Telangana News : మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్ పార్టీలో చేరారని సంతోషపడేలోగానే  ఆ పార్టీకి చెందిన ఆలేరు మాజీ ఎమ్మెల్యే బూడిద భిక్షమయ్య గౌడ్ రాజీనామా చేయడం బీజేపీ నేతలకు షాకిచ్చింది.   భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యంగా బడుగు బలహీన వర్గాలకు చేస్తున్న తీవ్ర అన్యాయాన్ని, వివక్షను చూశాక ఆ పార్టీలో కొనసాగడంలో ఏమాత్రం అర్థం లేదని భావిస్తూ, భారతీయ జనతా పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నానని భిక్షమయ్య గౌడ్ ప్రకటించారు.  సీనియర్ నేతనైన తనకు  ఆ పార్టీలో చేరిన నాటి నుంచి అడుగడుగునా అవమానాలు ఎదురయ్యాయని..  పార్టీలో నాలాంటి బీసీ నాయకులను పట్టించుకునే వారే లేరని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.  


తెలంగాణకు బీజేపీ ఏమీ చేయలేదన్న భిక్షమయ్య !


కోమటిరెడ్డి సోదరులు  వందల మంది గౌడ సోదరుల రాజకీయ జీవితాలను సమాధి చేశారు.  వారి దుర్మార్గపు రాజకీయలకు వ్యతిరేకంగానే తాను బీజేపీలో చేరానన్నారు.  కానీ రాజగోపాల్ రెడ్డి తన కాంట్రాక్టుల కోసం పార్టీ మారి బిజెపిలోకి వచ్చారు. అయన వేల కోట్ల అర్ధిక లాభం కోసం ఉపఎన్నిక తెచ్చి, బిజెపి పార్టీ బిసిల మనోభావాలకు విలువ లేకుండా చేసిందని ఆరోపించారు.  రాజగోపాల్ రెడ్డి రాజకీయాలకు వ్యతిరేఖంగా బిజెపి పార్టికి రాజీనామా చేయాలని నిర్ణయం తీసుకున్నానన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న స్థానిక నాయకత్వంపైన ఢిల్లీలోని బిజెపి హై కమాండ్ కి ఏ మాత్రం పట్టులేదనే విషయం నాకు పార్టీలో చేరిన కొద్ది కాలనికే అర్థమైంది. గత దశాబ్ద కాలంగా తెలంగాణలో ఎలాంటి మత సంఘర్షణలు ఆందోళనలు లేకుండా కొనసాగుతున్న ప్రశాంతమైన శాంతియుత వాతావరణాన్ని చెడగొట్టేలా స్థానిక బిజెపి నాయకులు ఉద్రేకాలు పెంచేలా మాట్లాడినా, బిజెపి హై కమాండ్ స్పందించకపోవడం నన్ను ఎంతో కలతకు గురిచేసిందని గౌడ్ లేఖలో తెలిపారు. 


సమాజాన్ని విడగొట్టేందుకు ప్రయత్నిస్తోందన్న మాజీ ఎమ్మెల్యే


హిందూ సమాజం భావోద్వేగాలను రెచ్చగొట్టి, వాటిని రాజకీయాల కోసం ఉపయోగించుకోవడమే పనిగా పెట్టుకున్న భారతీయ జనతా పార్టీ, ఇప్పటిదాకా ఆధునిక భారతదేశ చరిత్రలో ఎప్పుడు లేని విధంగా అద్భుతంగా నిర్మించిన యాదాద్రి దేవాలయానికి ఒక్క రూపాయి కూడా సహాయం చేయలేదు.తన సొంత పూర్వ నల్లగొండ జిల్లాకే కాకుండా తెలంగాణకే తలమాణికంగా నిలిచేలా నిర్మాణం చేసిన యాదాద్రి పుణ్యక్షేత్రాన్ని కనీసం గుర్తించలేని బిజెపి వైఖరి, వారు చేప్పే మాటలకి వారి చేతలకు అర్థం లేదనే విషయం తేలిపోతుందన్నారు.  నల్లగండ జిల్లాకు  బీజేపీ ఇచ్చిన హామీల్ని నెరవేర్చలేదన్నారు. దీంతోపాటు నా చిన్నతనం నుంచి చూస్తూ వచ్చిన దశాబ్దాల ప్లోరైడ్ రక్కసిని తరిమికొట్టిన తెలంగాణ ప్రభుత్వానికి, మిషన్ భగీరథ కార్యక్రమానికి ఒక్క రూపాయి ఇవ్వకపోగా ఈ 2016లో ప్రస్తుత బిజెపి అద్యక్షులు, అప్పటి కేంద్ర అరోగ్య మంత్రి జెపి నడ్డా గారు మునుగొడులోని మర్రిగూడలో ప్లొరైడ్ భాదితుల కోసం కట్టిస్తామన్న 300 పడకల అసుపత్రికి అతీగతి లేదు. చౌటుప్పల్ అయన ఎర్పాటు చేస్తామని ప్రకటించిన ప్లొరైడ్ రిసెర్చ్ అండ్ మిటిగేషన్ సెంటర్ కోసం తెలంగాణ ప్రభుత్వం దండుమల్కాపూర్ లో 8.2 ఏకరాల స్ధలం కేటాయించినప్పటికీ కేంద్రం నుంచి ఇప్పటికీ నయాపైస రాలేదని మండిపడ్డారు. 


త్వరలో టీఆర్ఎస్‌లో చేరిక


భిక్షమయ్య గౌడ్ లేఖలో రాసిన అంశాలను బట్టి చూస్తే ఆయన టీఆర్ఎస్‌లో చేరడం ఖాయమని అనుకోవచ్చు. టీఆర్ఎస్ నుంచి ఓ బీసీ నేత బీజేపీలో చేరిన వెంటనే.. కౌంటర్ గా భిక్షమయ్య గౌడ్‌తో టీఆర్ఎస్ నేతలు చర్చలు పార్టీలో చేర్చుకున్నట్లుగా కనిపిస్తోంది. ఆయన గతంలో కాంగ్రెస్ తరపున ఓ సారి ఆలేరు నుంచి గెలిచారు. తర్వాత రెండు సార్లు ఓడిపోయారు.  బీజేపీలో చేరే ముందు టీఆర్ఎస్‌లో చేరారు. ఇప్పుడు మళ్లీ టీఆర్ఎస్‌లో చేరనున్నారు.