Worlds Hottest Day 2023: 2023 జులై 3వ తేదీ సోమవారం రోజు అత్యంత వేడి రోజుగా రికార్డు క్రియేట్ చేసింది. యూఎస్ నేషనల్ సెంటర్స్ ఫర్ ఎన్విరాన్‌ మెంటల్ ప్రిడిక్షన్ ఈ విషయాన్ని వెల్లడించింది. సగటు ప్రపంచ ఉష్షోగ్రత 17.01 డిగ్రీల సెల్సియస్ (62.62 ఫారెన్‌హీట్)కి చేరుకుంది. ప్రపంచవ్యాప్తంగా ఎండలు విజృంభించడంతో.. ఆగస్టు 2016 రికార్డును బ్రేక్ చేసింది. 2016 ఆగస్టు నెలలో 16.92C (62.46F)ను అధిగమించింది. దక్షిణ యూఎస్ ఇటీవల ఎండల్లో మగ్గిపోతోంది. ఎండల వేడిని తట్టుకోలేక ఇళ్ల నుంచి బయకు వచ్చేందుకు జనం జంకుతున్నారు. చైనాలో 35C (95F) కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలతో తీవ్రమైన ఎండలు కొనసాగాయి. ఉత్తర ఆఫ్రికాలో 50C (122F) సమీపంలో ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయి. అలాగే అంటార్కిటికాలో ప్రస్తుతం శీతాకాలం నడుస్తోంది. అయినప్పటికీ.. అసాధారణంగా అధిక ఉష్ణోగ్రతలను నమోదు చేసింది. శ్వేత ఖండంలోని అర్జెంటీనా దీవులలో ఉక్రెయిన్ వెర్నాడ్‌స్కీ రీసెర్చ్ బేస్ ఇటీవల 8.7C (47.6F)తో జూలై ఉష్ణోగ్రత రికార్డును బద్దలు కొట్టింది. 


ఇది మనం గొప్పగా చెప్పుకోవాల్సిన మైలు రాయి కాదని బ్రిటన్ ఇంపీరియల్ కాలేజ్ లండన్‌లోని గ్రాంథమ్ ఇన్‌ స్టిట్యూట్ ఫర్ క్లైమేట్ చేంజ్ అండ్ ఎన్విరాన్‌మెంట్‌కు చెందిన వాతావరణ శాస్త్రవేత్త ఫ్రెడెరిక్ ఒట్టో అన్నారు. అలాగే ఇది ప్రజలకు, పర్యావరణ వ్యవస్థలకు మరణ శిక్ష లాంటిదని కామెంట్ చేస్తున్నారు. వాతావరణ మార్పు, ఎల్‌నినో దీనికి కారణమని శాస్త్రవేత్తలు తెలిపారు. దురదృష్టవశాత్తుగా పెరుగుతున్న ఎల్ నినోతో పాటు పెరుగుతున్న (కార్బన్ డయాక్సైడ్), గ్రీన్‌హౌస్ వాయువుల ఉద్గారాలతో పెరిగిపోతున్న ఉష్ణోగ్రతల్లో ఇది మొదటి దశగా చెబుతున్నారు.  


మార్చి నెలలో దేశ వ్యాప్తంగా విపరీతమైన ఎండలు


దేశంలో వేసవి కాలం మొత్తం రోజురోజుకు ఉష్ణోగ్రతలు పెరిగాయి. అయితే ఈ ఏడాది మార్చిలో 122 ఏళ్ల తర్వాత అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయని భారత వాతావరణ శాఖ తెలిపింది. గత నెలలో దేశంలోని చాలా భాగంలో తీవ్ర వేడిగాలులు వీచాయని పేర్కొంది. 1901 తర్వాత భారత్‌లో ఇదే అత్యధిక ఉష్ణోగ్రత నమోదు చేసిన మార్చి నెల.



దేశంలో 33.10 డిగ్రీల సరాసరి గరిష్ట ఉష్ణోగ్రత మార్చి 2022లో నమోదైంది. గత 122 ఏళ్లలో ఇదే అత్యధికం. దేశంలో 2010 మార్చిలో 33.09 డిగ్రీల సెల్సియస్‌ గరిష్ట ఉష్ణోగ్రతగా నమోదైంది. - భారత వాతావరణ శాఖ (ఐఎండీ)


ఉష్టోగ్రతలు పెరిగితే


ప్రపంచ సగటు ఉష్ణోగ్రతలు 1 డిగ్రీ సెల్సియస్ పెరిగితే వ్యవసాయ ఉత్పాదకత, సముద్ర మట్టాలు పెరగడం, ఆరోగ్య సమస్యలు ఉత్పన్నమవుతాయి. వీటి వల్ల భారత్ తన జీడీపీలో దాదాపు 3 శాతం నష్టపోయే అవకాశం ఉంది.



వరి నష్టం - ఎండ వల్ల దేశంలో వరి ఉత్పాదన 10 నుంచి 30 శాతం తగ్గే అకాశం ఉంది. (ఉష్టోగ్రతలు 1- 4 డిగ్రీల వరకు పెరిగితే) 


మొక్క జొన్న నష్టం- ఎండ వల్ల దేశంలో మొక్క జొన్న ఉత్పాదన 25 నుంచి 70 శాతం తగ్గే అవకాశం ఉంది. (ఉష్టోగ్రతలు 1- 4 డిగ్రీల వరకు పెరిగితే)


ఇలా ఉష్ణోగ్రత  పెరగడం వల్ల ప్రతి విషయంలో ఎఫెక్ట్ పడుతుందని శాస్త్రవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా మేల్కోవాలని సూచిస్తున్నారు. లేకుంటే భవిష్యత్‌లో దేశాలు మాయమయ్యే పరిస్థితి ఉంటుందని హెచ్చరిస్తున్నారు.