Andhra Politics:  వైసీపీ పార్టీ, ప్రభుత్వం వేరు వేరు కాదని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ( Sajjala ) స్పష్టం చేశారు. పార్టీ ప్రచారాన్ని ప్రభుత్వం ద్వారా నిర్వహిస్తున్నారని వస్తున్న విమర్శలపై ఆయన ఇలా స్పందించారు. అయితే నిజంగా పార్టీ , ప్రభుత్వం ఒకటేనా అంటే.. పార్టీ వేరు, ప్రభుత్వం వేరు అని  చెప్పక తప్పదు. పార్టీ ప్రచారాలను విడిగా చేసుకోవాలి. ప్రభుత్వ కార్యక్రమాలు ప్రభుత్వ కార్యక్రమాలుగానే నిర్వహించుకోవాలి. అలాంటి కార్యక్రమాలకు కొన్ని నియమ నిబంధనలు ఉంటాయి. ప్రోటోకాల్ ఉంటుంది. కానీ ఏపీలో అవేమీ లేవని.. ఇష్టారాజ్యంగా పాలన చేస్తున్నారన్న విమర్శలు విపక్షాలు ఎక్కువగా  చేస్తున్నాయి. 


వై ఏపీ నీడ్స్ జగన్ కార్యక్రమంలో వైసీపీ జెండాలు ఎగరేస్తున్న అధికారులు


ప్రస్తుతం వై ఏపీ నీడ్స్ జగన్  ( Why AP Needs Jagan ) పేరుతో ఓ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఇది పార్టీ కార్యక్రమం అనుకుంటారు ాకనీ.. ప్రభుత్వ కారక్రమం అని ప్రభుత్వమే ప్రకటించింది. వైసీపీ నేతలతో కలిసి అధికారులు పాల్గొంటున్నారు. ప్రభుత్వ కార్యాలయాల్లో వైసీపీ జెండాలు ప్రభుత్వ అధికారులు ఎగురవేస్తున్నారు. ఇవి మీడియాలో వైరల్ అవుతున్నాయి. పార్టీ కార్యక్రమాలను ఇలా అధికారులతో నిర్వహింప చేయడం ఏమిటన్న చర్చ విస్తృతంగా జరుగుతోంది. 


ఇది మొదటి సారి కాదు ! 


ఇప్పటికే గడప గడపకూ మన ప్రభుత్వం పేరుతో పెద్ద ఎత్తున ప్రజాధనం ఖర్చు పెట్టి అధికార యంత్రాంగాన్ని ఉపయోగించుకుని పార్టీ ప్రచారం చేసుకున్నారని టీడీపీ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు.  పాంప్లెట్లు, టోపీలు, సంచుల కోసం కనీసం వందల కోట్లు ఖర్చు పెట్టారని..  ఇదంతా ప్రజాధనమననంటున్నారు.  వైసీపీ సొంత ఖర్చు కాదు. కానీ ఈ  కార్యక్రమంలో పాల్గొన్నవారంతా వైసీపీ నేతలే. వాలంటీర్లు, గృహసారధులు. ప్రతిపక్ష పార్టీలకు చెందిన ఎమ్మెల్యేలు ఉన్న చోట ఇంచార్జులు నిర్వహించారు. అందుకే ప్రభుత్వ ఖజానాను పూర్తి స్థాయిలో వైసీపీ పార్టీని నడిపేందుకు ఖర్చు పెట్టేస్తున్నారని  టీడీపీ నేతలు ఇలాంటి కార్యక్రమాల వల్లే ఆరోపిస్తున్నారు.   పార్టీ ప్రచారాలను ప్రభుత్వం ఖాతాలో వేసేందుకు విచ్చలవిడిగా కార్యక్రమాలు నిర్వహిస్తూ... ప్రజాధనంతో పాటు అధికారుల్ని వాడేస్తూ  అధికారాన్ని దుర్వినియోగం చేస్తున్నారని అంటున్నారు. 
  
బటన్ నొక్కే బహిరంగసభలపైనా విమర్శలు 


సీఎం  జగన్ ప్రభుత్వ పథకాలకు  బటన్ నొక్కేందుకు వివిధ జిల్లాల్లో ప్రభుత్వం తరపున సభలు నిర్వహిస్తున్నారు. అయితే అవి పేరుకే ప్రభుత్వ సభలు. పూర్తిగా రాజకీయ కోణంలోనే జరుగుతూంటాయి. సీఎం జగన్ కూడా రాజకీయ ప్రసంగాలే చేస్తూంటారు.  వేదికలను కూడా పూర్తిగా వైసీపీ ప్రచారసభ లుగా అలంకరిస్తారు. ఇలాంటి అంశాల ద్వారా ప్రజాధనాన్ని వైసీపీ కోసం వాడుకుంటున్నారన్న విమర్శలువస్తున్నాయి. 


ఇటీవల ఐ ప్యాక్ కోసం ఓ అధికారిని యమించుకోవడానికి మార్కెటింగ్ శాఖ నోటిఫికేషన్ ఇచ్చింది. ఎలక్షనీరింగ్ ను అర్హతగా నిర్ణయించారు. అంటే ఎన్నికల్లో ఉపయోగించుకోవడానికి ప్రజాధనంతో ఇలా నియమించుకుంటున్నారని టీడీపీ నేతలు ారోపిస్తున్నారు.  పార్టీ, ప్రభుత్వం ఒకటేనని సజ్జల ఎందుకు అంటున్నా సులువుగా అర్థం చేసుకోవచ్చని..  ప్రజాధనాన్ని పార్టీ కోసం ఖర్చు పెట్టుకునేందుకే ఇలా చెప్పుకుంటున్నారని టీడీపీ నేతలంటున్నారు.