Buying Gold: బంగారు నగలు కొంటున్నారా? జూన్ 1 నుంచి కీలక మార్పు చేస్తున్న కేంద్రం!
బంగారు నగలు కొనుగోలు చేయాలని ప్లాన్ చేసుకుంటున్నారా? అయితే మీరీ విషయం కచ్చితంగా తెలుసుకోవాల్సిందే. 2022, జూన్ 1 నుంచి ఓ కీలక మార్పు చోటు చేసుకుంటోంది.
పుత్తడి నగలు, వస్తువులపై కచ్చితంగా ముద్రించాల్సిన హాల్ మార్కింగ్ రెండో దశ ఆరంభం అవుతోంది. బంగారంలోని స్వచ్ఛత ధ్రువీకరిస్తూ హాల్ మార్కింగ్ ఇస్తారన్న సంగతి తెలిసిందే.
2021, జూన్ 16 వరకు బంగారు నగలపై హాల్ మార్క్ వేయడం స్వచ్ఛందంగా ఉండేది. కంపెనీలు తమ ఇష్టాన్ని బట్టి వేసేవి. ఆ తర్వాత కచ్చితంగా హాల్ మార్క్ వేయాలని కేంద్రం ఆదేశించింది.
తొలి దశలో దేశంలోని 256 జిల్లాల్లో హాల్ మార్కింగ్ మొదలైంది. రెండో దశలో 32 జిల్లాల్లో మొదలవుతోంది. ఈ మేరకు హాల్ మార్కింగ్ కేంద్రాన్నీ ఏర్పాటు చేసింది. జూన్ 1 నుంచి రెండో దశ అమల్లోకి వస్తుందని కేంద్రం నోటిఫికేషన్ జారీ చేసింది.
ప్రతి రోజూ 3 లక్షల బంగారు నగలు లేదా వస్తువులపై హాల్ మార్క్ వేస్తున్నారు. ఇప్పటి వరకు హాల్మార్క్ వేయని నగల స్వచ్ఛతను పరీక్షించేందుకు బీఐసీ ధ్రువీకరించిన ఏహెచ్సీ కేంద్రాలను ఏర్పాటు చేశారు. 4 నగల వరకు రూ.200 ఐదు లేదా అంతకన్నా ఎక్కువుంటే ఒక్కో నగకు రూ.45 ఫీజు తీసుకొని స్వచ్ఛత సర్టిఫికెట్ ఇస్తారు.