Wrestlers Protest: 


నెల రోజులుగా ఆందోళనలు..


దాదాపు నెల రోజులుగా ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద రెజ్లర్ల ఆందోళన కొనసాగుతూనే ఉంది. రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (WFI) చీఫ్ బ్రిజ్ భూషణ్‌పై లైంగిక ఆరోపణలు చేసిన రెజ్లర్లు...ఆయనపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. కానీ...ఇప్పటి వరకూ కేంద్రం దీనిపై స్పందించలేదు. ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్నా...అధికారికంగా ఎలాంటి ప్రకటనా చేయలేదు. కేంద్రమంత్రి అనురాగ్ ఠాకూర్...కమిటీ ఏర్పాటు చేస్తామని చెప్పారే తప్ప భరోసా అయితే ఇవ్వలేదని అసహనం వ్యక్తం చేస్తున్నారు రెజ్లర్లు. మే 9 వ తేదీనే వీళ్లు కేంద్రానికి అల్టిమేటం జారీ చేశారు. తమ డిమాండ్‌లను నెరవేర్చకపోతే తాము మరింత అగ్రెసివ్‌గా పోరాటం చేయాల్సి వస్తుందని తేల్చి చెప్పారు. ఏప్రిల్ 23వ తేదీ నుంచి బజ్‌రంగ్ పునియా, సాక్షి మాలిక్‌తో పాటు గోల్డ్ మెడల్ సాధించిన వినేష్ ఫోగట్ కూడా నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే వీళ్లకి ప్రతిపక్షాలతో పాటు పలు రైతు సంఘాల మద్దతు కూడా లభించింది. ఇప్పుడు వాళ్ల ఆందోళనల్ని మరింత ఉద్దృతం చేసేందుకు రెడీ అవుతున్నారు. అంతర్జాతీయ స్థాయిలో తమ డిమాండ్‌లను వినిపిస్తామని స్పష్టం చేశారు. ఇతర దేశాల్లోనూ ఒలింపిక్ మెడల్స్ సాధించిన వారందరి సపోర్ట్ కూడగట్టుకుని పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరించారు. నిజానికి గత వారమే ఢిల్లీ పోలీసులు బ్రిజ్ భూషణ్‌పై రెండు కేసులు నమోదు చేశారు. అయితే...ఇప్పటి వరకూ కేసు ఇంకా కోర్టుల్లోనే నలుగుతోంది తప్ప తమకు న్యాయం జరగడం లేదని మండి పడుతున్నారు రెజ్లర్లు. 


ఈ ఏడాది జనవరిలోనూ నిరసనలు చేసిప్పటికీ...ఈ స్థాయిలో మద్దతు లభించలేదు. కానీ ఈ సారి మాత్రం రాజకీయ పార్టీల జోక్యంతో దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఈ వివాదంపై కేంద్రమంత్రి అనురాగ్ ఠాకూర్ స్పందించారు. ఎలాంటి పక్షపాతం లేకుండా విచారణ జరిపిస్తామని వెల్లడించారు. 


"కమిటీ వేయాలన్న డిమాండ్‌ని పరిగణనలోకి తీసుకున్నాం. ప్యానెల్‌ని కూడా నియమించాం. ఇప్పటికే బ్రిజ్ భూషణ్‌పై ఢిల్లీ పోలీసులు రెండు కేసులు నమోదు చేశారు. సుప్రీంకోర్టు కూడా తీర్పునిచ్చింది. ఢిల్లీ పోలీసులు పారదర్శకంగానే విచారణ జరుపుతున్నారు"


- అనురాగ్ ఠాకూర్, కేంద్రమంత్రి 


లైంగిక వేధింపుల ఆరోపణలపై బ్రిజ్ భూషణ్ మరోసారి స్పందించారు. తనపై వచ్చిన ఏ ఆరోపణ నిజమని తేలినా ఉరి వేసుకుని చచ్చిపోతానని వెల్లడించారు. అనవసరంగా ఆరోపణలు చేస్తున్నారంటూ ఓ వీడియో విడుదల చేశారు. ఇన్నేళ్లలో ఏ ఒక్క అమ్మాయిని కూడా తప్పుడు ఉద్దేశంతో చూడలేదని వెల్లడించారు. అయితే కేంద్ర క్రీడా శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ కూడా బ్రిజ్ భూషణ్‌కు మద్దతుగా నిలుస్తున్నారని వినేష్ ఫోగట్ మండి పడ్డారు. కమిటీ ఏర్పాటు పేరుతో కేసుని పక్కదోవ పట్టించేందుకు కుట్ర చేస్తున్నారని అసహనం వ్యక్తం చేశారు. రాజకీయంగా పవర్‌ఫుల్‌గా ఉన్న బ్రిజ్ భూషణ్‌ని ఎదుర్కోడం కష్టంగా ఉందని అన్నారు. ఎన్నో ఏళ్లుగా అధిరాకాన్ని దుర్వినియోగం చేస్తున్న అలాంటి వ్యక్తితో పోరాటం అంత సులభం కాదని తేల్చి చెప్పారు. అయినా న్యాయం జరిగే వరకూ పోరాడతామని వెల్లడించారు. 


Also Read: పెద్ద నోట్లు రద్దు చేస్తే బ్లాక్ మనీ తగ్గిందా? అసలు ఇందులో లాజిక్ ఏమైనా ఉందా - సచిన్ పైలట్