Earthquakes:  భూకంపం... చాలా భయంకరమైన ప్రకృతి విపత్తు. ఇది వచ్చిందంటే చాలు సమస్తాన్ని తుడిచిపెట్టేస్తుంది. భూకంపం తీవ్రతను బట్టి ప్రాణ, ఆస్తి నష్టాలు సంభవిస్తుంటాయి. ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా ఈ విలయం వలన ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారు. ఎంతో ఆస్తి నష్టం జరిగింది. ఇక భూకంపం సంభవించిన ప్రాంతాలు కోలుకోవడానికి ఏళ్ల సమయం పడుతుంది. 


ప్రస్తుతం భూకంపం టర్కీ, సిరియా దేశాలను అతలాకుతలం చేసింది. ఈ రెండు దేశాల్లో ఈ విపత్తు కారణంగా ఇప్పటివరకు 4500 మంది మరణించారు. 14వేల మంది గాయపడ్డారు. మృతుల సంఖ్య ఇంకా పెరగవచ్చనే అంచనాలు ఆందోళన కలిగిస్తున్నాయి. ఆస్తి నష్టం ఎంతో ఇంకా అంచనా వేయలేదు. ఇప్పుడు ప్రపంచమంతా దీని గురించే మాట్లాడుకుంటోంది. ఈ క్రమంలో ఈ భూకంపాలు ఎలా వస్తాయో? దీనికి కారణాలేంటో తెలుసుకుందాం. 


భూకంపం అంటే?


భూమి లోపల అకస్మిక కదలికల కారణంగా భూకంపాలు సంభవిస్తుంటాయి. భూకంపం అనేది భూమి యొక్క క్రస్ట్‌లో అకస్మాత్తుగా విడుదలయ్యే స్ట్రెయిన్ ఎనర్జీ (ఒత్తిడి శక్తి). దీని ఫలితంగా భూమి లోపలి నుంచి బయటకు షేక్ చేసే తరంగాలు ఏర్పడతాయి. క్రస్ట్ లో ఏర్పడే ఒత్తిళ్లు చాలా వరకు రాతి పొర వరకు మాత్రమే వస్తాయి. రాతి పొర వాటిని పైకి రానీయకుండా చేస్తుంది. అయితే రాతి పొరను మించిపోయిన ఒత్తిడి వచ్చినప్పుడు... బలహీన ప్రాంతాాన్ని టార్గెట్ చేస్తుంది. అప్పుడు భూకంపం ఏర్పడుతుంది. 


భూకంపం రావడానికి కారణాలు


భూకంపం వచ్చినప్పుడు శక్తివంతమైన తరంగాలను విడుదల  అవుతాయి. వీటిని సీస్మిక్ తరంగాలు అంటారు. రాయి విసిరితే నీటిలో అలలు ఏర్పడినట్లే... భూకంప తరంగాలు భూమి లోపల, ఉపరితలంపై ప్రయాణిస్తాయి. అందులో రకాలు ఉంటాయి. అన్ని తరంగాలు అన్ని ప్రాంతాల్లో ప్రయాణించలేవు. అందుకే వాటిని రెండుగా విభజించవచ్చు. 


1. బాడీ తరంగాలు 2. ఉపరితల తరంగాలు


బాడీ వేవ్స్‌ భూమి లోపలి నుంచి ప్రయాణిస్తాయి. అవి భూకంపం కేంద్రం వద్ద పుట్టి.. చాలా వేగంతో ట్రావెల్ చేస్తాయి. వీటిని పీ, ఎస్‌ తరంగాలుగా విభజిస్తారు. 


ఉపరితల తరంగాలు భూకంపం ఏర్పడిన తర్వాత భూమి ఉపరితలంపై ప్రయాణించే తరంగాలు. భూకంపాల వల్ల జరిగే విధ్వంసానికి ప్రధానంగా ఈ వేవ్స్‌ కారణమవుతాయి. 


పీ తరంగాలనే ప్రాథమిక తరంగాలు అని కూడా అంటారు. భూకంపం సంభవించినప్పుడు సీస్మోగ్రాఫ్‌లను తాకే మొదటి తరంగాలు కాబట్టి వీటికి ప్రాథమిక వేవ్స్‌ అంటారు. ఇవి స్ట్రైట్‌గా ట్రావెల్ చేస్తాయి. 


ఎస్‌ తరంగాలను సెకండరీ వేవ్స్, షియర్ వేవ్స్ అని అంటారు. ఇవి సీస్మోగ్రాఫ్‌ను తాకిన రెండో తరంగాలు. అందుకే వీటికి సెకండరీ వేవ్స్ అని పిలుపుస్తారు. ఇవి అలలు మాదిరిగా ఘన పదార్థాల ద్వారా మాత్రమే ప్రయాణిస్తాయి. భూమి లోపల ఉంటే మైన్స్ గుర్తించడానికి  ఈ ఎస్‌ తరంగాలు ఉపయోగపడతాయి.  


భూమి అనేక పొరలతో కూడి ఉంటుంది. భూమిపైన పొర ఖండాల వద్ద 25 నుంచి 70 కి.మీ. వరకు.. మహాసముద్రాల కింద 5 నుంచి 10 కి.మీ వరకు మందంగా ఉంటుంది. ఈ పొర చాలా క్లిష్టంగా, రాళ్లతో కూడి ఉంటుంది. క్రస్ట్ కింద దాదాపు 2900 కి.మీ లోతులో మాంటిల్ ఉంటుంది. ఇది దట్టమైన సిలికేట్ శిలలతో ఉంటుంది. భూకంపాల నుంచి వచ్చే పీ, ఎస్ తరంగాలు రెండూ మాంటిల్ గుండా ప్రయాణిస్తాయి. దాదాపు 2900 కి.మీ లోతులో మాంటిల్ మరియు ఎర్త్ కోర్ మధ్య సరిహద్దు ఉంది. కోర్ ఇనుముతో కూడి ఉంటుంది. ఇది 103º మరియు 143º మధ్య దూరం వద్ద 'షాడో జోన్' సృష్టించే భూకంప తరంగాలను వక్రీభవనం చేస్తుంది.


ప్లేట్ టెక్టోనిక్స్


భూమి బయటి పొర టెక్టోనిక్ ప్లేట్లు అని పిలిచే 15 ప్రధాన స్లాబ్‌లతో విభజించి ఉంటుంది. ఈ స్లాబ్‌లు లిథోస్పియర్‌ను ఏర్పరుస్తాయి, ఇది క్రస్ట్ (కాంటినెంటల్ మరియు ఓషియానిక్) మరియు మాంటిల్ యొక్క ఎగువ భాగాన్ని కలిగి ఉంటుంది. టెక్టోనిక్ ప్లేట్లు ఒకదానికొకటి సాపేక్షంగా చాలా నెమ్మదిగా కదులుతాయి, సాధారణంగా సంవత్సరానికి కొన్ని సెంటీమీటర్లు కదులుతాయి. అయితే ఈ కదలికలు ఎక్కువగా ఉంటే ప్లేట్ సరిహద్దుల వద్ద డిఫర్మేషన్ కు కారణమవుతుంది. దీని ఫలితంగా భూకంపాలు సంభవిస్తాయి. చాలా భూకంపాలు టెక్టోనిక్ ప్లేట్ సరిహద్దులతో సంబంధం కలిగి ఉన్నాయని పరిశోధనలు చెప్తున్నాయి. 


మానవ తప్పిదాలు


భూకంపాలు రావడానికి మానవ తప్పిదాలు కూడా ఒక కారణం అంటున్నారు శాస్త్రవేత్తలు. పర్యావరణ సమతుల్యం దెబ్బతినడం, భూగర్భ జలాన్ని అధిక మొత్తంలో దుర్వినియోగం చేయడం. అడవుల్లో చెట్లను నరికివేయడం వంటి వాటి వల్ల కూడా భూకంపాలు సంభవించే అవకాశం ఉంది. పెద్ద పెద్ద ప్రాజెక్టుల్లో ఉన్న వందలాది ఘనపు మైళ్ల నీటి ఒత్తిడి భూమిపై పడడం వల్ల భూగర్భంలో మార్పులు జరిగి భూమి కంపిస్తుంది. భూమి తన చుట్టూ తాను తిరుగుతున్న సమయంలో భూమి అంతర్గత పొరల్లో సర్దుబాట్ల ఫలితమే ఈ ప్రకంపనలు జరగడానికి కారణమని శాస్త్రవేత్తలు చెప్తున్నారు.