ లేదు. ఈ ప్రభుత్వం ఓవైపు నితీష్‌ కుమార్, మరోవైపు చంద్రబాబు మద్దతుపై ఆధారపడి ఉంది. అందుకే దీన్నే ఛాన్స్‌గా తీసుకుంటున్న రెండూ పార్టీలు బడ్జెట్‌లో కేటాయింపులు పెంచుకునేందుకు ఒత్తిడి తీసుకొస్తున్నారని టాక్. ఇప్పటికే ప్రత్యేక హోదా డిమాండ్‌ను నితీష్ కుమార్ కేంద్రం ముందుకు తీసుకొచ్చారు. ఇప్పుడు చంద్రబాబు కూడా నిధులపై పట్టుబడుతున్నారే మాట గట్టిగా వినిపిస్తోంది. 


కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వంలోని కీలక వ్యక్తులతో మాట్లాడామని... బహిరంగంగా మాట్లాడేందుకు అంగీకరించని ఆ వ్యక్తులు కీలక సమాచారం అందించినట్టు బ్లూమ్‌బర్గ్ పేర్కొంది. ఇప్పటికి ఉన్న సమాచారం ప్రకారం ఆర్థిక చేయూత ఇచ్చేందుకు మోదీ అంగీకరించారని చెబుతున్నారు. చంద్రబాబు అడిగిన సాయం చేస్తార... లేకుంటే అన్ని రాష్ట్రాలకు ఇచ్చినట్టే ఇస్తారా అనేది మాత్రం క్లారిటీ లేదంటున్నారు. ఆర్థిక స్థితిగతులపై ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధులతో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మాట్లాడారని ఆ కథనంలో వెల్లడించింది. ఒక ట్రిలియన్ రూపాయలు కేంద్రం నుంచి సాయం అభ్యర్థించినట్టు రాష్ట్ర ప్రతినిధులు చెబుతున్నారు. 


మార్చి 2025 వరకు ఆర్థిక సంవత్సరానికి అదనంగా 0.5% రుణాలు తీసుకోవడాన్ని అనుమతించి రాష్ట్ర జీడీపీలో ఆర్థిక లోటు 3% పరిమితి పెంచాలని కోరారు. ఇది 70 బిలియన్‌ రూపాయలతో సమానమని అంటున్నారు. అమరావతి కోసం 500 బిలియన్ రూపాయలు, ఈ ఏడాదిలో మిగతా అవసరాల కోసం 150 బిలియన్ రూపాయలు, ఏడాదిలో పోలవరం ప్రాజెక్టు కోసం 120 బిలియన్ రూపాయలు కేటాయించాలని రిక్వస్ట్ పెట్టుకున్నారు. 


అప్పులు క్లియర్ చేయడానికి 150 బిలియన్ రూపాయలు. మౌలిక సదుపాయల కల్పనకు మరో వంద బిలియన్ రూపాయలు కేంద్రం 50 సంవత్సరాల రుణ పథకం కింద ఇవ్వాలని కోరారు. 
ఇప్పుడు వివిధ రాష్ట్రాల నుంచి వస్తున్న డిమాండ్లు జాతీయ బడ్జెట్‌పై తీవ్ర ఒత్తిడి పెంచుతున్నాయి. ఇదే టైంలో అప్పుల భారాన్ని తగ్గించాలని కేంద్రం ప్రయత్నాలు చేస్తోంది. మరోసారి ఆర్థిక మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన నిర్మలా సీతారామన్‌ 2025 మార్చి నాటికి జీడీపీలో లోటును 5.1 శాతానికి తగ్గించాలని భావిస్తున్నారు. 


రాష్ట్రాలకు నేరుగా ఎలాంటి నిధులు ఇచ్చే వీలు లేని వేళ రాజకీయ ఒత్తిళ్లను తట్టుకునేందుకు భిన్న మార్గాల్లో నిధులు సాయం చేయవచ్చని తెలుస్తోంది. అదే బాటలో ఏపీకి కూడా సాయం అందించవచ్చనే చర్చ జరుగుతోంది. ప్రత్యేకరాష్ట్రంగా విడిపోయినప్పటి నుంచి ఆంధ్రప్రదేశ్ ఆర్థిక సమస్యలను ఎదుర్కొంటోంది. 20219 వరకు జీడీపీలో 31 శాతంగా ఉన్న అప్పు 34 శాతానికి పెరిగింది. ఇప్పుడున్న పరిస్థితిలో శాలరీలు, పింఛన్లు, ఇతర ఖర్చులకు అప్పులు చేయాల్సిన పరిస్థితి ఉందని దీని నుంచి బయటపడాలంటే కేంద్ర సాయం తప్పనిసరి అంటున్నారు టీడీపీ నేతలు. అందుకే భారీ డిమాండ్లు కేంద్రం ముందు ఉంచామన్నారు. 


ఇదే విషయన్ని కేటీఆర్ తన ట్విటర్‌లో పోస్టు చేశారు. ప్రాంతీయ పార్టీగా బలంగా ఉంటే ఇలానే డిమాండ్లు సాధించుకోవచ్చని అన్నారు. ఈ విషయంపై తెలంగాణ ప్రజలు చాలా జాగ్రత్తగా గమనిస్తున్నారని అభిప్రాయపడ్డారు. స్వీయ రాజకీయ అస్థిత్వమే తెలంగాణకు శ్రీరామ రక్ష అంటూ చెప్పుకొచ్చారు.