Earthquakes: భూకంపాలు అత్యంత ప్రమాదకరమైన ప్రకృతి విపత్తు. ఏటా వందల సంఖ్యలో భూకంపాలు ప్రజలకు తీవ్ర నష్టాన్ని కలిగిస్తున్నాయి. ఎలాంటి హెచ్చరికలు లేకుండా ఒకేసారి భూమి కుంగిపోతుంది. ప్రజలు గుర్తించే లోపు తీవ్ర నష్టాన్ని కలిగించి విషాదాన్ని మిగుల్చుతుంది. ఇవే భూకంపాలు జనాభా ఎక్కువా ఉన్న చోట వస్తే మాత్రం ప్రాణ, ఆస్తి నష్టం భారీగా ఉంటుంది. అందుకు ఇప్పుడు టర్కీలో చూస్తున్న దృశ్యాలే నిదర్శనం. 


ఒకసారి భూకంపం సంభవించిందంటే ప్రాణ నష్టం భారీగా ఉంటుంది. ఆస్తినష్టం అంచనాలకు అందని స్థాయిలో ఉంటుంది. ఆ ప్రాంతం, అక్కడి బాధితులు కోలుకోవాలంటే ఏళ్లు పడుతుంది. అందుకే ప్రకృతి విపత్తులో భూకంపాలను అత్యంత ప్రమాదకరమైనదిగా చెప్తారు. 


భూకంపం అంటే ఏమిటి?


భూకంపం అనేది భూమి యొక్క క్రస్ట్‌లో అకస్మాత్తుగా విడుదలయ్యే స్ట్రెయిన్ ఎనర్జీ (ఒత్తిడి శక్తి). దీని ఫలితంగా భూమి లోపలి నుంచి బయటకు షేక్ చేసే తరంగాలు ఏర్పడతాయి. క్రస్ట్ లో ఏర్పడే ఒత్తిళ్లు చాలా వరకు రాతి పొర వరకు మాత్రమే వస్తాయి. రాతి పొర వాటిని పైకి రానీయకుండా చేస్తుంది. అయితే రాతి పొరను మించిపోయిన ఒత్తిడి వచ్చినప్పుడు... బలహీన ప్రాంతాాన్ని టార్గెట్ చేస్తుంది. అప్పుడు భూకంపం ఏర్పడుతుంది. భూకంపం ప్రారంభమయ్యే ప్రదేశాన్ని ఫోకస్ లేదా హైపోసెంటర్ అని పిలుస్తారు. ఇది భూమి లోపల చాలా కిలోమీటర్ల లోతులో ఉండవచ్చు. ఫోకస్ కు సమాంతరంగా పైన ఉన్న బిందువును భూకంప కేంద్రం అంటారు. 


ఫోకస్ స్థానం నుంచే తీవ్రమైన ప్రకంపనలు, భూకంప తరంగాలు అలల వలె వ్యాపిస్తాయి. ఈ తరంగాలు భూమి కంపించేలా చేస్తాయి. అక్కడి నుంచి  అన్ని దిశల‌్లో ఒత్తిడిని బట్టి ఎక్కువ దూరం ప్రయాణిస్తాయి. పోకస్ దగ్గర ప్రకంపనలు చాలా వైల్డ్‌గా ఉంటాయి. అక్కడ చాలా విధ్వంసాన్ని సృష్టిస్తాయి.


బ్రిటీష్ జియోలాజికల్ సర్వే భూకంప పర్యవేక్షణ


యూకే లోని జాతీయ భూకంప పర్యవేక్షణ సంస్థలోని శాస్త్రజ్ఞుల బృందం బ్రిటీష్ జియోలాజికల్ సర్వే పేరుతో భూకంపాలపై పర్యవేక్షణ చేస్తుంది. వీరు దీవులలో, ప్రపంచవ్యాప్తంగా భూకంపాలను కొలవడానికి సెన్సార్ల నెట్ వర్క్ ను నిర్వహిస్తారు. భూకంపం స్వభావం, దానిని పరిశోధించడం, భూకంప ప్రమాదాల గురించి అవగాహనను మెరుగుపర్చడం లాంటి పనులను ఈ సంస్థ నిర్వహిస్తుంది. 


భూకంపంతో టర్కీ, సిరియాలు అతలాకుతలం 
 
టర్కీ, సిరియాలో సంభవించిన భారీ భూకంపం పెను విషాదాన్ని మిగిల్చింది. ఇప్పటికే భారీగా ప్రాణ నష్టం సంభవించగా.. మృతుల సంఖ్య దాదాపు 4 వేలకు చేరుకుంది. ఆగ్నేయ టర్కీ ప్రాంతంలో, ఉత్తర సిరియాలో సోమవారం తెల్లవారుజామున భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 7.8 గా నమోదు అయింది. దీని తీవ్రతకు భారీ భవనాలు నిమిషాల్లో నేలమట్టం అయ్యాయి. చాలామంది శిథిలాల కింద చిక్కుకోవటంతో మరణాల సంఖ్య మరింతగా పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. 


టర్కీలోని 10 నగరాల్లో భూకంప తీవ్రత అధికంగా ఉంది. టర్కీ కాలమానం ప్రకారం సోమవారం తెల్లవారుజామున 4.17 గంటలకు భూకంపం సంభవించింది.  భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 7.8గా నమోదైనట్లు యూఎస్‌ జియోలాజికల్‌ సర్వే ప్రకటించింది.  ఆగ్నేయ టర్కీలోని గాజియాన్‌తెప్‌ ప్రాంతానికి 33 కిలోమీటర్ల దూరంలో 18 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం ఉన్నట్లు పరిశోధకులు గుర్తించారు.