Turkmenistan Gateway To Hell Finally Closed After 50 Years : అది ప్రపంచంలోనే వింత. ఎందుకంటే ఆ గొయ్యిలో యాభై ఏళ్లుగా మంటలు ఆగిపోలేదు. ఆపడానికి తుర్క్ మెనిస్థాన్ ప్రభుత్వం చేయని ప్రయత్నం లేదు.కానీ హఠాత్తుగా ఇప్పుడు ఆపగలిగారు. యాభై ఏళ్ల ప్రయత్నం విజయవంతం అయింది.
తుర్కమెనిస్తాన్ ప్రభుత్వం 'గేట్వే టు హెల్' గ్యాస్ క్రేటర్లో రగిలిన భారీ మంటలను చివరకు నియంత్రించగలిగినట్లు ప్రకటించింది. 'గేట్వే టు హెల్' లేదా 'డోర్ టు హెల్' అని ఈ ప్రాంతాన్ని పిలుస్తూంటారు. గత యాభై సంవత్సరాలుగా ఇక్కడ మంటలు ఆరలేదు. 1970లలో సోవియట్ డ్రిల్లింగ్ పొరపాటు కారణంగా ఈ భారీ మీథేన్ గుండం ఏర్పడింది. భూమిపై అత్యంత ఆకర్షణీయమైన మానవ నిర్మిత వింతలలో ఒకటిగా మారింది.
కరకుమ్ ఎడారిలో ఉన్న ఈ అగ్ని గుండం 1971లో సోవియట్ శాస్త్రవేత్తలు క్రేటర్ నుండి వెలువడుతున్న విషపూరిత వాయువులను నియంత్రించడానికి ప్రయత్నించినప్పుడు మంటలు చెలరేగాయి. మీథేన్ లీక్లను అధ్యయనం చేయడానికి చేసిన డ్రిల్లింగ్ భూగర్భ గ్యాస్ ఫీల్డ్ను తాకాయి. ఈ ప్రమాదం ఫలితంగా రగిలిన మంటలను ఆర్పలేకపోయారు. చరిత్రలో అత్యంత దీర్ఘకాలం నిరంతరం రగిలే మానవ నిర్మిత మంటగా మారాయి. గత 50 సంవత్సరాలలో ఈ మీథేన్ గుండంలోని మంటలను ఆర్పడానికి చేసిన ప్రతి ప్రయత్నం విఫలమైంది.
కాలక్రమేణా, ఈ స్థలం ఒక పర్యాటక ఆకర్షణగా మారింది. ఈ క్రేటర్ సుమారు 230 అడుగుల (70 మీటర్లు) వెడల్పు , 100 అడుగుల (30 మీటర్లు) లోతుతో ఉంటుంది. సందర్శకులు ఈ గుండం అంచున నిలబడి చూసేవారు. అయితే అత్యంత వేడిగా ఉంటుంది. అందుకే దీనికి నరకానికి ఒక ద్వారం అని పేరు పెట్టారు. రాత్రి సమయంలో, నక్షత్రాలతో నిండిన ఆకాశం కింద మండే మంటల దృశ్యం మరింత ఆకర్షణీయంగా ఉంటుందని పర్యాటకులు చెబుతూంటారు.
సందర్శకుల భద్రతను పెంచడానికి, 2018లో ఈ రగిలే గుండం చుట్టూ ఒక కంచె నిర్మించారు. అదే సంవత్సరంలో, ఈ గుండం పేరును 'షైనింగ్ ఆఫ్ కరకుమ్' అని పేరు మార్చారు. ఈ మంటల నుండి వచ్చే భారీ జ్వాల కొన్ని కిలోమీటర్ల దూరం నుండి కనిపించేది. ఇప్పుడు చాలా వరకూ మంట తగ్గిపోయింది. ప్రపంచంలో నాల్గవ అతిపెద్ద గ్యాస్ నిల్వలను కలిగి ఉన్న ప్రాంతం తుర్క్ మొనిస్థాన్.