ఆంధ్రప్రదేశ్‌లో పే రివిజన్‌ కమిషన్‌ (పీఆర్సీ)పై ప్రభుత్వంతో ఉద్యోగుల రగడ కొనసాగుతోంది. తాజాగా మరోసారి చర్చించేందుకు రావాలని ప్రభుత్వం ఉద్యోగ సంఘాలను మళ్లీ కబురు పంపింది. గురువారం మధ్యాహ్నం 12 గంటలకు సచివాలయానికి రావాలని మంత్రుల కమిటీ... పీఆర్సీ సాధన సమితి నాయకులకు ఆహ్వానం పంపింది. అంతేకాకుండా ప్రభుత్వం నియమించిన స్టీరింగ్‌ కమిటీలోని 20 మంది సభ్యులు కూడా చర్చలకు హాజరు రావాలని సాధారణ పరిపాలనాశాఖ ముఖ్యకార్యదర్శి శశిభూషణ్‌ ఆహ్వానాన్ని పంపారు. అయితే, మంత్రుల కమిటీ ఇప్పటికే నిర్దేశించిన మూడు డిమాండ్లపై ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటేనే చర్చలకు వెళ్తామని పీఆర్సీ సాధన సమితి నాయకులు తేల్చి చెప్పారు. అసంబద్ద 11వ పీఆర్సీ జీవోలను ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలని, అశుతోష్‌ మిశ్రా నివేదికను వెంటనే బహిర్గతం చేయాలని కోరారు. మరోవైపు, జనవరి నెలకు పాత వేతనాన్ని ఇవ్వాలని యూనియన్‌ నేతలు డిమాండ్‌ చేస్తున్న సంగతి తెలిసిందే.


పీఆర్సీ సాధన కోసం చేస్తున్న ఉద్యమ కార్యాచరణలో భాగంగా గురువారం నుంచి నాలుగు రోజుల పాటు జిల్లా కేంద్రాల్లో రిలే నిరాహార దీక్ష చేపట్టనున్నట్టు ఉద్యోగ సంఘ నాయకులు తెలిపారు. ఈ మేరకు బుధవారం స్థానిక రెవెన్యూ గెస్ట్‌ హౌస్‌లో రిలే నిరాహార దీక్షల సన్నాహక సమావేశాన్ని పీఆర్సీ సాధన సమితి ఆధ్యర్యంలో నిర్వహించారు. విజయవాడ ధర్నా చౌక్ లో రిలే దీక్షలో రాష్ట్ర నేతలు పాల్గొననున్నారు. రిలే నిరాహార దీక్షల్లో ఉద్యోగులు పాల్గొనేలా చర్యలు తీసుకుంటున్నామని జేఏసీ నేతలు చెప్పారు. ప్రతి రోజూ ఉదయం 9 నుంచి సాయంత్రం 5 గంటల వరకు దీక్ష కొనసాగుతుందని అన్నారు. మద్దతుగా జిల్లా నలుమూలల నుంచి ఉద్యోగులు తరలిరానున్నట్టు స్పష్టం చేశారు.


ఉద్యోగుల పోరాటం ఓ వైపు కొనసాగుతుంటే.. ఈ నెల జీతంపై సందిగ్ధత నెలకొంది. ఒకటో తేదీ సమీపిస్తున్నా కూడా ఇంకా ఏ నిర్ణయమూ తీసుకోకపోవడంతో ఈ నెల వేతనాలు వచ్చే పరిస్థితి కనిపించడం లేదు. కొత్త పీఆర్సీ అమలులో భాగంగా ఉద్యోగులు, ప్రభుత్వానికి మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్న నేపథ్యంలో జీతాల బిల్లులను ట్రెజరీ ఉద్యోగులు ఇంకా ప్రాసెస్ చేయలేదు. ప్రతి నెలా 25 వ తేదీకల్లా బిల్లులు ప్రాసెస్ పూర్తి చేసి ప్రభుత్వానికి పంపిస్తుంటారు. అయితే, ఉద్యోగులు పాత విధానంలో జీతాలు కావాలని కోరుతుండగా.. సర్కార్ మాత్రం కొత్త జీవోల ప్రకారం అని ఆదేశాలు జారీ చేసింది. ప్రభుత్వ ఆదేశాలు పట్టించుకోని ట్రెజరీ, పే అండ్ అకౌంట్స్ ఉద్యోగులు.. జీతాల బిల్లును ప్రాసెస్ చేయబోమని కొద్ది రోజుల క్రితమే తేల్చి చెప్పారు. దీంతో ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు వచ్చే పరిస్థితి కనిపించడంలేదు.