Prakesh Raj On Chandrayan-3: భారత్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన చంద్రయాన్-3 పై సినీ నటుడు ప్రకాష్ రాజ్ ఇస్రో వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. ఈ సందర్భంగా సోషల్ మీడియా వేదికగా ఎక్స్( ఒకప్పుడు ట్విట్టర్) వేదికగా చంద్రయాన్ 3 విక్రమ్ ల్యాండర్ నుండి పంపిన మొట్టమొదటి ఫోటో అని రాసి ఒకతను టీ వడపోస్తున్న ఫోటోను ట్వీట్ చేశాడు. దీంతో నెటిజన్లు తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు.


అధికార బిజెపి పార్టీపై ఎప్పటికప్పుడు విమర్శలు చేయడంలో ముందుండే ప్రకాష్ రాజ్ ఈసారి మాత్రం సోషల్ మీడియాలో తాను చేసిన ట్వీట్ కు తానే విమర్శల పాలయ్యాడు. జూలై 14 వ తేదీన ఇస్రో అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రయోగించిన చంద్రయాన్ -3 ఆగస్టు 23వ తేదీన చంద్రుడుపై అడుగుపెట్టనున్న నేపథ్యంలో యావత్ భారతదేశం ఆ అద్భుత క్షణం కోసం ఎదురు చూస్తుంటే ప్రకాష్ రాజ్ మాత్రం ఈ విజయవంతమైన ప్రయోగాన్ని అభినందించకపోగా సోషల్ మీడియా వేదికగా విమర్శలు చేశాడు.


ఒక వ్యక్తి టీ వడబోస్తున్న ఫోటో పోస్ట్ చేసి చంద్రుడి నుంచి విక్రమ్ ల్యాండర్ పంపించిన ఫోటో... వావ్ అంటూ పోస్ట్ చేశాడు. ఇంకేముంది ఈ పోస్ట్ చూసిన నెటిజన్లు అదే స్థాయిలో ప్రకాష్ రాజ్ పై విమర్శలు గుప్పిస్తున్నారు. తప్పు చేస్తే తప్పని చెప్పడంలో తప్పులేదు కానీ ఏది పడితే దాన్ని విమర్శించే ప్రయత్నం చేయకూడదని నెటిజన్లు హితవు పలుకుతున్నారు. 
చంద్రయాన్-3ని జూలై 14న శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి ఎల్‌వీఎం3 రాకెట్ ద్వారా అంతరిక్షంలోకి పంపారు. ఆగస్టు 5న చంద్రుడు కక్ష్యలోకి ప్రవేశించిన చంద్రయాన్ -3 ఆగస్టు 23న చంద్రునిపై సాఫ్ట్ ల్యాండింగ్ అవుతుందని శాస్త్రవేత్తలు భావిస్తున్న తరుణంలో ఈ ట్వీట్ ప్రస్తుతం దుమారం లేపింది.


ఇందులో భాగంగానే ఒక వ్యక్తి టీ పోస్తున్నట్లు చిత్రీకరించిన కార్టూన్‌ను కలిగి ఉన్న పోస్ట్‌ను నటుడు ప్రకాష్ రాజ్ సోషల్ మీడియాలో పంచుకున్నారు. భారత చారిత్రాత్మక మూన్ మిషన్‌కు బాధ్యత వహించే శాస్త్రవేత్తలకు గౌరవం ఇవ్వాలని కొందరు నెటిజన్లు కోరుతున్నారు. మరి కొంతమంది నెటిజన్లు ఇది అవమానకరంగా భావిస్తున్నారు.
"ఇస్రో చేపట్టిన చంద్రయాన్-3 మిషన్ పై రాజకీయాలకు సంబంధం లేకుండా మొత్తం భారతదేశం గర్వించదగ్గ విషయం. దీనిని రాజకీయం చేయడం సరికాదని రాజకీయాలు, ట్రోలింగ్ కు మధ్య ఉన్న తేడాను తెలుసుకోండి" అని ఒక నెటిజన్ ట్వీట్ చేశాడు. 


"ఒకరిని ద్వేషించడానికి, దేశాన్ని ద్వేషించడానికి మధ్య చాలా తేడా ఉంది. ఇది కూడా తెలుసుకోలేని మీ పరిస్థితి చూస్తే చాలా బాధగా ఉంది" మరొకరు ట్వీట్ లో రాసారు. "ఇది చాలా బాధాకరం. చంద్రయాన్-3,  ఇస్రో శాస్త్రవేత్తలు చేసిన ఈ మిషన్ కొన్నివేల బిలియన్ హృదయాలల్లో ఐక్యత, అభిరుచి, వెలుగులు నింపే అరుదైన విషయాలలో ఒకటి. మీరు దీనిని గ్రహించలేకపోతే, దేశం పట్ల మీకున్న ప్రేమ కంటే ఒక వ్యక్తి మీద మీకున్న ద్వేషం చాలా తీవ్రంగా కన్పిస్తుంది" అని మరో నెటిజన్ మండిపడ్డాడు.


"మీ దేశం, మీ స్వంత ప్రజల పురోగతి, విజయాలు, ప్రయత్నాలను మీరు ద్వేషించడం ప్రారంభిస్తే... ద్వేషం మిమ్మల్ని కూడా ద్వేషిస్తుంది" అని మరొకరు విరుచుకుపడ్డారు. ప్రకాష్ రాజ్ అధికార పార్టీపైనా, ప్రధాని నరేంద్ర మోదీపైనా తీవ్ర విమర్శలు చేస్తున్నారు. ప్రకాష్ రాజ్ 2019 భారత సార్వత్రిక ఎన్నికలలో బెంగళూరు సెంట్రల్ లోక్‌సభ నియోజకవర్గంలో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయాడు. దీంతో అప్పటినుంచి బిజెపి ప్రభుత్వం, నరేంద్ర మోడీపై ఏదో రకంగా విమర్శలు చేస్తూ వస్తున్నారు.