YSR Asara Funds in Andhra Pradesh: ఏపీ ప్రభుత్వం వరుసగా నాలుగో ఏడాది “వైఎస్సార్ ఆసరా” నిధులను విడుదల చేసింది. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 7.98 లక్షల స్వయం సహాయక సంఘాల్లోని సుమారు 78.94 లక్షల మంది మహిళలకు ఈ పథకం ద్వారా లబ్ధి కలిగింది. ఇప్పటికే 3 విడతల్లో రూ.19,176 కోట్ల ఆర్థిక సాయాన్ని అందించిన జగన్ ప్రభుత్వం అందించింది. తాజాగా ఇప్పుడు నాలుగో విడతగా మరో రూ.6,394.83 కోట్ల ఆర్థిక సాయాన్ని జనవరి 23 నుండి రెండు వారాల పాటు 7,98,395 స్వయం సహాయక పొదుపు సంఘాల్లోని 78,94,169 మంది మహిళల ఖాతాల్లో జమ చేసే కార్యక్రమానికి అనంతపురం జిల్లా ఉరవకొండలో 23న జగన్ శ్రీకారం చుట్టనున్నారు.


ప్రభుత్వం అందిస్తున్న వైఎస్సార్ ఆసరా లబ్దితో ఈ 56 నెలల కాలంలో నేరుగా డీబీటీ (ప్రత్యక్ష నగదు బదిలీ) ద్వారా అందించిన లబ్ధి రూ.2.50 లక్షల కోట్లు దాటింది. తాజాగా అందిస్తున్న రూ.6,394.83 కోట్లతో కలిపి "వైఎస్సార్ ఆసరా" కింద జగన్ ప్రభుత్వం అందించిన మొత్తం సాయం రూ.25,571 కోట్లు. వివిధ పథకాల ద్వారా కేవలం మహిళలకు మాత్రమే గత 56 నెలల్లో ఏపీ ప్రభుత్వం అందించిన లబ్ది రూ.2,66,772.55 కోట్లు.


మహిళలు వారి కాళ్ళ మీద వారు నిలబడేటట్టుగా చేసి, వారి జీవనోపాధి మెరుగుపడేలా.. అమూల్, హిందూస్తాన్ లివర్, ఐ.టి.సి., పి&జి. అల్లానా, అజియో రిలయన్స్, గ్రామీణ వికాస కేంద్రం, టేనేజర్, కాల్ గుడి, జియాన్, నినె, ఇర్మా, అయేకార్ట్, మహేంద్ర అండ్ ఖేతి వంటి వ్యాపార దిగ్గజాలతో, బ్యాంకులతో ఒప్పందాలు చేసుకొని వారికి చక్కటి వ్యాపార మార్గాలు చూపించడంతో పాటు ఆసరా, చేయూత, సున్నా వడ్డీ వంటి పథకాలతో సుస్థిరమైన ఆర్థికాభివృద్ధికి తాము బాటలు వేస్తున్నామని ప్రభుత్వం ప్రకటన విడుదల చేసింది.


‘‘గత పాలకులు ఒక వైపు రుణాలు మాఫీ చేస్తామని మాట చెప్పి చేయకపోగా, అక్టోబర్ 2016 నుండి సున్నా వడ్డీ పథకాన్ని సైతం రద్దు చేయడంతో అప్పులు తడిసి మోపెడయ్యాయి. ఒకవైపు సుమారు రూ.3,036 కోట్ల వడ్డీని అక్క చెల్లెమ్మలే బ్యాంకులకు అపరాధ వడ్డీ రూపేణా చెల్లించాల్సిన దుస్థితి ఏర్పడింది. అంతేగాక "ఎ". "బి" గ్రేడ్ లో ఉన్న సంఘాలు కూడా "సీ", "డి" గ్రేడ్ లలోకి పడిపోయాయి. ఎన్‌పీఏలు, అవుట్ స్టాండింగ్‌లు 18.36 శాతానికి చేరాయి. జగనన్న ప్రభుత్వంలో "వైఎస్సార్ ఆసరా", "వైఎస్సార్ సున్నా వడ్డీ"ల ద్వారా లబ్ధి పొందిన అక్కచెల్లెమ్మల పొదుపు సంఘాలు తిరిగి క్రియాశీలకంగా మారడంతో నిరర్థక ఆస్తులు (NPA). అవుట్ స్టాండింగ్ లు కూడా అప్పట్లో ఉన్న 18.36 శాతం నుండి 0.17 శాతానికి తగ్గాయి.


కార్పొరేట్ సంస్థలు, బ్యాంకులతో అనుసంధానం చేసి జగనన్న ప్రభుత్వం అందించిన సహకారంతో ఇప్పటి వరకు 14,77,568 మంచి మహిళలు కిరాణా దుకాణాలు, ఆవులు, గెదెలు, మేకల పెంపకం, వస్త్ర వ్యాపారం తదితర వ్యాపారాలు చేపట్టి నెలకు రూ.7,000 నుండి రూ.10,000ల వరకు అదనపు ఆదాయం పొందుతున్నారు. అమూల్ తో ఒప్పందం కారణంగా మార్కెట్ లో పోటీ పెరిగి లీటర్ పాలపై రూ.10 నుండి రూ.22 వరకు అదనపు ఆదాయం, ఈ 56 నెలల్లోనే అందుతోంది. అధికారంలోకి వచ్చిన నాటి నుండి ఇప్పటి వరకు వివిధ పథకాల (DBT, Non DBT) ద్వారా కేవలం మహిళలకు మన జగన్ ప్రభుత్వం అందించిన లబ్ధి అక్షరాల రూ. 2,66,772.55 కోట్లు’’ అని ప్రకటన విడుదల చేశారు.


గత పాలకులు రుణాలు కట్టొద్దని చెప్పారని.. పొదుపు సంఘాల తరపున తామే చెల్లిస్తామని 2014లో మేనిఫెస్టోలో పెట్టి మరీ, హామీ ఇచ్చి అమలు చేయలేదని ప్రకటనలో పేర్కొన్నారు. అలా రాష్ట్రవ్యాప్తంగా చితికిపోయిన దాదాపు 7.98 లక్షల స్వయం సహాయక సంఘాల్లోని సుమారు 78.94 లక్షల మందికి తాము ఆ లోటును భర్తీ చేస్తున్నట్లు చెప్పారు. ఇలా 4 వాయిదాల్లో రూ.25,571 కోట్ల రుణాన్ని తాము చెల్లించినట్లుగా పేర్కొన్నారు.


వైఎస్సార్ ఆసరా మైలు రాళ్లు
మొదటి విడత, 11 సెప్టెంబర్ 2020
అందించిన లబ్ధి రూ.6,318.76 కోట్లు లబ్ధిదారుల సంఖ్య 77,87,295


రెండవ విడత, 07 అక్టోబర్ 2021
అందించిన లబ్ధి రూ.6,439.52 కోట్లు లబ్ధిదారుల సంఖ్య 78,75,539


మూడవ విడత, 25 మార్చి 2023
అందించిన లబ్ధి రూ.6,417.69 కోట్లు లబ్ధిదారుల సంఖ్య 78,94,169


నాల్గవ విడత, 23 జనవరి 2024
అందించిన లబ్ధి రూ.6,394.83 కోట్లు లబ్ధిదారుల సంఖ్య 78,94,169
వైఎస్సార్ ఆసరా ద్వారా 4 విడతల్లో అందించిన మొత్తం లబ్ధి రూ. 25,571 కోట్లు