Andhra News :   కోడి కత్తితో సీఎం జగన్ పై దాడి చేసిన కేసులో నిందితుడు అయిన జనపల్లి శ్రీనివాసరావు దాఖలు చేసుకున్న బెయిల్ పిటిషన్‌పై ఏపీ హైకోర్టులో మంగళవారం విచారణ జరగనుంది.  శ్రీనివాసరావు  బెయిల్ పిటిషన్‌ను అత్యవసరంగా విచారించాలని సమతా సైనిక దళ్ పిటిషన్  వేసింది. సీఎం జగన్ మోహన్ రెడ్డి కోర్టుకు వచ్చి సాక్ష్యం చెప్పాలని డిమాండ్ చేస్తోంది. ఈ మేరకు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. కోడి కత్తి శ్రీను పిటిషన్‌ను అత్యవసరంగా విచారించాలని సైనిక్ దళ్ రాష్ట్ర అధ్యక్షుడు, హైకోర్టు న్యాయవాది పాలేటి మహేశ్ సోమవారం ఉదయం హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. 


కోడి కత్తి దాడి కేసులో ఐదేళ్లుగా శ్రీనుకు బెయిల్ రావడంలేదని.. ఆయన జైల్లోనే మగ్గిపోతున్నారని పిటిషన్‌లో పేర్కొన్నారు. ఈ కేసులో సీఎం జగన్ కోర్టుకు వచ్చి చెప్పేలా ఆదేశాలివ్వాలని కోరారు. అంతేకాదు శ్రీను కుటుంబ సభ్యుల దీక్ష సందర్భంగా జరిగిన పరిణామాలను కోర్టుకు వివరించారు. అయితే ఈ పిటిషన్‌పై విచారణకు హైకోర్టు అనుమతించింది. పిటిషన్‌పై ధర్మాసనం మంగళవారం విచారించనుంది.   జస్టిస్ దుర్గాప్రసాద్ ధర్మాసనం ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టనుంది.


  2019 ఎన్నికలకు ముందు వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై విశాఖ ఎయిర్‌పోర్టులో కోడి కత్తితో శ్రీను దాడి చేశారు. ఈ దాడిలో జగన్ భుజంపై గాయమైంది. చికిత్స పొందడంతో ఆయనకు అయిన గాయం మానిపోయింది. అయితే ఈ కేసులో శ్రీనును పోలీసులు అరెస్ట్ చేశారు. అప్పటి నుంచి ఆయనకు బెయిల్ రావడంలేదు. ఇటీవల ఈ కేసులో సీఎం జగన్ సాక్ష్యం చెప్పాలని కోర్టు ఆదేశించింది. అయితే ఏదో ఒక కారణంతో సీఎం జగన్ కోర్టుకు వెళ్లడంలేదు. దీంతో శ్రీను కుటుంబసభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో వీరికి మద్దతు పెరుగుతోంది. శ్రీను తల్లి, సోదరుడిని కలిసిన సైనిక్ దళ్ అధ్యక్షుడు , ప్రముఖ న్యాయవాది పాలేటి మహేశ్ సంఘీభావం ప్రకటించారు.                                             


విశాఖ సెంట్రల్ జైలులో కోడికత్తి శ్రీను నిరాహార దీక్ష కొనసాగిస్తున్నారు. ఆయనతో   లీగల్ ఇంటర్వ్యూకు కోర్టు అనుమతి ఇచ్చింది. లీగల్ ఇంటర్వ్యూకి శీను చేతుల మీద మోసుకొచ్చారు. ఆయన నిరాహారదీక్ష కొనసాగిస్తున్నారు.  ఆరోగ్యం క్షీణించినా దీక్ష కొనసాగిస్తానని   శ్రీను లాయర్లకు చెప్పారు. ఐదేళ్లు దాటినా ఇంకా జైల్లో ఉండటం .. కింది కోర్టులో ట్రయల్ కూడా నిలిపివేయడంతో హత్యలు చేసిన వాళ్లు కూడా  బెయిల్ మీద ఉన్నారని కానీ చిన్న నేరానికి శీను జైల్లో మగ్గిపోతున్నారన్న అభిప్రాయం అంతటా వ్యక్తమవుతోంది.