Ashok Gajapati Raju: సింహాద్రి అప్పన్నను తొలి దర్శనం చేసుకొని పట్టువస్త్రాలు సమర్పించిన అనువంశిక ధర్మకర్త అశోక్ గజపతి రాజు
విశాఖపట్నం జిల్లాలోని సింహాచలం అప్పన్న స్వామి నిజరూప దర్శనం చేసుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో మంగళవారం రాత్రి నుంచే ఆలయానికి చేరుకుంటున్నారు.
వేకువజామున ఒంటిగంటకు సింహాద్రి అప్పన్నను సుప్రభాత సేవతో అర్చకులు మేల్కొలిపారు. అనంతరం స్వామివారి చందనాన్ని అత్యంత సున్నితంగా వేరు చేశారు అర్చకులు. నిజరూప దర్శనంలోకి వచ్చిన స్వామివారికి అర్చకులు వైదిక కార్యక్రమాలు, పూజలు నిర్వహించారు.
అనంతరం ఆలయ అనువంశిక ధర్మకర్త పూసపాటి అశోక్ గజపతి రాజు, ఆయన కుటుంబసభ్యులు సింహాద్రి అప్పన్న (శ్రీ లక్ష్మీనరసింహ స్వామివారి) నిజరూప దర్శనం చేసుకున్నారు.
తొలి దర్శనం చేసుకొని పట్టువస్త్రాలను సమర్పించారు అశోక్ గజపతిరాజు. అప్పన్న చందనోత్సవం సందర్భంగా ఏపీ ప్రభుత్వం తరఫున రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్ స్వామి వారికి పట్టువస్త్రాలు సమర్పించారు.
బుధవారం ఉదయం 3 గంటల నుంచి ఆరు గంటల వరకు సింహాద్రి అప్పన్న ఆలయంలో ప్రొటోకాల్, గర్భగుడి దర్శనాలకు అనుమతించారు. భక్తులు పెద్ద ఎత్తున సింహాచలం ఆలయానికి తరలి వస్తున్నారు.
కాగా, సింహాద్రి అప్పన్న స్వామి చందనోత్సవంలో విషాదం చోటుచేసుకుంది. సింహగిరి బస్టాండ్ నుంచి పైకి వెళ్లే మార్గంలో రూ.300 టికెట్ క్యూలైన్పై సిమెంట్ గోడ కూలడంతో ఏడుగురు భక్తులు మృతి చెందారు.
వెంటనే రంగంలోకి దిగిన ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది, అధికారులు సహాయక చర్యలు చేపట్టి పూర్తిచేశారు. ఏపీ హోంమంత్రి వంగలపూడి అనిత, విశాఖపట్నం జిల్లా కలెక్టర్ హరేంధిర ప్రసాద్, ఘటనాస్థలికి చేరుకొని సహాయక చర్యలు పర్యవేక్షించారు.