Weekly Top Headlines: ఏప్రిల్ 23 నుంచి 29 వ తేదీ వరకు ఉన్న వీక్లీ టాప్ హెడ్లైన్స్
జగనన్న వసతి దీవెన నిధులను ఏప్రిల్ 26న అనంతపురం జిల్లా నార్పలలో సీఎం విడుదల చేశారు. దాదాపు 8 లక్షల మంది తల్లుల ఖాతాల్లోకి రూ.912 కోట్ల రూపాయలను జమ చేశారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఇంటర్ తర్వాత చదువు మానేసే వారి సంఖ్య బాగా తగ్గిందని సీఎం జగన్ చెప్పారు. అంతకుముందు ప్రభుత్వ విద్యా సంస్థల్లో చదువుకునే వారి సంఖ్య గతంలో 37 లక్షలుగా ఉంటే, తాము అధికారంలోకి వచ్చాక మార్పు చేసిన విధానాల వల్ల, ప్రభుత్వ కాలేజీలు, స్కూళ్లలో చదివేవారి సంఖ్య 40 లక్షలకు పైగా విద్యార్థులు చేరారని అన్నారు.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appవిద్యార్థులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసిన ఏపీ ఇంటర్మీడియట్ ఫలితాలు విడుదలయ్యాయి. విజయవాడలో రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ బుధవారం సాయంత్రం 6.30 గంటలకు ఏపీ ఇంటర్ ఫస్టియర్, సెకండియర్ ఫలితాలతో పాటు ఒకేషనల్ విద్యార్థుల ఫలితాలను సైతం విద్యాశాఖ మంత్రి బొత్స ఒకేసారి విడుదల చేశారు. ఇంటర్ ఫస్టియర్ లో 61 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించగా, సెకండియర్ లో 72 శాతం విద్యార్థులు పాస్ అయినట్లు మంత్రి బొత్స తెలిపారు. . ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు మే 24 నుంచి జూన్ 1 వరకు జరగనున్నాయి.
విజయవాడలోని తాడిగడపలో ఎన్టీఆర్ శతజయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో సూపర్ స్టార్ రజినీకాంత్ పాల్గొన్నారు. ఎన్టీఆర్తో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. తాను దానవీర శూర కర్ణ సినిమా చేద్దామని అనుకున్నట్టు చెప్పారు. కానీ గెటప్ బాగాలేదంటే విరమించుకున్నట్టు తెలిపారు. చంద్రబాబు విజన్ ఏంటో ప్రపంచం మొత్తానికి తెలుసని సూపర్ స్టార్ రజనీకాంత్ అన్నారు. 2024 ఎన్నికల్లో చంద్రబాబు గెలిస్తే ఆంధ్రప్రదేశ్ దేశంలోనే నెంబర్ వన్ అవుతుందన్నారు.
తెలంగాణ భవన్లో జరిగిన భారత రాష్ట్ర సమితి ప్లీనరీ సమావేశంలో కేసీఆర్ చాలా మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలను గట్టిగానే హెచ్చరించారు. దళిత బంధు పథకంలో కమిషన్లు తీసుకుంటున్న వారి లిస్ట్ తన దగ్గర ఉందని తోకలు కత్తిరించేస్తానని హెచ్చరించారు. ఆ ఒక్కటే కాదు.. అనేక అంశాల్లో కేసీఆర్ ఎమ్మెల్యేలపై అసంతృప్తి వ్యక్తం చేశారు. నియోజకవర్గాల్లో అంతర్గత విబేధాలు, క్యాడర్ కు అందుబాటులో ఉండకపోవడం సహా.. పలు అంశాలపై మండిపడ్డారు. దీంతో ఎమ్మెల్యేల విషయంలో కేసీఆర్ కఠినంగా ఉన్నారని అందరికీ టిక్కెట్లు ఉండకపోవచ్చన్న ప్రచారం ఊపందుకుంది. పార్టీ ఫండ్ నేటికి రూ. 1250 కోట్లకు చేరిందని తెలిపారు. ఇందులో 767 కోట్ల రూపాయలను డిపాజిట్ చేశామన్నారు. తద్వారా నెలకు 7 కోట్ల రూపాయల వడ్డీ వస్తున్నదని పేర్కొన్నారు. ఆ డబ్బుతో పార్టీని నడపడం, జిల్లాల్లో పార్టీ కార్యాలయాల నిర్మాణాలు చేయడం, ప్రచారం, మౌలిక వసతులకు ఖర్చుపెడుతున్నామన్నారు. పార్టీని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకుపోవడానికి TV యాడ్స్, ఫిల్మ్ ప్రొడక్షన్ కూడా చేపడతామన్నారు. అవసరమైతే పార్టీ ఆధ్వర్యంలో టీవీ ఛానల్ కూడా నడుపుతామన్నారు కేసీఆర్.
సిట్ కార్యాలయానికి వెళ్తున్న వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు షర్మిలను పోలీసులు అడ్డుకోవడం దుమారం రేపింది. ఖాకీలు దురుసుగా ప్రవర్తించారని వారిపై షర్మిల చేయి చేసుకోవడంతో ఆమెను అరెస్టు చేశారు. ఒకరోజు జైల్లో గడిపిన ఆమెకు నాంపల్లి కోర్టు బెయిల్ మంజూరు చేసింది. షర్మిలను పరామర్శించేందుకు వెళ్లిన ఆమె తల్లి విజయలక్ష్మి కూడా పోలీసులపై దురుసుగా ప్రవర్తించి విమర్శల పాలయ్యారు.
ఛత్తీస్గఢ్లోని దంతెవాడలో మావోయిస్టులు పోలీసులపై దాడి చేశారు. మందుపాతర దాడిలో డ్రైవర్ సహా 10 మంది పోలీసులు మృతి చెందారు. డిస్ట్రిక్ట్ రిజర్వ్ గార్డ్ (DRG) సిబ్బంది వాహనాన్ని టార్గెట్ చేసుకుని మందుపాతర పేల్చారు. అర్ణపూర్లో ఈ ఘటన జరిగినట్టు అధికారులు వెల్లడించారు.
ఐసీసీ ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్కు (WTC Final 2023) టీమ్ఇండియాను ప్రకటించారు. పదిహేను మందితో కూడిన జట్టును సెలక్షన్ కమిటీ ఎంపిక చేసింది. చాలా రోజుల తర్వాత 'మిస్టర్ డిపెండబుల్' అజింక్య రహానెకు చోటు దక్కింది. జూన్ 7 నుంచి 11 వరకు మ్యాచ్ జరుగుతుంది. జూన్ 12ను రిజర్వు డేగా ప్రకటించారు. లండన్లోని ఓవల్ మైదానం ఇందుకు వేదిక. డబ్ల్యూటీసీ పట్టికలో అగ్రస్థానంలో నిలిచిన ఆస్ట్రేలియాలతో హిట్మ్యాన్ సేన తలపడుతుంది.
సొంత ఉద్యోగుల పట్ల ఔదార్యం చూపించే పారిశ్రామికవేత్తలు లేదా కుబేరులు అతి కొద్దిమంది మాత్రమే ఈ భూమ్మీద కనిపిస్తారు. వారిలో ముకేష్ అంబానీ (Mukesh Ambani) ఒకరు. తనకు భారీ బ్యాంక్ బ్యాలెన్స్ మాత్రమే కాదు, అదే స్థాయిలో మంచి మనస్సు కూడా ఉందని కూడా చాటారు. అంబానీకి కుడి చేయిగా అందరూ పిలిచే దీర్ఘకాల ఉద్యోగికి మనోజ్ మోదీకి అతి పెద్ద బహుమతిని ఇవ్వడమే దీనికి నిదర్శనం. రిలయన్స్ జియో & రిలయన్స్ రిటైల్లో డైరెక్టర్గా పని చేస్తున్న మనోజ్ మోదీ, రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్లో (RIL) దీర్ఘకాల ఉద్యోగి. దేశంలోని అత్యంత విలువైన రిలయన్స్ కంపెనీలో మల్టీ-బిలియన్ డాలర్ల ఒప్పందాలు విజయవంతం కావడం వెనుక ఉన్న వ్యక్తిగా మోదీకి పేరుంది. ఆయన చేసిన సుదీర్ఘ, విజయవంతమైన సేవలకు గుర్తుగా బహుమతిగా 22 అంతస్తుల భవనాన్ని రిలయన్స్ ఇండస్ట్రీస్ ఛైర్మన్ & మేనేజింగ్ డైరెక్టర్ అంబానీ బహూకరించారు.
పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి ప్రకాష్ సింగ్ బాదల్ కన్నుమూశారు. శిరోమణి అకాలీదళ్ అధినేత ప్రకాష్ సింగ్ బాదల్ మంగళవారం రాత్రి 8.30 గంటలకు తుదిశ్వాస విడిచారు. ప్రస్తుతం ఆయన వయసు 95. వయసురీత్యా అనారోగ్య సమస్యలతో సతమతమవుతున్న ప్రకాష్ సింగ్ బాదల్.. ఆదివారం మొహాలీలోని ఫోర్టిస్ ఆస్పత్రిలో చేరారు. వైద్యులు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. ఐసీయూలోనే చికిత్స పొందుతూ మంగళవారం రాత్రి పంజాబ్ మాజీ సీఎం బాదల్ తుదిశ్వాస విడిచారని ఆయన కుమారుడు, ఎస్ఏడీ అధ్యక్షుడు సుఖ్బీర్ సింగ్ బాదల్ వెల్లడించారు.