Kadam Project Water: నిర్మల్ రైతులకు గుడ్న్యూస్- కడెం ప్రాజెక్టు ఎడమ కాలువ నీటి విడుదల
రైతుల సంక్షేమమే ధ్యేయంగా తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తోందని ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ పేర్కొన్నారు. నిర్మల్ జిల్లా కడెం మండల కేంద్రంలోని కడెం నారాయణరెడ్డి ప్రాజెక్టు ఎడమ కాలువ నీటిని మంగళవారం విడుదల చేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ మాట్లాడుతూ.. రైతులు ఖరీఫ్ సీజన్ లో సకాలంలో పంటలు వేసుకుని, నీటిని సద్వినియోగం చేసుకుని పంటలను పండించాలన్నారు. కడెం ప్రాజెక్టు మరమ్మతులకు తెలంగాణ ప్రభుత్వం 9 కోట్ల 46 లక్షలు ఖర్చు చేసిందన్నారు.
త్వరలో పూడికను తొలిగిస్తామని ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ తెలిపారు. రోడ్డుకు మరమత్తులు చేయడంతో పాటు అన్నదాతలకు విద్యుత్ సమస్యలు తలెత్తకుండా చర్యలు తీసుకుంటామని తెలిపారు.
కడెం మండల కేంద్రంలో తెలంగాణ ప్రభుత్వం పేదలకు అందించిన డబుల్ బెడ్ రూం ఇండ్ల వద్ద సెప్టిక్ ట్యాంక్ పనులకు ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ భూమి పూజ చేశారు. తరువాత నచ్చన్ ఎల్లాపూర్ గ్రామంలోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో సోలార్ పెన్షిగ్ పనులకు సైతం ఆయన భూమి పూజ చేశారు.
రాష్ట్ర ప్రభుత్వం విద్యా రంగాన్ని మెరుగుపరచడానికి పాఠశాల, కళాశాలలో అన్ని రకాల వసతులు కల్పిస్తుందని ఖానాపూర్ ఎమ్మెల్యే అన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ వెంట పలువురు కాంగ్రెస్ పార్టీ నాయకులు, అధికారులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.