YSR Kadapa News: ఏపీ రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం జగన్ సొంత జిల్లాలోనే ఓ దళిత ప్రభుత్వ అధికారి హత్య జరగడం సంచలనం సృష్టిస్తోంది. పశుసంవర్ధక శాఖ ఉపసంచాలకుడు డాక్టర్ చిన్న అచ్చెన్న కనిపించడం లేదని ఆయన కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేశారు. అయినా పోలీసులు పట్టించుకోకపోవడంతో... అదృశ్యమైన 12 రోజుల తర్వాత అనుమానాస్పద స్థితిలో అచ్చెన్న మృతదేహం బయటపడింది. అయితే అచ్చన్న మృతదేహం లభ్యమైన తర్వాత కూడా కుటుంబ సభ్యులకు కనీస సమాచారం ఇవ్వకుండానే శవపరీక్ష నిర్వహించి హడావుడిగా వారికి మృతదేహాన్ని అప్పగించడం కూడా పలు అనుమానాలకు తావిస్తోంది.


అసలేం జరిగిందంటే..?


కడప బహులార్థ పశువైద్య శాలలో ఉపసంచాలకుడిగా విధులు నిర్వహిస్తున్న అచ్చెన్నకు అదే వైద్య శాలలో సహాయ సంచాలకులుగా పని చేసే సురేంద్రనాథ్ బెనర్జీ, శ్రీధర్ లింగారెడ్డి, సుభాష్ చంద్రబోస్ కు మధ్య గత ఆరు నెలలుగా గొడవ జరుగుతోంది. సురేంద్రనాథ్ బెనర్జీ, శ్రీధర్ లింగారెడ్డి, సుభాష్ చంద్రబోస్ విధులు నిర్వర్తించే విధానంలో ప్రభుత్వ ఉన్నతాధికారుల ఆదేశాలను, నిబంధనలను పాటించట్లేదని ప్రభుత్వానికి సరెండర్ చేశారు. అలాగే తనకు కూడా ఏమాత్రం సహకరించట్లేదని వివరించారు.


ఆ ముగ్గురూ.. అచ్చన్నే తమను ఇబ్బందులకు గురి చేస్తున్నారంటూ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. ఈ వ్యవహారంపై త్రిసభ్య కమిటీ విచారణ చేపట్టింది. సరెండర్ చేసిన ఆ ముగ్గురినీ విధుల్లో చేర్చుకోవాలని అచ్చెన్నను ఉన్నతాధికారులు ఆదేశించారు. అయితే ఇందుకు అచ్చెన్న నిరాకరించాడు. ఈ విషయం జరిగిన కొద్ది రోజులకే ఆయన అదృశ్యం అయ్యాడు. ఈ క్రమంలోనే కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. 


సుభాష్ చంద్రబోస్, శ్రీధర్ లింగారెడ్డి, సురేంద్రనాథ్ బెనర్జీలపై అనుమానం వ్యక్తం చేస్తూ... అచ్చెన్న కుమారుడు ఇచ్చిన ఫిర్యాదుతో ఈనెల 14వ తేదీన కేసు నమోదు అయింది. కానీ 24వ తేదీ వరకు దర్యాప్తులో పోలీసులు ఎలాంటి పురోగతి సాధించలేదు. అన్నమయ్య జిల్లా రామాపూరం మండలం గువ్వల చెరువు ఘాట్ లో రహదారి గోడ కింద ఓ మృతదేహం లభ్యం అయింది. స్థానికుల ద్వారా విషయం తెలుసుకున్న పోలీసులు మృతదేహం అచ్చెన్నదిగా గుర్తించారు. అలాగే అతను హత్యకు గురైనట్లు వెల్లడించారు. కడపలోని కోటిరెడ్డి సర్కిల్ దగ్గరలోని చర్చి వద్ద నుంచే నిందితులు అచ్చెన్నను కిడ్నాప్ చేసినట్లు సమాచారం. 


అచ్చెన్న అదృశ్యంపై ఫిర్యాదు వచ్చిన దగ్గర నుంచి పోలీసులు స్పందించి ఉంటే ఫలితం ఉండేది. ఆయనను ప్రాణాలతో కాపాడి ఉండేవాళ్లు. కనీసం సీసీటీవీ కెమెరాలను పరిశీలించినా నిందితులు ఎవరో గుర్తించేందుకు వీలుండేది. పోలీసులు ఈ అదృశ్యం ఘటనలో పూర్తిగా నిర్లక్ష్యంగా వ్యవహరించారంటూ ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అచ్చెన్న అదృశ్యంపై ప్రభుత్వ యంత్రాంగం కొంచెం కూడా స్పందించలేదు. ఆయనను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అయితే అచ్చెన్న హత్యపై హైకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ చేపట్టాలని ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ డిమాండ్ చేశారు. అచ్చెన్న హత్యపై సిట్టింగ్ జడ్జితో విచారణ చేపట్టాలని అఖిలపక్ష నాయకులు డిమాండ్ చేస్తున్నారు. కడపలోని వీపీసీ ఎదుట అఖిలపక్ష నేతలు ఆందోళనకు దిగారు. 


అచ్చెన్న మృతికి సంబంధించి పూర్తి స్థాయి విచారణ జరపాలంటూ పశుసంవర్థక శాఖ మంత్రి సీదిరి అప్పలరాజు.. జిల్లా కలెక్టర్, ఎస్పీలను ఆదేశించినట్లు తెలిపారు. పూర్తి స్థాయి విచారణకు ఓ కమిటీని ఏర్పాటు చేయనున్నట్లు వివరించారు. పశు సంవర్ధక శాఖలో పని చేసే వారు బాధ్యులైనట్లు తేలితే చర్యలకు వెనుకాడమని.. నివేదిక వచ్చాక బాధ్యులపై చర్యలు తీసుకుంటామని మంత్రి తెలిపారు. అచ్చెన్న కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని చెప్పారు.