AP BJP :  మాజీ మంత్రి కన్నా లక్ష్మినారాయణ వ్యక్తం చేసిన అసంతృప్తి ఏపీ బీజేపీలో అంతకంతకూ పెరిగిపోతోంది. అయితే ఎవరూ బయట మీడియాతో మాట్లాడవద్దని స్పష్టమని ఆదేశాలు రావడంతో అందరూ అంతర్గతంగా తన అసంతృప్తిని మీడియాకు వెల్లడిస్తున్నారు. సోము వీర్రాజు ఏపీ బీజేపీ చీఫ్‌గా ఉంటే కష్టమని ఆయనను తక్షణం తొలగించాలన్న డిమాండ్‌ను హైకమాండ్ ముందు ఉంచుతున్నారు. ఇటీవల సోము వీర్రాజును మారుస్తారని ప్రచారం జరిగింది. సీనియర్ నేత సత్యకుమార్ లేదా మరో యువనేతకు చాన్సిస్తారని అనుకున్నారు.కానీ మూడు రోజుల కిందట సోము వీర్రాజు నేతృత్వంలోనే ఎన్నికలకు వెళ్తామని రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ సునీల్ ధియోధర్ ప్రకటించడంతో పార్టీలో కలకలం ప్రారంభమయింది. 


బీజేపీని రెండు వర్గాలుగా మార్చేశారని సోముపై విమర్శలు


సోము వీర్రాజు బీజేపీని సరిగ్గా నడపడం లేదని.. ఉన్న పార్టీనే రెండు వర్గాలుగా మార్చేసుకుని ఓ వర్గానికి నేతగా చెలామణి అవుతున్నారన్న విమర్శలు ఉన్నాయి. గత ఎన్నికల్లో పార్టీలో చేరిన వాళ్లను అసలు ఎప్పుడూ పట్టించుకోలేదు. అదే సమయంలో తన వర్గం కాదు అనుకున్న కొంత మంది నేతలకూ గుర్తింపు లేకుండా పోయింది. సోము వీర్రాజుతో పాటు ఆయనకు సన్నిహితులుగా ఉండేవారే పూర్తి స్థాయిలో చక్రం తిప్పుతూ వస్తున్నారు. ఇది ఇతర నేతల్లో అసంతృప్తికి కారణం అయింది. సోము వీర్రాజు పూర్తిగా ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరిస్తున్నారన్న విమర్శలు మొదటి నుంచి ఉన్నాయి. తాజాగా ఆయనపై అవినీతి ఆరోపణలు కూడా చేస్తున్నారు. 


సత్యకుమార్‌ను ఏపీ బీజేపీ చేయాలని కొంత మంది నేతల విజ్ఞప్తులు


జాతీయ కార్యదర్శిగా ఉన్న సత్యకుమార్ ప్రస్తుతం ఏపీ రాజకీయాలపై దృష్టి పెట్టారు. మూడు నెలల కిందట విజయవాడలో సోము వీర్రాజు నాయకత్వాన్ని వ్యతిరేకించేవారంతా విందు  భేటీ పేరుతో రహస్యంగా సమావేశం అయ్యారు. ఆ సమావేశంలో సత్యకుమార్ ను .. ఏపీ బీజేపీ అధ్యక్ష పదవి చేపట్టాలని నేతలు కోరారు. వారంతా తమ అభిప్రాయాల్ని బీజేపీ హైకమాండ్‌కు  పంపుతామన్నారు. ఇప్పుడు సందర్భం వచ్చింది కాబట్టి సోము వీర్రాజును మార్చేందుకు తమ వంతు ప్రయత్నాలు ప్రారంభించారు. సోము వీర్రాజు తీరుపై హైకమాండ్‌కు ఫిర్యాదులు చేస్తున్నారు. ఆయనను మార్చకపోతే పార్టీలో కొనసాగడం కష్టమని చెబుతున్నట్లుగా తెలుస్తోంది. 


పార్టీలో చేరిన వారిని దూరం పెట్టిన సోము వీర్రాజు 


సోము వీర్రాజు బాధ్యతలు చేపట్టిన తర్వాత వరుసగా కొంత మంది నేతల్ని సస్పెండ్ చేశారు. లంక దినకర్, ఓవీ రమణ  వంటి నేతలను బయటకు పంపారు.కొన్నాళ్ల తర్వాత సస్పెన్షన్ ఎత్తివేశారు. ఇప్పటికీ వారికి ప్రాధాన్యం లభించడం లేదు. ఇతర రాష్ట్రాల్లో బీజేపీలో చేరే వారితో పార్టీని బలపర్చుకుంటూ ఉంటే.. ఏపీలో మాత్రం..  పార్టీలో చేరిన వారందర్నీ కోవర్టు ముద్ర వేసి.. పక్కన పెట్టారని అంటున్నారు. మొత్తంగా సోము వీర్రాజుపై ఇప్పుడు ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. వచ్చే ఎన్నికలకు ఏపీలో తానే సారధ్యం వహించాలని ఆయన అనుకుంటున్నారు. సునీల్ ధియోధర్, జీవీఎల్ వంటి వారి సపోర్ట్ ఉన్నా..  ఆ కోరిక తీరుతుందో లేదో చెప్పడం కష్టంగా మారింది.