Twitter Claims 'Zero-Tolerance Approach: ట్విట్టర్‌పై రాహుల్ గాంధీ ఫిర్యాదు.. అలాంటిదేం లేదని సంస్థ జవాబు

ABP Desam   |  Murali Krishna   |  27 Jan 2022 02:19 PM (IST)

ట్విట్టర్‌లో తనను ఫాలో అయ్యేవారి సంఖ్య గణనీయంగా తగ్గిందని రాహుల్ గాంధీ చేసిన ఆరోపణలను సంస్థ ఖండించింది. అలాంటిదేం లేదని వివరణ ఇచ్చింది.

రాహుల్ గాంధీ

ట్విట్టర్‌ సీఈఓ పరాగ్ అగర్వాల్‌కు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ రాసిన లేఖపై సంస్థ స్పందించింది. కావాలనే ట్విట్టర్‌లో తన ఫాలోవర్లను తగ్గిస్తున్నారని రాహుల్ చేసిన ఆరోపణలను సంస్థ ఖండించింది.

యూజర్లను తప్పుదోవ పట్టించడం, తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేయడం వంటి వాటిని ట్విట్టర్‌ సహించదు. అలాంటి వాటి పట్ల మెషిన్ లెర్నింగ్ టెక్నాలజీ సాయంతో చర్యలు తీసుకుంటున్నాం. ఇందులో భాగంగానే కొందరి ఫాలోవర్ల సంఖ్యలో మార్పులు జరగొచ్చు.  కానీ ట్విట్టర్‌లో ఫాలోవర్ల సంఖ్య అందరికీ కనిపించేదే. ఇది కచ్చితమైన సంఖ్య అని ప్రతి ఒక్కరికీ విశ్వాసం కలిగించడమే మా ఉద్దేశం. మా విధానాలను ఉల్లఘించినందుకు గాను ప్రతి వారం లక్షలాది మంది ఖాతాలను తొలగిస్తుంటాం.                             -  ట్విట్టర్ వివరణ

రాహుల్ లేఖ..

ట్విట్టర్‌లో తనను ఫాలో అయ్యేవారి సంఖ్య ఈ మధ్య బాగా తగ్గిందని, తాను చేసే ట్వీట్లు కూడా ఎక్కువ మందికి రీచ్ అవడం లేదని రాహుల్ గాంధీ లేఖలో పేర్కొన్నారు. 2021 ఆగస్టులో ఒక్కసారిగా తనను ఫాలో అయ్యేవారి సంఖ్య గణనీయంగా తగ్గిందని రాహుల్ ఆరోపించారు.

2021 ఆగస్టులో దిల్లీలో హత్యాచారానికి గురైన బాలిక తల్లిదండ్రులను రాహుల్ గాంధీ పరామర్శించారు. ఆ సమయంలో వారితో దిగిన ఫొటోలను ఆయన ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. ఇది నిబంధనలకు వ్యతిరేకమని ఆయన ఖాతాను వారం పాటు ట్విట్టర్ నిషేధించింది.

అయితే దీనిపై కూడా రాహుల్ గాంధీ లేఖలో పేర్కొన్నారు. తాను ట్వీట్ చేసిన ఫొటోలను ప్రభుత్వానికి చెందిన కొన్ని ఖాతాలతో పాటు మరికొందరు కూడా ట్వీట్ చేశారని రాహుల్ అన్నారు. అయినా వాటిని మాత్రం బ్లాక్ చేయకుండా నన్నే టార్గెట్ చేశారని ఆరోపించారు.

Also Read: Corona Vaccine: పిల్లల కోసం ఐవీఎఫ్ చికిత్స తీసుకునేవాళ్లు కూడా వ్యాక్సిన్ వేయించుకోవచ్చు... కొత్త అధ్యయన ఫలితం

Also Read: Covid-19 Update: దేశంలో కొత్తగా 2,86,384 కరోనా కేసులు నమోదు.. 573 మంది మృతి

 

Published at: 27 Jan 2022 02:19 PM (IST)
© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.